CM Chandrababu Delhi tour: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాదులోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఉత్సాహంగా గడిపిన ప్రధాని నరేంద్ర మోడీ.. తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా వెళ్లారు. ఇటీవల అస్వస్థతతో ఆపరేషన్ చేసుకున్న పవన్ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు ప్రధాని పర్యటన తర్వాత రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రత్యేక విమానంలో ఢిల్లీకి..
ఈరోజు ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. ఉదయం 11:30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు. తరువాత జల శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై వారి మధ్య చర్చలు జరగనున్నాయి. నిధుల విడుదలకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో ఆయన చర్చిస్తారని తెలుస్తోంది. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశం కానున్నారు చంద్రబాబు. సాయంత్రం నాలుగు గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో జరిగే భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ మీటింగుకు కూడా హాజరవుతారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్రదేవ్, నీతి ఆయోగ్ సభ్యులకు కూడా సమావేశం కానున్నారు. చంద్రబాబు రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు గౌహతి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు చంద్రబాబు. అక్కడ నుంచి నేరుగా అమరావతికి చేరుకోనున్నారు.
మొన్ననే పశ్చిమ బెంగాల్ కు..
మొన్ననే బెంగాల్ సీఎం సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు సీఎం చంద్రబాబు.. ఎన్డీఏ లో తెలుగుదేశం కీలక భాగస్వామి కావడంతో కేంద్రంలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఆహ్వానం అందుతోంది చంద్రబాబుకు. గతం కంటే ఎక్కువగానే గౌరవిస్తున్నారు. నిన్ననే హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు నివాసానికి వెళ్లి గంట పది నిమిషాల పాటు గడిపారు. అధికారిక పర్యటనకు వచ్చి ఒక నేత ఇంటికి ప్రధాని స్థాయి వ్యక్తి వెళ్లడం చాలా అరుదు. అయితే గతం కంటే చంద్రబాబుకు కేంద్ర పెద్దలు ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈరోజు అంతా ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీగా గడుపుతారు.