Ellamma Cheruvu: గోదావరి కిందికి పోతుంటే పైకి తీసుకొచ్చాం. వందల మీటర్లు గ్రావిటీకి వ్యతిరేకంగా ప్రవహించేలా చేసాం. లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. తాగునీటి అవసరాలు తీర్చాం. సాగునీటి అవసరాలు తీర్చాం. దేశానికే సరికొత్త మోడల్ తీసుకొచ్చాం. ఇదే కదా కాలేశ్వరం విషయంలో గులాబీ పార్టీ నాయకులు చెప్పేది.
వాళ్ల సొంత ప్రచారం.. ఇతర వ్యవహారాలను పక్కనపెడితే.. ఇవాల్టికి తెలంగాణకు బలం గొలుసుకట్టు చెరువులు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో సాగు నిలబడింది. పంటలు పండడానికి ఆస్కారం ఏర్పడింది. ప్రజల కడుపు నిండింది. పశువులకు దప్పిక తీరింది. ఈరోజుకు కూడా.. ఇంతటి ఆధునిక కాలంలో.. తెలంగాణ రాష్ట్రం ఒక అన్నపూర్ణగా నిలుస్తోంది.. దేశానికి పట్టడు అన్నం పెడుతుంది అంటే దానికి ప్రధాన కారణం గొలుసుకట్టు చెరువులు.
గొలుసుకట్టు చెరువుల్లో ఈ చెరువు ది ప్రత్యేకమైన స్థానం. ఒక రకంగా తెలంగాణకు మాత్రమే కాదు.. యావత్ దేశానికే ఆదర్శం.. మెతుకు సీమగా పేరు గాంచిన మెదక్ జిల్లాలోని బషీరాబాద్ మండలం మైల్వార్ అనే గ్రామం ఉంది. ఇక్కడ ఎల్లమ్మ చెరువు సుప్రసిద్ధమైనది. ఇక్కడ రైతులు వెనుకాటి కాలం నుంచి నీటి వినియోగంలో పొదుపు మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఈ గ్రామం శివారు ప్రాంతంలో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. దీని కింద 250 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. అయితే ఆయకట్టు రైతులు ఇక్కడి చెరువులో ఉన్న నీటిని నేరుగా వినియోగించుకోరు. తూములు ఉపయోగించరు. కాలువలలో కూడా నీటిని వాడరు.
ఇలా నీటిని వాడితే 50% వరకు వృధా అవుతుందని రైతులు భావిస్తుంటారు. అందువల్లే ఇక్కడి రైతులు కేవలం బోర్ల ద్వారా మాత్రమే పంట పొలాలు సాగు చేస్తుంటారు. ఈ చెరువులో నీటిని అలాగే ఉంచుతారు. ఈ చెరువు కింద దాదాపు 40 వరకు బోర్లు ఉన్నాయి. చెరువు నీటిని అలానే ఉంచడం వల్ల ఇక్కడ భూగర్భ జలాల మట్టం పెరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పది అడుగుల లోతరించే భూగర్భ జలాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరువు ఉన్నప్పటికీ.. ఇక్కడ మాత్రం బోర్లు సమృద్ధిగా పోస్తున్నాయి. రైతులు కూడా పంటలు సాగు చేస్తున్నారు. ఇక్కడ రైతులు వరి సాగులో నిమగ్నమై ఉన్నారు. చెరువులో నీటిని ఇక్కడ రైతులు నీటి బ్యాంక్ లాగా మార్చడం వల్లే ఇంతటి ఘనతను సాధిస్తున్నారు.
ఈ చెరువు నీళ్లపల్లి.. మైల్వార్ రిజర్వ్ ఫారెస్ట్ కు దగ్గరగా ఉంటుంది. అందువల్లే ఇక్కడ నీళ్లు అడవి జంతువులకు ప్రాణాదారంగా ఉంటాయి. ఇక్కడ చెరువులో నీళ్లు కాలాలతో సంబంధం లేకుండా మూగజీవాలు ఇక్కడికి వస్తుంటాయి. కేవలం పంటలు పండడమే కాకుండా.. మూగజీవాలకు కూడా ఈ చెరువు ఆధారంగా ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇటువంటి విధానాలను కనుక రైతులు పాటించగలిగితే కచ్చితంగా ఎటువంటి కరువు పరిస్థితులు వచ్చినప్పటికీ ఇబ్బంది ఉండదని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు.





