Janasena internal conflicts: జనసేన పార్టీకి కొత్త తలనొప్పి ప్రారంభం అయింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా 11 మందిని ఇన్చార్జులుగా నియమించారు పవన్ కళ్యాణ్. రాయలసీమతో పాటు ప్రకాశం,నెల్లూరు బాధ్యతలను బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో పాటు మరో ఇద్దరు నేతలకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు వంటి వాటిపై పార్టీ క్యాడర్ అభిప్రాయాలు సేకరించాల్సిన పని ఈ కమిటీకి ఉంది. అందులో భాగంగా రాయలసీమ రీజియన్కు సంబంధించి సమావేశం నిర్వహించగా రచ్చకు దారితీసింది. పార్టీలో కీలక నాయకులుగా ఉన్న వారిని వ్యతిరేకిస్తూ.. కొందరు నాయకులు బహిరంగ విమర్శలు చేశారు. సమావేశం నిర్వహణను కూడా బహిష్కరించారు. దీంతో ఇప్పటివరకు జనసేన లో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.
ఆ నేతల్లో అసంతృప్తి..
పార్టీలో ప్రారంభం నుంచి ఉన్న నేతలకంటే పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం లభిస్తుందన్న టాక్ జనసేనలో ఉండి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారితోనే ఇటువంటివి జరుగుతున్నాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అటువంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వాస్తవంగా చెప్పాలంటే మాజీ మంత్రి బాలినేని వ్యతిరేకిస్తూ గళం విప్పారు ఎక్కువ మంది నేతలు. బాలినేని రాకను జనసేన లోని ప్రధాన వర్గం వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బాలినేని నియామకం, అదే నేత సమావేశం నిర్వహించడాన్ని ఆయన వ్యతిరేకులు తట్టుకోలేకపోయారు.
ఇంకోవైపు ఇదే కమిటీ లో ఉన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. ఇదే సమావేశంలో ఒకరికొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఈ పరిణామాలతో బాలినేని సహా అందరూ విస్తు పోయారు. అయితే ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన లో చేరిన నేతలతోనే ఈ పరిస్థితి అని అర్థమవుతోంది. ఎందుకంటే బాలినేని సైతం వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరారు. ఎన్నికల ముందు ఆరని శ్రీనివాసులు సైతం వైసీపీ నుంచి జనసేన లోకి వచ్చారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి వచ్చిన నేతలకు ఎటువంటి ప్రాధాన్యం లేదు. దీంతో పార్టీలో విభేదాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఇలా అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన నెగ్గుకు రావడం మాత్రం కష్టం.