ఐపీఎల్ పదమూడో సీజన్ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించబోతున్నాడు. తొలి పోరులో ఇరు జట్లూ స్టార్ ప్లేయర్లతో బరిలోకి దిగాయి. రెండు జట్లూ చెరో నలుగురు విదేశీ క్రికెటర్లతో ఆడుతున్నాయి. ముంబై జట్టు ఫారిన్ కోటాలో క్వింటన్ డికాక్, కీరన్ పొలార్డ్, జేమ్స్ ప్యాటిన్సన్, ట్రెంట్ బౌల్డ్లను ఎంచుకుంది. మరోవైపు ధోనీ సేన.. షేన్ వాట్సన్, డుప్లెసిస్, సామ్ కరన్, లుంగి ఎంగిడిలను తీసుకుంది. అయితే, చెన్నై టీమ్లో స్టార్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో లేకపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో అతని మోకాలికి గాయమైంది. ఆ టోర్నీ ఫైనల్లో అతను బౌలింగ్ చేయలేదు. గాయం ఇంకా తగ్గకపోవడంతో ఐపీఎల్ ఫస్ట్మ్యాచ్కు అతను దూరమయ్యాడు. ఇక, కరోనా బారిన పడి కోలుకున్న చెన్నై పేసర్ దీపక్ చహర్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగడం విశేషం. అందరికంటే ఆలస్యంగా ప్రాక్టీస్ ప్రారంభించినప్పటికీ అతను పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ధోనీ అతడిని తుది జట్టులోకి తీసుకున్నాడు.
Also Read: ధోనీ దంచికొడతాడా?.. రో‘హిట్’ అవుతాడా? ఐపీఎల్లో బోణీ కొట్టేదెవరు..?
ముంబై తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరబ్ తివారీ, క్రునాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
చెన్నై తుది జట్టు: మురళీ విజయ్, షేన్ వాట్సన్, డుప్లెసిస్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ధోనీ (కెప్టెన్, కీపర్), జడేజా, సామ్ కరన్, దీపక్ చహర్, పీయుష్ చావ్లా, లుంగి ఎంగిడి.