Team India defeat: మహాభారతంలో కర్ణుడు చనిపోతాడు. అతడు చనిపోవడానికి అనేకం కారణాలు ఉంటాయి. ఇప్పుడు టీమ్ ఇండియా దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడం వెనక కూడా అనేక కారణాలు ఉన్నాయి. టీమిండియా ఓడిపోవడం అది కూడా స్వదేశంలో ఓటమి పాలు కావడం సగటు అభిమానికి ఏమాత్రం నచ్చడం లేదు. వాస్తవానికి దక్షిణాఫ్రికా కంటే అన్ని విభాగాలలో మెరుగైన స్థానంలో ఉన్న ఇండియా ఇలా ఓడిపోవడం ఆవేదన కలిగిస్తోంది.
అహ్మదాబాద్ పిచ్ ను నల్ల మట్టితో రూపొందించారు. సహజంగా టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటుంది. దక్షిణాఫ్రికా కూడా అదే చేసింది. దక్షిణాఫ్రికా 20 పరుగుల కే మూడు వికెట్ల కోల్పోయింది. ఈ దశలో టీమిండియా బౌలర్లు పట్టు సడలించారు. ఇదే అదునుగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రెచ్చిపోయారు.
బ్రేవిస్ (45), డేవిడ్ మిల్లర్ (63) ఏకంగా నాలుగో వికెట్ కు 97 పరుగులు జోడించారు. ఇక్కడే దక్షిణాఫ్రికా జట్టు తిరిగి మ్యాచ్ లోకి వచ్చింది. ఆ తర్వాత స్టబ్స్(44*) దూకుడు కొనసాగించడంతో.. దక్షిణాఫ్రికా జట్టు మెరుగైన స్థితి నుంచి భారీ స్థాయి అనే విధంగా పరుగులు చేసింది. నాలుగో వికెట్ కు 97, ఇదో వికెట్ కు 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో దక్షిణాఫ్రికా భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది.
భారత బౌలర్లలో బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ మాత్రమే అదరగొట్టారు. మిగతా వారంతా దారుణంగా పరుగులు ఇచ్చారు. మొదట్లో మూడు వికెట్లు తీసి సత్తా చూపించిన టీమ్ ఇండియా బౌలర్లు.. ఆ తర్వాత చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా జట్టును వంద పరుగుల లోపు ఆల్ అవుట్ చేస్తారని అనుకుంటుంటే.. ఏకంగా 187 పరుగులు సమర్పించుకొని.. తమ వైఫల్యాన్ని బయట పెట్టుకున్నారు. నల్లటి మట్టితో రూపొందించిన పిచ్ మీద వికెట్లు తీయలేక ఆపసోపాలు పడ్డారు. శివం దుబే, హార్థిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి.. ఇలా కీలక బౌలర్లు పరుగులు ఇవ్వడంలో పోటీపడ్డారు. వైవిధ్య భరితమైన బౌలింగ్ వేస్తాడనే పేరు ఉన్న వాషింగ్టన్ సుందర్ కూడా చేతులెత్తేశాడు. దీంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు పండగ చేసుకున్నారు.