HomeతెలంగాణMalla Reddy: ప్రధానమంత్రి చాయ్ అమ్మినట్టు.. దేశాన్ని అమ్ముతున్నాడట.. మరి నీ సంగతేందే పాల మల్లన్న..

Malla Reddy: ప్రధానమంత్రి చాయ్ అమ్మినట్టు.. దేశాన్ని అమ్ముతున్నాడట.. మరి నీ సంగతేందే పాల మల్లన్న..

Malla Reddy: ట్విట్టర్లో ఓ వీడియో తెగ కనిపిస్తోంది. అందులో మాట్లాడుతోంది గత భారత రాష్ట్ర సమితి పరిపాలన కాలంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి అలియాస్ పాల మల్లారెడ్డి. ఈయన నడిపిస్తున్న విద్యాసంస్థలపై.. ఈయన సాగిస్తున్న ఇతర వ్యవహారాలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈయన కార్యాలయాల మీద దాడులు చేశాయి. అప్పట్లో కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై అప్పట్లో మల్లారెడ్డి నానా యాగీ చేశారు. పాలు అమ్మి.. పూలు అమ్మి.. ఇక్కడ దాకా వచ్చానని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఇప్పటికి కూడా ఆ వ్యాఖ్యలు దర్శనమిస్తూనే ఉన్నాయి. నాటి నుంచి సోషల్ మీడియాలో మల్లారెడ్డి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. ఆ తర్వాత ఆ డైలాగును పదేపదే వల్లె వేశారు. చివరికి మల్లారెడ్డి కాస్త పాల మల్లారెడ్డి అయిపోయారు. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. తను కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి నిండు శాసనసభలో కెసిఆర్ ను దేవుడిగా కీర్తించారు. ప్రధానమంత్రి అవుతాడని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని దీవించారు. కానీ ఏ ముహూర్తాన ఆయన ఆ మాటలు అన్నారో తెలియదు కానీ.. భారత రాష్ట్ర సమితి మూడోసారి అధికారంలోకి రాకుండా పోయింది. ప్రధానమంత్రి కాదు కదా.. కామారెడ్డిలో పోటీ చేసిన కేసీఆర్ ఓడిపోయారు. కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే కే పరిమితమైపోయారు.

నిండు శాసనసభలో

ఇక భారత రాష్ట్రపతి అధికారంలో ఉన్నప్పుడు… భారతీయ జనతా పార్టీతో విభేదాలు మొదలైనప్పుడు.. గులాబీ పార్టీ నాయకులు బిజెపి నేతలపై అడ్డగోలుగా విమర్శలు చేసేవారు. నిండు శాసనసభలో ఇష్టానుసారంగా మాట్లాడేవారు. చివరికి పాల మల్లారెడ్డి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించడం మొదలుపెట్టారు. కాకపోతే మల్లారెడ్డి వ్యంగ్యంగా మాట్లాడుతారు కాబట్టి సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. చాయ్ అమ్మినట్టు.. దేశాన్ని కూడా నరేంద్ర మోడీ అమ్ముతున్నారని.. పబ్లిక్ సెక్టార్ మొత్తాన్ని విక్రయిస్తున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు. అంతేకాదు నరేంద్ర మోడీపై ఇంకా విచిత్రంగా వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు శాసనసభలో భారత రాష్ట్రపతి నాయకులు గట్టిగా నవ్వడం విశేషం. అయితే ఈ వీడియోను ఇప్పుడు కొంతమంది కావాలని ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అధికారంలో లేకపోవడంతో.. బిజెపి నాయకులు రెస్పాండ్ అవుతున్నారు. అంతేకాదు నరేంద్ర మోడీ దేశాన్ని కనుక అమ్మితే ప్రజలు మూడోసారి ఎందుకు అధికారం ఇస్తారని.. మీకు ఎందుకు మూడోసారి అధికారం ఇవ్వలేకపోయారని మల్లారెడ్డిని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు. అమ్మడం గురించి మల్లారెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వళ్లించినట్టు ఉంటుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. పాత వీడియో అయినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లో ఈ వీడియో ఉండడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular