AP Elections 2024: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. ఇది చాలా సందర్భాల్లో చూస్తుంటాం. అటువంటి దృశ్యమే ఏపీ రాజకీయాల్లో కనిపించింది. సీఎం జగన్ ఓడించేందుకు మరో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రిలు ఒకే వేదికపైకి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టిడిపి అధినేత చంద్రబాబు, బిజెపి నేత కిరణ్ కుమార్ రెడ్డిలు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో ఇద్దరి మధ్య వైరం నడిచేది. కానీ అనూహ్య పరిణామాలు నడుమ ఇద్దరూ ఒకటయ్యారు. జగన్ ను ఓడించేందుకు కలిసి పని చేస్తున్నారు.కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు.అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికై.. మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు టిడిపిలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువుగా మారారు. ఆ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి సైతం చంద్రబాబుపై దారుణంగా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వైయస్ అకాల మరణంతో కిరణ్ సీఎం అయిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రిగా ఆయన పని చేశారు. అదే సమయంలోనే జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. వైసీపీని ఏర్పాటు చేసి ఆనాటి కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. కానీ చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడారు.
అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది. కిరణ్ రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. కొద్దిరోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆ పార్టీకి భవిష్యత్తు లేదని బిజెపిలో చేరారు. ప్రస్తుతం ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి కట్టాయి. దీంతో కిరణ్ కు రాజంపేట పార్లమెంట్ స్థానం దక్కింది. దీంతో కిరణ్ చంద్రబాబుతో చేతులు కలపాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలు ఒకే వేదికపై దర్శనం ఇచ్చారు. వీరితోపాటు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పవన్ వారితో సెల్ఫీ తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక సీఎంను ఓడించేందుకు ఇద్దరు మాజీ సీఎంలు ఏకమయ్యారన్న కామెంట్ హైలెట్ అవుతోంది.