Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి. తాజాగా మరో డేటా సెంటర్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. టాటా సెంటర్ తో పాటుగా లిథియం అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్ ఇన్ గాట్, రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు కొన్ని ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ ఎఫ్ఐపిసి ఈ ప్రతిపాదనను పరిశీలించింది.
* కమిటీ సమావేశం..
సి.ఎస్ సాయిప్రసాద్ అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం జరిగింది. దాదాపు 72 వేల కోట్ల పెట్టుబడులతో.. 14,190 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయా పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేశారు. గతంలో ఇచ్చిన అనుమతుల్లో సవరణలు, గడువు పెంపు, చెల్లించాల్సిన ఫీజుల మాఫీపై కూడా చర్చించారు. విశాఖలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ డేటా సెంటర్ 58,743 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఐదు దశల్లో రాబోయే 10 ఏళ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదించారు.. 1200 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
* కర్నూలు జిల్లా గుట్టపాడు ఇండస్ట్రియల్ పార్కులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ దాదాపు 7800 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ 12 గిగా వాట్ల సోలార్ ఇన్ ఘాట్, 12 గిగావాట్ల సోలార్ వేఫర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించారు. దాదాపు 1000 మందికి ఉపాధి దక్కనుంది.
* శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పాస్పరిక్ యాసిడ్ అండ్ అసోసియేటెడ్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. 2,125 కోట్ల పెట్టుబడితో 400 మందికి ఉపాధి కల్పించనున్నారు.
* నెల్లూరు జిల్లా మనుబోలులో విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 500 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రెండు వేల మందికి ఉపాధి దక్కి అవకాశం ఉంది.
* కడప జిల్లా కొప్పర్తిలో ఐ ఎల్ డిక్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదించింది. 450 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
* నెల్లూరు జిల్లాలో ప్రిసోల్ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ 330 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. 1110 మందికి ఉపాధి కల్పించనుంది.






