Andhra Pradesh latest political survey: ఏపీలో ( Andhra Pradesh) పార్లమెంట్ సభ్యుల పనితీరుపై ఒక సర్వే జరిగింది. గత కొంతకాలంగా సాగిన ఈ సర్వే ఫలితాలను సదరు సంస్థ ప్రకటించింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను మొన్నటి ఎన్నికల్లో కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. 21చోట్ల కూటమి గెలుపొందింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. కూటమి కట్టిన మూడు పార్టీలు సంయుక్తంగా ఎక్కువ స్థానాలు గెలుచుకున్నాయి. మోదీ నేతృత్వంలో ఎన్డీఏ మూడోసారి కొలువుదీరేందుకు ఏపీ మెజారిటీ అక్కరకు వచ్చింది. అందుకే కేంద్ర ప్రభుత్వంలో సైతం ఏపీకి తగిన ప్రాధాన్యం దక్కుతోంది. ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇక సహాయ మంత్రులుగా పెమ్మసాని చంద్రశేఖర్, భూపతి రాజు శ్రీనివాస వర్మ ఉన్నారు. ఈ రెండేళ్ల కాలంలో ఏపీ ఎంపీల పనితీరుపై రైజ్ అనే సంస్థ సర్వే చేపట్టింది. ఆ సర్వే ఫలితాలను వెల్లడించింది.
రైజ్ సర్వే సంస్థ
ఓ 13 మంది ఎంపీల పనితీరుపై నివేదికలు ఇచ్చింది రైజ్ సర్వే సంస్థ. మొన్నటి ఎన్నికల ఫలితాల్లో టిడిపి కూటమి ఘనవిజయం సాధిస్తుందని ఈ సంస్థ చెప్పింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలోనే సర్వేలు ఇస్తూ వచ్చింది. ఇప్పుడు అదే సంస్థ ఎంపీల పనితీరుపై సర్వేలు ఇవ్వడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇటీవల డ్రగ్స్ కేసులో చిక్కుకున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పనితీరులో రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉన్నట్లు చెబుతోంది ఈ సర్వే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు జనసేన ఎంపీ కూడా తన పనితీరు మెరుగుపరుచుకున్నట్టు ఈ సర్వే చెబుతోంది.
ఆ 13 మంది ఎంపీలు వీరే..
ఎంపీల పనితీరుకు సంబంధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నారు గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రెండో స్థానంలో మరో కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నిలిచారు. మూడో స్థానంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, నాలుగో స్థానంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఐదో స్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఆరో స్థానంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఏడో స్థానంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎనిమిదో స్థానంలో చిత్తూరు వైసీపీ ఎంపీ ప్రసాదరావు, తొమ్మిదో స్థానంలో నరసాపురం, కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, పదో స్థానంలో విశాఖ ఎంపీ మార్గాన్ని శ్రీ భరత్, 11వ స్థానంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, 12వ స్థానంలో జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, 13వ స్థానంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నిలిచారు. ప్రస్తుతం ఈ సర్వే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
