Home Blog Page 87

వైసిపి కమ్మ నేతల ఆవేదన!

YSRCP Kamma Leaders Reaction
YSRCP Kamma Leaders Reaction

YSRCP Kamma Leaders Reaction: ఏపీలో ప్రస్తుతం కులం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఫలానా కులం పేరు చెబితే ఫలానా పార్టీ అని ఇట్టే చెప్పేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గమంతా వైయస్సార్ కాంగ్రెస్.. కమ్మ సామాజిక వర్గమంతా టిడిపి.. కాపు సామాజిక వర్గం అంతా జనసేన అన్నట్టు పరిస్థితి ఉంది. కానీ నాయకత్వాలతో పడని సొంత సామాజిక వర్గం వారు ప్రత్యర్థి పార్టీల్లో చేరుతుంటారు. ఈ మూడు పార్టీలకు ఆ బెడద ఉంది. 2014, 2019లో రెడ్డి సామాజిక వర్గమంతా వైసిపి కి అండగా నిలిచింది. 2024 లో మాత్రం చేతులెత్తేసింది. 2014, 2024లో టిడిపికి అండగా నిలిచింది కమ్మ సామాజిక వర్గం. 2019లో మాత్రం చేతులెత్తేసింది. 2019లో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ కు అండగా నిలవలేదు. 2024 లో మాత్రం ఏకపక్షంగా నిలిచింది పవన్ కళ్యాణ్ కు.

చంద్రబాబు వ్యతిరేకులంతా..
అయితే సామాజిక వర్గం ఎప్పుడు స్థిరంగా ఉండదు. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే సామాజిక వర్గాలు పనిచేస్తాయని స్పష్టం అవుతోంది. అయితే చంద్రబాబు నాయకత్వాన్ని వ్యతిరేకించే కమ్మ సామాజిక వర్గాన్ని చేరదీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ వారికి రాజకీయంగా ప్రోత్సహించింది చాలా తక్కువ. ప్రస్తుతం వైసీపీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, తలసీల రఘురాం, దేవినేని అవినాష్, అబ్బయ్య చౌదరి వంటి నేతలే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్న పదిమంది నేతలు లోపు ఉంటారు. చంద్రబాబును దారుణంగా తిట్టించేందుకే అన్నట్టు వీరు ఉండేవారు. అయితే వీరిని ఉపయోగించుకున్నంతగా రాజకీయ ప్రయోజనాలు కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి.

రాజకీయ ప్రాధాన్యం లేక..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి తలసీల రఘురాం జగన్ వెంట అడుగులు వేశారు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి.. జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల కోఆర్డినేటర్ గా పనిచేస్తూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయనే. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే ఆ కోఆర్డినేటర్ పదవిలో కొనసాగారు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు. మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా టాక్ నడిచింది. కానీ ఎందుకో అంత ప్రాధాన్యం ఇవ్వలేదు.

కొడాలి నాని కి ఇచ్చినట్టే ఇచ్చి..
ఎంతో కొంత ప్రాధాన్యం దక్కింది అంటే కొడాలి నాని ద్వారా. మంత్రిగా చాన్స్ ఇచ్చారు. కానీ మంత్రి పదవిలో స్వేచ్ఛ ఇవ్వలేదు కానీ.. చంద్రబాబును తిట్టేందుకే అన్నట్టు కొడాలి నానితోపాటు వల్లభనేని వంశీ మోహన్ ను ప్రయోగించారు. కానీ వారి రాజకీయ జీవితాన్ని మాత్రం ఇబ్బందుల్లో పెట్టారు. ఇప్పుడు వైసీపీలో కమ్మ నేతలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. వారిని ఒక వివాదాస్పదులుగా చిత్రీకరించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఆ విషయం వైసీపీలో ఉన్న కమ్మ నేతలు తెలుసుకునేసరికి ఆలస్యం జరిగింది. అందుకు వారు మూల్యం చెల్లించుకున్నారు కూడా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా వారు తెలియడం లేదు. అంతలా వారి పొలిటికల్ కెరీర్ డ్యామేజ్ అయింది. జగన్మోహన్ రెడ్డి తమను ఇంతలా వాడుకున్నారా అని వారు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు తమను పట్టించుకోకుండా కాపు నేతలకు ప్రోత్సాహం అందించడం పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

బౌలింగ్ వేయడం కూడా రాదా..ఇంగ్లాండ్ పరువు మాత్రమే కాదు.. అది కూడా కోల్పోయింది..

England Vs New Zealand
England Vs New Zealand

England Vs New Zealand: క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ దేశంలో.. క్రికెట్ లో ఇంగ్లాండ్ ఎన్నో రికార్డులను నెలకొల్పింది.. అటువంటి ఇంగ్లాండ్ జట్టు ఇప్పుడు వరుసగా పరువు తీసుకుంటున్నది. సొంత గడ్డమీద కూడా సరిగా ఆడలేక చేతులెత్తేస్తున్నది. అంతేకాదు ఐసీసీ గర్వ భంగానికి గురవుతున్నది. వాస్తవానికి ఇంగ్లాండ్ జట్టు ఇలా ఆడటం పట్ల అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. క్రికెట్ పుట్టిన దేశంలో ఏంటి ఈ కర్మ అంటూ వాపోతున్నారు.

ప్రస్తుతం ఇంగ్లాండ్ గడ్డలో న్యూజిలాండ్ పర్యటిస్తోంది. మూడు టెస్టుల సిరీస్ ఆడుతోంది. తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలిచింది. రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టు తొలి టెస్ట్ లో గొప్పగా ఆడినప్పటికీ.. రెండవ టెస్టులో చేతులెత్తేసింది. ఫలితంగా పర్యాటక న్యూజిలాండ్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వాస్తవానికి ఈ ఓటమి కంటే కూడా ఇంగ్లాండ్ జట్టుకు దారుణమైన ఫలితం మరొకటి ఎదురైంది. అది ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు నుంచి కాదు.. అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి నుంచి.

న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు దారుణంగా బౌలింగ్ వేసింది. ఫలితంగా 253 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. వాస్తవానికి ఈ ఓటమి ఇంగ్లాండ్ జట్టుకు పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినప్పటికీ.. ఐసీసీ తీసుకున్న నిర్ణయం ఇంగ్లాండ్ జట్టుకు మరణ శాసనం రాసింది.. ఇంగ్లాండ్ జట్టు బౌలర్లు నిదానంగా బౌలింగ్ వేశారు. 12 ఓవర్లను ఆలస్యంగా వేయడంతో ఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు 12 పాయింట్లను కోత విధించింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఖాతాలో 50 నుంచి పాయింట్ల సంఖ్య 38 కి పడిపోయింది. అంతేకాదు ఇంగ్లాండ్ సారథిగా వ్యవహరించిన రూట్ కు జరిమాన కూడా పడింది. మ్యాచ్ ఫీజులో 50 శాతాన్ని ఐసీసీ క్రమశిక్షణ కమిటీ కోసివేసింది.

ఇప్పటికే ఇంగ్లాండు జట్టుకు పాయింట్లు తగ్గిపోయాయి. డబ్ల్యూటీసి జాబితాలో ఇంగ్లాండ్ ఏకంగా ఏడవ స్థానంలో కొనసాగుతోంది. పర్సంటేజ్ తగ్గిందని ఆటగాళ్లు ఇబ్బంది పడుతుంటే.. పాయింట్లు పరంగా కూడా కోత విధించడంతో ఇంగ్లాండ్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఇదంతా జరిగిందని.. ఇకపై నైనా ఇంగ్లాండ్ ఆటగాళ్లు మెరుగైన ఆట తీరు కొనసాగిస్తారని.. ఆ జట్టు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెండు టెస్టులకు దూరమైన స్టోక్స్.. మూడో టెస్టుకు జట్టులోకి అందుబాటులోకి వచ్చాడు.

బండ మొహం వాడే హీరో అయ్యాడు.. తమిళ సిఎం అయ్యాడు..

CM Vijay Career Journey
CM Vijay Career Journey

CM Vijay Career Journey: బంతిని ఎంత గట్టిగా కొడితే అది అంత పైకి లేస్తుంది. రాయిని ఎంత వేగంగా విసిరితే అంతే వేగంతో కిందికి వస్తుంది. విజయ్ కూడా అంతే.. ఎంత దారుణంగా అయితే మాటలు పడ్డాడో.. ఎందరి నోటి నుంచి అయితే విమర్శలు ఎదుర్కొన్నాడో.. అందరికీ అంతే స్థాయిలో సమాధానం చెప్పాడు.. ఇళయ దళపతి నుంచి మొదలుపెడితే సీఎం విజయ్ వరకు అతని ప్రస్థానం చాలా గొప్పది. అలాగని గొప్పగా సాగలేదు. పడి లేచిన తర్వాత నిలబడ్డాడు. ఇప్పుడు స్థిరపడ్డాడు. సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జన్మదిన నేపథ్యంలో.. అతడి సినిమా ప్రయాణం.. రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేక కథనం..

సినిమాలోకి వచ్చేముందు విజయ్ ని చాలామంది విమర్శించారు. అతడికి నటన రాదు అన్నారు. బండ మొహం అన్నారు. నల్లగా ఉంటాడని ఎగతాళి చేశారు. నీకు సినిమాలో నటించడం రాదు గాని వెళ్ళిపో అన్న వాళ్ళు కూడా ఉన్నారు.. తొలి సినిమా నాళయ తీర్పు అట్టర్ ఫ్లాఫ్. ఈ సినిమాను విజయ్ తండ్రి చంద్రశేఖర్ నిర్మించారు. భారీగా నష్టపోయారు. ఆ తర్వాత సినిమాను విజయ స్నేహితులు నిర్మించారు. కెప్టెన్ విజయ్ కాంత్ అందులో గెస్ట్ రోల్ ప్లే చేశారు. ఆ సినిమా పేరు సింధూర పాండి. ఇది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత విజయ్ రేంజ్ మారిపోయింది. రసిగన్ అనే సినిమాతో తనకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. వరుసగా సూపర్ హిట్ సినిమాలో నటించి తిరుగులేని స్టార్గా ఎదిగిపోయారు.

2009లో విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేశారు. దీనిద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత తమిళగ వెట్రి కళగం పేరుతో 2024 ఫిబ్రవరిలో పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీని తమిళ ప్రజలకు చేరువ చేశారు. 2026 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించారు. అంతేకాదు.. ఐయూఎంఎల్.. కాంగ్రెస్.. కమ్యూనిస్టు పార్టీల సహకారంతో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

తమిళనాడు ఎన్నికల్లో వినూత్నమైన ప్రచారాన్ని నిర్వహించారు. గంటల తరబడి ప్రసంగాలు చేయలేదు. అధికారం కోసం కోట్లు పంచలేదు. ఉచిత హామీలు ఇవ్వలేదు. తమిళనాడులో వినూత్నమైన ప్రచారం చేసి.. పెద్ద పెద్ద పార్టీల సైతం సాధ్యం కాని విధంగా తమిళ ప్రజల అభిమానాన్ని చురగొన్నారు ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్నారు.. వినూత్నమైన పథకాలు.. గ్రామ స్వరాజ్యం కోసం ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు.. తమిళ రాజకీయాల్లో ఎంతమంది నాయకులు వచ్చారు.. వెళ్లారు. కానీ విజయ్ ప్రస్థానం మాత్రం చాలా విభిన్నమైనది. ఎందుకంటే ఆయనకు ఎటువంటి నేపథ్యం లేదు. ఎవరి సపోర్ట్ లేదు. రాజకీయాల్లోకి వచ్చి నిలబడ్డాడు. అదికూడా ద్రావిడ వాదం లేకుండానే ఎన్నికల్లో గెలిచారంటే మామూలు విషయం కాదు.

పశ్చిమాసియా శాంతి చర్చల్లో ఉద్రిక్తత.. అమెరికా ఉపాధ్యక్షుడికి అవమానం!

West Asia Peace Talks
West Asia Peace Talks

West Asia Peace Talks: పశ్చిమాసియాలో శాశ్వత శాంతి కోసం అమెరికా–ఇరాన్‌ ప్రతినిధులు ఆదివారం స్విట్జర్లాండ్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశం ముందు అమెరికా వైపు నుంచి ఫొటో సెషన్, కరచాలనం నిర్వహించాలని ప్రణాళిక వేశారు. అయితే ఇరాన్‌ ప్రతినిధులు దీన్ని తిరస్కరించి సమావేశ స్థలం నుంచి వెళ్లిపోయారు.

ట్రంప్‌ హెచ్చరికతో ఇరాన్‌ వాకౌట్‌..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌పై దాడులు చేయకుండా హెజొబొల్లాను ఇరాన్‌ నియంత్రించాలని, లేదంటే మళ్లీ భారీ దాడులు చేస్తామని హెచ్చరించిన విషయాన్ని టెహ్రాన్‌ తీవ్రంగా పరిగణించింది. దీంతో ఫొటో సెషన్‌కు నిరాకరించిన ఇరాన్‌ ప్రతినిధులు అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ పరిణామం చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్‌ నేతలను షాక్‌కు గురిచేసింది.

జేడీ వాన్స్‌కు అవమానం..
సమావేశం ప్రారంభానికి ముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఎదురుచూస్తుండగా ఇరాన్‌ విదేశాంగ మంత్రి వాకౌట్‌ చేయడం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. కొంచెం దూరంలో ఉన్న వాన్స్‌ ఈ పరిస్థితిని ఉద్రిక్తంగా గమనిస్తున్నట్లు దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. తర్వాత ఆయన పాకిస్తాన్‌ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్‌ మునీర్‌లతో ఒక్కటిగా చర్చించుకున్నారు.

ఖతార్‌ ప్రధానిని పట్టించుకోని వాన్స్‌..
మరో మధ్యవర్తి దేశం ఖతార్‌ ప్రధాని పాకిస్తాన్‌ ప్రధాని షరీఫ్‌ను పలకరించినప్పటికీ, పక్కనే ఉన్న వాన్స్‌ను పట్టించుకోలేదు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నెటిజన్లు దీన్ని దౌత్యపరమైన తిరస్కారంగా అభివర్ణిస్తున్నారు.

పరిస్థితి ఒకింత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ఇరాన్‌ అణు కార్యక్రమం, లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ చర్యలు వంటి ముఖ్య అంశాలపై ఇరు దేశాలు చర్చించాయి. శాంతి సాధన దిశగా కొంత ముందడుగు పడినట్లు సమావేశం ముగిసిందని సమాచారం.

బిజెపిలోకి ఆ ముగ్గురు వైసీపీ ఎంపీలు?!

YSRCP
YSRCP

Three YCP MPs joining BJP: మళ్లీ కూటమిలో చేరికలు మొదలయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు మళ్ళీ పార్లమెంటు ముంగిటకు రానుంది. ఏపీలో దాదాపు 80 అసెంబ్లీ సీట్లతో పాటు 13 పార్లమెంటు సీట్లు పెరగనున్నాయి. అదే జరిగితే అధికార కూటమికి అభ్యర్థులు అవసరం ఉంటారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోకపోవడంతో ఆ పార్టీ నేతలు జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిణామాల క్రమంలోనే జనసేన చేరికల కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు బిజెపి సైతం ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

కేవలం అవసరాల కోసం..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో నలుగురు ఎంపీలు, రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. వారిపై బిజెపి గురి పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. వారు సైతం అవసరాల కోసం బిజెపి వైపు మొగ్గు చూపుతున్నట్లు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పేరు వినిపిస్తోంది. మద్యం కుంభకోణం కేసులో మిధున్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై కూడా అనేక కేసులు నమోదయ్యాయి. వైసీపీలో ఒక వెలుగు వెలిగారు ఈ ఇద్దరు తండ్రి కొడుకులు. కానీ ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అందుకే పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి బిజెపి వైపు చూస్తున్నట్లు మళ్లీ ప్రచారం మొదలైంది.

జగన్ కుటుంబ సభ్యులు..
మరోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అవినాష్ రెడ్డి. ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి బిజెపితో ఉన్న స్నేహంతో అవినాష్ రెడ్డి బయటపడ్డారు. కానీ ఇప్పుడు వైసీపీ విషయంలో బిజెపి అభిప్రాయం మారింది. కోర్టు కూడా మళ్లీ విచారణ మొదలు పెట్టాలని సిబిఐ కు ఆదేశించే అవకాశం ఉంది. అదే జరిగితే అవినాష్ రెడ్డి అడ్డంగా బుక్ కావడం ఖాయం. అందుకే ఆయన సైతం బిజెపిని ఆశ్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సైతం బిజెపికి టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. టీటీడీ లడ్డు కల్తీ కి సంబంధించి అభియోగాలు మోపుతూ విచారణ లోతుగా సాగింది. సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.. అందుకే ఆయన సైతం బిజెపి వైపు వచ్చేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది.

ఛాన్స్ లేదు..
అయితే ఈ ముగ్గురు జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయులు. వారు పార్టీ మారుతారు అంటే అంత సులువు కాదు. పైగా వీరి అవసరం బిజెపికి ప్రస్తుతం లేదు. మీరు బిజెపిలో కేవలం ఇబ్బందులను దృష్ట్యా వెళ్తారే తప్ప.. వీరికంటూ వైసీపీపై ఎటువంటి అసంతృప్తి లేదు. పైగా టిడిపి నుంచి అనేక రకాల అభ్యంతరాలు ఉంటాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో బిజెపిలో చేరే అవకాశం లేనట్టు చాలామంది కొట్టి పారేస్తున్నారు.

జగన్ ను భయపెడుతున్న ఆ నాలుగు!

YS Jagan
YS Jagan

YS Jagan Political Challenges: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాపుల ప్రాధాన్యతను గుర్తించింది. కాపులు స్పష్టంగా ఇంకా కూటమి వైపు ఉన్నారని బలంగా నమ్ముతోంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో కూడా తమకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తోంది. అందుకే కాపు నేతల ఆత్మీయ సమావేశాల పేరుతో రాజకీయం మొదలుపెట్టింది. ఎంతో కొంత కాపుల్లో చీలిక తేవాలన్న ప్రయత్నం ప్రారంభించింది. అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం నాలుగు జిల్లాలను దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త గేమ్ ఆడుతున్నారు. దాదాపు ఒక 50 నియోజకవర్గాల్లో కాపుల్లో మార్పు వస్తే కూటమి దూకుడును తగ్గించవచ్చని భావిస్తున్నారు. ప్రధానంగా నాలుగు జిల్లాల్లోనే కాపుల ఆత్మీయ సభలు పెట్టాలని వైసీపీ కాపు నేతలను పురమాయించారు జగన్. అయితే అంతలా భయపెడుతున్నాయి ఆ నాలుగు జిల్లాలు జగన్మోహన్ రెడ్డిని. అందుకే ముందుగానే మేల్కొని అలర్ట్ అయ్యారు.

నిన్న తొలి సమావేశం..
నిన్ననే గోదావరి జిల్లాల్లో వైసిపి కాపు నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. తరువాత సమావేశాలు విజయవాడతో పాటు విశాఖలో నిర్వహించాలని నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ కాపులు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారన్నది జగన్ ఆలోచన. అదే సమయంలో తనకు కుల భావన లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్తున్నారు. గాని కాపు సామాజిక వర్గంలో మాత్రం పవన్ కళ్యాణ్ పై నమ్మకంతో పాటు అభిమానం ఉంది. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవరపెడుతోంది. కూటమి నుంచి పవన్ బయటకు వస్తారు అనుకుంటే మరో 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుందని బలంగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వను అంటూ తేల్చేస్తున్నారు. అందుకే ఇప్పుడు జగన్ తన సొంత పార్టీ కాపు నేతలతో ప్రయత్నాలు మొదలుపెట్టారు.

50 నియోజకవర్గాల పై ప్రభావం…
రాష్ట్రంలో కాపు జనాభా అధికంగా ఉన్న జిల్లాలు విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణాజిల్లా. దాదాపు నియోజకవర్గాలకు పైగా కాపుల ప్రభావం నిర్దిష్టంగా ఉంటుంది. అయితే మొన్నటి ఎన్నికల్లో కాపులు ఏకపక్షంగా కూటమికి మద్దతు తెలపడంతో 50 వేల మెజారిటీతో గెలిచిన నియోజకవర్గాలే అధికం. కనీసం 20 వేల మెజారిటీ తగ్గని నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి చోట కాపుల్లో చీలిక తేకపోతే మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భంగపాటు ఖాయం. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే నియోజకవర్గాల్లో నాయకులు యాక్టివ్ కాలేదు. కూటమికి వచ్చిన మెజారిటీ చూసి తెగ ఆందోళనకు గురయ్యారు వైసిపి నేతలు. అందుకే ఇప్పుడు వారిలో ధైర్యం నింపేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. అది కూడా ఆ నాలుగు జిల్లాలను టార్గెట్ చేసుకునే. అయితే గత అనుభవాల దృష్ట్యా కాపులు అంత సులువుగా వైసీపీకి టర్న్ అయ్యే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారత్‌కు అమెరికా గిఫ్ట్‌.. పాకిస్తాన్‌కు ఇక చుక్కలే..!

India US Strategic Partnership
India US Strategic Partnership

India US Strategic Partnership: అమెరికా భారత సైన్యం ఆధీనంలో ఉన్న అత్యంత ఆధునిక అపాచీ దాడి హెలికాప్టర్లు, ఎం–777 అల్ట్రా–లైట్‌ హోవిట్జర్‌ ఫిరంగులను నిరంతరం సిద్ధంగా ఉంచేందుకు సుమారు 482.2 మిలియన్‌ డాలర్ల (సుమారు 4,000 కోట్ల రూపాయలు) విలువైన సాయం ప్యాకేజీని ఆమోదించింది. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరచడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

ఎం–777 ఫిరంగులకు మద్దతు
హిమాలయం వంటి ఎత్తైన పర్వత ప్రాంతాల్లో సులభంగా తరలించి వినియోగించగల తేలికపాటి ఎం–777 ఏ2 హోవిట్జర్‌ ఫిరంగులకు అవసరమైన విడిభాగాలు, మరమ్మతులు, సేవలు. సైనికులకు ప్రత్యేక శిక్షణ అందించడానికి 230 మిలియన్‌ డాలర్లు కేటాయించారు. బ్రిటన్‌కు చెందిన బీఏఈ సిస్టమ్స్‌ ఈ మద్దతు కార్యక్రమాన్ని సమన్వయం చేస్తుంది. దీంతో ఈ ఫిరంగులు కఠినమైన వాతావరణంలో కూడా నిరంతరం పనిచేసే సామర్థ్యం సాధించగలవు.

అపాచీ హెలికాప్టర్లు సిద్ధం..
ప్రపంచంలోనే అత్యుత్తమ దాడి సామర్థ్యం కలిగిన ఏహెచ్‌–64డీ అపాచీ హెలికాప్టర్లను ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉంచడానికి 198.2 మిలియన్‌ డాలర్లు మంజూరు చేశారు. బోయింగ్, లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీలు ఇంజనీరింగ్‌ సేవలు, లాజిస్టిక్స్‌ మద్దతు అందించనున్నాయి. దీని వల్ల ఈ హెలికాప్టర్లు మరింత వేగంగా, సమర్థవంతంగా పనిచేయగలవు.

ఈ ప్రతిపాదనను మే 18న అమెరికా విదేశాంగ శాఖ కాంగ్రెస్‌కు సమర్పించగా, జూన్‌ 17న ఫెడరల్‌ రిజిస్టర్‌లో అధికారికంగా ప్రచురించారు. అమెరికా రక్షణ విభాగం (పెంటగాన్‌) ఈ సాయం ప్రాంతీయ సైనిక సమతుల్యతను దెబ్బతీయదని, బదులుగా భారత్‌ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, సరిహద్దు సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడుతుందని స్పష్టం చేసింది. ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతున్నట్లు సూచిస్తుంది.

హీరో రామ్ తో రిలేషన్ పై నోరు జారేసిన భాగ్యశ్రీ భొర్సే.. వీడియో వైరల్..

Bhagyashri Borse
Bhagyashri Borse

Bhagyashri Borse Viral Video: గత కొంతకాలం గా సోషల్ మీడియా లో హీరో రామ్ , భాగ్యశ్రీ భొర్సే మధ్య రిలేషన్ ఉందని, వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారని , ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారని , హైదరాబాద్ లో ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని, ఇలా ఎన్నో రకాలా వార్తలు ప్రచారం అయ్యాయి. దీనిపై అటు రామ్ కానీ , ఇటు భాగ్యశ్రీ కానీ బలంగా రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ నిన్న మాత్రం భాగ్యశ్రీ పరోక్షంగా రామ్ తో రిలేషన్ లో ఉన్నట్టు ఒక చిన్న క్లారిటీ ఇచ్చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే వీళ్లిద్దరు హీరో హీరోయిన్లుగా నటించిన ‘లెనిన్’ చిత్రం వచ్చే నెల 10 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా అఖిల్ , భాగ్యశ్రీ కలిసి ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. ముందుగా యాంకర్ సినిమాతో కలిసి ఒక కిచెన్ ఇంటర్వ్యూ చేశారు.

ఆద్యంతం సరదాగా సాగిపోయిన ఈ ఇంటర్వ్యూ లో ‘నా మొదటి ఇల్లు ముమ్మాటికీ ఔరంగాబాద్, రెండో ఇల్లు హైదరాబాద్, ఆల్రెడీ ఉంది’ అని చెప్పుకొచ్చింది. దీంతో సుమ ‘చాలా మంచిది.. చాలా మంది హీరోయిన్లు హైదరాబాద్ లో ఈమధ్య స్థిరపడుతున్నారు , నువ్వు కూడా అలా ఇక్కడే స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని అర్థం ఏంటో నాకు కూడా తెలీదు ‘ అంటూ నవ్వుతూ ఆశీర్వదించింది. అంటే భాగ్యశ్రీ , రామ్ పోతినేని ఇంట్లో ఉంటుంది కాబట్టి, నా రెండవ ఇల్లు హైదరాబాద్ అని చెప్పింది , దీనిని సుమ కూడా పరోక్షంగా ఖరారు చేసింది , ఎందుకంటే వాళ్లకు ఇలాంటి విషయాలు తెలుసు కాబట్టి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరో పక్క రామ్ కూడా రిలేషన్ లో ఉన్నట్టు పరోక్షంగా ఒక ఇంటర్వ్యూ లో ఖరారు చేశారు , కానీ ఎవరితో రిలేషన్ లో ఉన్నారు అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.

ఇక లెనిన్ విషయానికి వస్తే , ఈ సినిమా అఖిల్ కి ఎంత ముఖ్యమో , భాగ్యశ్రీ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇన్నేళ్లు అయినప్పటికీ కూడా అఖిల్ కి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు , అదే విధంగా భాగ్యశ్రీ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు, అన్నీ డిజాస్టర్స్ అయ్యాయి , అందుకే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్. రెండు సార్లు వాయిదా పడినప్పటికీ కూడా ఆడియన్స్ లో అంచనాలు తగ్గలేదు. కచ్చితంగా పెద్ద రేంజ్ కి వెళ్తుందని అనుకుంటున్నారు , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

డిజాస్టర్ డైరెక్టర్ తో చేతులు కలిపిన రవితేజ.. మరోసారి ట్రాక్ తప్పుతున్నాడు..

Ravi Teja Upcoming Movie
Ravi Teja Upcoming Movie

Ravi Teja Upcoming Movie: ఈ ఏడాది స్టార్ హీరోల కం బ్యాక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మారిపోయింది. 14 ఏళ్ళ నుండి సరైన సూపర్ హిట్ లేక , తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకుంటున్న తమిళ హీరో సూర్య రీసెంట్ గానే ‘కరుప్పు’ చిత్రం తో ఏ రేంజ్ కం బ్యాక్ ఇచ్చాడో మనమంతా చూసాము. ఒక్క దెబ్బకు నేరుగా 330 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి తన సత్తా ఎలాంటిదో నిరూపించుకున్నాడు. ఇక ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం తో 340 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి ఆయన కూడా సోలో హీరో గా భారీ కం బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు రవితేజ వంతు వచ్చేసింది. ఆయన కూడా ‘ఇరుముడి’ చిత్రం తో భారీ లెవెల్ లో కం బ్యాక్ ఇవ్వబోతున్నాడని అంతా అనుకున్నారు.

ఇప్పటి వరకు ఆ సినిమా పై ఆడియన్స్ లో మంచి పాజిటివ్ వైబ్స్ మాత్రమే క్రియేట్ అయ్యాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి , మొన్న విడుదలైన గ్లింప్స్ వీడియో వరకు ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రవితేజ కం బ్యాక్ కళ్ళ ముందు కనిపిస్తోంది , ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకొనవసరం లేదని అంతా అనుకున్నారు. ఈ సినిమా వరకు అవన్నీ జరగొచ్చేమో కానీ , ఈ చిత్రం తర్వాత ఆయన ఒప్పుకున్నా సినిమా ని చూస్తే మళ్లీ ఆయన ట్రాక్ తప్పుతున్నాడేమో అని అనిపిస్తోంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , రవితేజ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ మారుతీ తో చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే మారుతీ ‘రాజాసాబ్’ చిత్రం తో ఎంత పెద్ద ఫ్లాప్ ని అందుకున్నాడో మనమంతా చూసాము.

హిట్, ఫ్లాప్ అనేది ఎవరికైనా సహజం కదా, మారుతీ మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు , కచ్చితంగా ఎదో ఒకరోజు మంచి కం బ్యాక్ ఇస్తాడని అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ‘రాజా సాబ్’ చూసిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. ఇంతటి వీక్ రైటింగ్ ఈమధ్య కాలంలో ఏ స్టార్ డైరెక్టర్ కూడా రాయలేదు. కచ్చితంగా మారుతీ లో ఒకప్పుడు ఉన్న రైటింగ్ స్కిల్స్ ఇప్పుడు లేవు, బాగా తగ్గిపోయాయి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ రవితేజ ‘ఇరుముడి’ తో కం బ్యాక్ ఇచ్చినా , మారుతీ తో తదుపరి చిత్రం చేస్తే భారీ ఫ్లాప్ ని ఎదురుకోక తప్పదని అంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అతనితో చేయొద్దని సలహా ఇస్తూ రవితేజ ని ట్యాగ్ చేస్తున్నారు.

'ఓజీ' షూటింగ్ సమయంలో డైరెక్టర్ సుజిత్ ని నిర్మాత ఇంతలా ఇబ్బంది పెట్టాడా..!

OG 2 Producer Change
OG 2 Producer Change

OG Film Director Sujeeth: 2027 వ సంవత్సరం లో విడుదల అవ్వబోయే చిత్రాల్లో , అభిమానుల్లో , ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘ఓజీ 2’. అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడో లేదో అనే అయోమయ్యాం లో ఉన్న సమయంలో ఈ సినిమా ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి , ఫ్యాన్స్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. సుజిత్ ఇండియా కి తిరిగి రాగానే పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుపుతాడని కూడా పవన్ కళ్యాణ్ టీం మాట ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు నిన్నటి నుండి మొదలయ్యాయి. డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ ని కలిసి స్టోరీ ని వినిపిస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. అయితే ఈ సినిమాలో భారీ మార్పులు రాబోతున్నాయి.

ముఖ్యంగా మొదటి భాగాన్ని నిర్మించిన దివీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ సంస్థ , సీక్వెల్/ ప్రీక్వెల్ నిర్మాణం లో భాగం అవ్వడం లేదు. ఎందుకంటే డైరెక్టర్ సుజిత్ కి ఈ టీం సినిమా విడుదల సమయం లో అసలు సహకరించలేదట. చాలా ఇబ్బందులకు గురి చేశారట. సినిమాలో అత్యంత ముఖ్యమైన జపాన్ సీక్వెన్స్ ని తెరకెక్కించడానికి బడ్జెట్ కోరగా, నిర్మాత అందుకు నిరాకరించిందని తెలుస్తోంది. ఇప్పటికే బడ్జెట్ లిమిట్ దాటిపోయిందని , అంతకు మించి పెట్టలేమని చెప్పడం తో , సుజిత్ తన సొంత డబ్బులు ఖర్చు చేసి జపాన్ లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేసుకొని వచ్చాడు. ఆ సన్నివేశాలు షూట్ చేయడం కోసం తాను ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న కారుని కూడా అమ్మేసుకున్నాడు. అంతే కాకుండా సినిమా ఎడిటింగ్ చేస్తున్న సమయం లో , కనీసం స్టూడియో ని కూడా ఏర్పాటు చేయలేదట మూవీ టీం. దీంతో చివరి నిమిషం వరకు , తన వద్ద ఉన్న లిమిటెడ్ సోర్స్ తోనే సుజిత్ ఎడిటింగ్ ని పూర్తి చేయాల్సి వచ్చిందట.

ఫలితంగా ఓవర్సీస్ కి ప్రింట్లు చాలా ఆలస్యం గా వెళ్లడమే. దాదాపుగా 3 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి రాబట్టింది ఈ చిత్రం. ఒక్క గంట ఆలస్యం ప్రింట్స్ వెళ్లడం ఆలస్యం అయ్యుంటే , దాదాపుగా 1 మిలియన్ డాలర్లకు సంబంధించిన బుకింగ్స్ రద్దు అయ్యేవి. అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం లో డబ్బులు ఆఫర్ చేయడం తో , హిందీ వెర్షన్ తో కలిపి కేవలం నాలుగు వారాల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసుకునేలా ఒప్పందం చేసుకున్నాడు నిర్మాత. అందువల్ల, హిందీ లో నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఈ సినిమా విడుదలని బ్యాన్ చేశారు. దాని వల్ల కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది. ఓజీ రేంజ్ ని దానయ్య బాగా తగ్గించేసాడనే బాధ సుజిత్ లో అలా ఉండిపోయింది అట. అందుకే ‘ఓజీ 2’ దానయ్య తో చేయడానికి ఆసక్తి చూపలేదని , ఇప్పుడు ఈ చిత్రాన్ని పవన్ క్రియేటివ్ వర్క్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్నాయని టాక్.

హీరోయిన్ శ్రీలీల ని ఫోటో షూట్ లో దారుణంగా అవమానించిన సీఎం భార్య.. వీడియో వైరల్..

Sreeleela Latest Viral Video
Sreeleela Latest Viral Video

Sreeleela Latest Viral Video: సోషల్ మీడియా లో నిన్నటి నుండి హీరోయిన్ శ్రీలీల తెగ ట్రెండ్ అవుతోంది. యోగా దినోత్సవం సందర్భంగా నిన్న ముంబై లో ఒక యోగా ఈవెంట్ లో పాల్గొని యోగాసనాలు వేసింది. ఈ కార్యక్రమం లో శ్రీలీలతో పాటుగా బాలీవుడ్ క్రేజీ హీరో షాహిద్ కపూర్ , మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ సతీమణి అమృత ఫడ్నావిస్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం లో శ్రీలీల వేసిన యోగాసనాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యి ట్రోల్స్ కి గురైంది. అదే సమయం లో ఆమెకు సంబంధించిన మరో వీడియో ని చూసి నెటిజెన్స్ జాలి వ్యక్తం చేశారు. సీఎం సతీమణి అమృత పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అంతలా అమృత ఏమి చేసింది?, శ్రీలీల బాధపడేంతలా ఆమె ఏమి చేసింది అనేది ఇందులో చూద్దాం.

యోగాసనాల కార్యక్రమం పూర్తి అయ్యాక , తిరిగి వెళ్తున్నప్పుడు మీడియా ఫోటో షూట్ చేశారు. ముందుగా అమృత , ఆమె కూతురు , మరియు శ్రీలీల కలిసి ఫోటో దిగారు. ఇది పూర్తి అయ్యాక, శ్రీలీల ని పక్కకి జరుగు అని సీరియస్ గా అమృత అనడం, దీంతో అక్కడి నుండి శ్రీలీల వెళ్లిపోవడంతో అమృత తన కూతురు తో కలిసి ఫోటోలు దిగడం వంటివి శ్రీలీల అభిమానులను , సోషల్ మీడియా లో నెటిజెన్స్ ని బాధకు గురి చేసింది. ఇండియా లోనే టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న మన తెలుగు అమ్మాయి ని , ఇంతలా అవమానించడం ఏ మాత్రం బాగోలేదు, అమృత కి అధికార అహంకారం నెత్తికి ఎక్కిందంటూ మండిపడుతున్నారు నెటిజెన్స్. అయితే ఇందులో అంత బాధ పడాల్సిన అవసరం లేదని , మీడియా రిపోర్టర్స్ అమృత, తన కూతురుతో కలిసి కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇవ్వమని కోరడం వల్లే శ్రీలీల ని పక్కకి జరగమని అమృత రిక్వెస్ట్ చేసిందని, దీనికి రాద్ధాంతం చెయ్యాల్సిన అవసరమే లేదని అంటున్నారు.

ఈ విషయం లో ఎవరెన్ని మాట్లాడినా శ్రీలీల పాపం బాధపడినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. పక్కకి వెళ్లి ఉండమనగా, శ్రీలీల అక్కడి నుండి వెళ్ళిపోయింది , దీని అర్థమేంటి?, ఆమె మనసు నొచ్చుకున్నది అనే కదా?, సోషల్ మీడియా అంతటా ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అయిపోయింది. గతం లో కమెడియన్ మహేష్ విషయం లో కూడా కాంట్రవర్సి అయితే , శ్రీలీల రెస్పాన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వీడియో కూడా బాగా వైరల్ అయ్యి వివాదాలకు దారి తీసింది కాబట్టి , దీనిపైనా కూడా శ్రీలీల స్పందిస్తుందో లేదో చూడాలి. సోషల్ మీడియా లో దుమారం రేపుతున్న ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.

టెస్లా కారు అంత సేఫ్‌ కాదు.. తాజా ప్రమాదంలో నెట్టింట చర్చ!

Tesla Car Safety Controversy
Tesla Car Safety Controversy

Tesla Car Safety Controversy: టెస్లా.. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సంస్థ. ఈ సంస్థే ఆయనను 3 ట్రిలియన్‌ డాలర్ల సంపదకు అధిపతిని చేసింది. ఆయన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది. ఎలక్ట్రానిక్‌ కార్లు తయారు చేసే ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే తాజాగా ఈ కంపెనీ కార్ల సేఫ్టీపై సందేహాలు కలుగుతున్నాయి. తాజాగా అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఒక టెస్లా కారు ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా స్వయంచాలక వాహనాల భద్రత, సాంకేతికత సామర్థ్యం, ప్రమాదాల్లో బాధ్యత ఎవరిది అనే అంశాలపై తీవ్ర చర్చలను రాజేసింది. ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ అసిస్టెన్స్‌ మోడ్‌లో ఉన్న టెస్లా కారు నియంత్రణ తప్పి అతివేగంతో ఒక ఇంటిలోకి దూసుకెళ్లడంతో ఇంట్లో ఉన్న 76 ఏళ్ల మార్తా అవిలా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్వయంచాలక డ్రైవింగ్‌ సాంకేతికత ఎంత ముందుకు వెళ్లిందో, అంతే భద్రతా సవాళ్లు ఎదురవుతున్నాయని స్పష్టం చేస్తోంది.

ప్రమాదం ఎలా జరిగింది?
టెస్లా కారు ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ అసిస్టెన్స్‌ మోడ్‌లో పనిచేస్తున్నప్పుడు నియంత్రణ కోల్పోయి అధిక వేగంతో నేరుగా ఒక ఇంటిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వృద్ధురాలు మార్తా అవిలా తీవ్రంగా గాయపడి మరణించింది. డ్రైవర్‌ లెస్‌ వాహనాలు మానవ లోపాలను తగ్గించేందుకు రూపొందించబడినప్పటికీ, ఈ ఘటన సాంకేతిక వ్యవస్థలు కూడా విఫలం కావచ్చని రుజువు చేసింది.

సెల్ఫ్‌ డ్రైవింగ్‌ డేంజరే..
సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వాహనాలు మానవ డ్రైవర్లలో సాధారణంగా కనిపించే అలసట, దృష్టి మరలడం, తప్పు నిర్ణయాల వంటి లోపాలను తగ్గించడానికి రూపొందించబడ్డాయి. కెమెరాలు, సెన్సార్లు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి సాంకేతికతలు వాహనాన్ని స్వయంగా నడిపేందుకు సహాయపడతాయి. అయితే, ఈ వ్యవస్థలు పూర్తిగా లోపరహితంగా ఉండవు. సాఫ్ట్‌వేర్‌ బగ్స్, సెన్సార్‌ వైఫల్యాలు లేదా అనుకోని పరిస్థితుల్లో వ్యవస్థ నిర్ణయాలు తప్పు దారిలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రమాదం ఆ వాస్తవాన్ని మరోసారి బయటపెట్టింది.

బాధ్యత ఎవరిది?
సాధారణంగా ప్రమాదం జరిగితే డ్రైవర్‌ను బాధ్యులను చేస్తారు. అరెస్టు చేస్తారు. సెల్ప్‌ డ్రైవింగ్‌ కారు కారణంగా ప్రమాదం జరిగినప్పుడు బాధ్యత ఎవరిది అనేది ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్నగా మారింది. డ్రైవర్‌కు బాధ్యత ఉందా? (సెమీ–ఆటోమేటెడ్‌ మోడ్‌లో డ్రైవర్‌ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి), వాహన తయారీదారు (టెస్లా)కు బాధ్యత ఉందా? (సాఫ్ట్‌వేర్‌ లోపం ఉంటే), లేక ఇద్దరూ బాధ్యత వహించాలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో చట్టాలు ఇంకా స్పష్టంగా లేవు. ఈ ఘటన తర్వాత చట్టపరమైన సంస్కరణలు, బీమా నియమాలు, తయారీదారుల బాధ్యతను నిర్వచించే కొత్త రూల్స్‌ అవసరం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఐదేళ్లలో 3,866 ప్రమాదాలు..
2021 నుంచి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల కారణంగా 3,866 ప్రమాదాలు జరిగాయి. ఈ సంఖ్య సాంకేతికత ఇంకా పూర్తి స్థాయిలో సురక్షితంగా లేదని, మరింత కఠినమైన టెస్టింగ్, రియల్‌ వరల్డ్‌ డేటా విశ్లేషణ అవసరమని సూచిస్తోంది. ఒక్కో ప్రమాదం నుంచి నేర్చుకుని సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపరచడం అవసరం, కానీ ప్రతి ఘటనతో ప్రజల నమ్మకం క్షీణిస్తుంది.

నెట్టింట్లో చర్చ…
ఈ ప్రమాదం తర్వాత సోషల్‌ మీడియా, న్యూస్‌ ప్లాట్‌ఫామ్‌లపై వేడి చర్చలు మొదలయ్యాయి. కొందరు ‘స్వయంచాలక వాహనాలు ఇంకా సురక్షితం కావాలి, పూర్తి నియంత్రణ ఇవ్వకూడదు’ అంటున్నారు. మరికొందరు ‘మానవ డ్రైవర్ల కంటే ఇవి ఎంతో సురక్షితం, కేవలం ఒక్క ఘటనతో వ్యతిరేకించకూడదు’ అని వాదిస్తున్నారు. బాధ్యత, బీమా, ప్రభుత్వ నియంత్రణలు వంటి అంశాలపై వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సాంకేతికత అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కానీ భద్రతను మొదటి ప్రాధాన్యతగా ఉంచి, బాధ్యతను సరిగ్గా నిర్వచించినప్పుడే ఈ వాహనాలు నిజంగా సురక్షితంగా మారతాయి. భద్రత, బాధ్యత, నియంత్రణలు సమతుల్యంగా ఉంటేనే భవిష్యత్తులో ఈ సాంకేతికత ప్రజల నమ్మకాన్ని సంపాదించగలుగుతుంది.

ఒక్కో చేప రూ.50 వేలు.. మత్స్యకారుల పంట పండింది!

Expensive Fish Price 50000
Expensive Fish Price 50000

Expensive Fish Price 50000: వేసవిలో రెండు నెలల పాటు సముద్రంలో చేపల వేట నిషేధం. చేపల సంతానోత్పత్తి సమయం కావడంతో.. మర బోటులతో సముద్రంలో చేపల వేట నిషేధం రెండు నెలల పాటు. మరపడవలతో వెళితే ఆ పరికరాలు తగిలి సంతానోత్పత్తికి ఇబ్బందులు కలుగుతాయని ఏటా ప్రభుత్వం రెండు నలల పాటు చేపల వేటను నిషేధిస్తూ వస్తోంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఇది కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా చేపల వేట నిషేధం పూర్తయింది. అయితే చాలా రోజుల తర్వాత సముద్రంలో వేటకు వెళ్తున్న మత్స్యకారులకు భారీగా మత్స్య సంపద చిక్కుతోంది. అరుదైన చేపలు సైతం చిక్కుతుండడంతో మత్స్యకారులకు ఉపాధి గిట్టుబాటు అవుతోంది. అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారులకు అయితే లక్షల విలువచేసే మూడు అరుదైన చేపలు చిక్కాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

పల్లెపాలెం ఫిషింగ్ హార్బర్ పరిధిలో..
సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం లో మినీ ఫిషింగ్ హార్బర్ ఉంది. చేపల వేట నిషేధం గడువు ముగియడంతో మత్స్యకారులు వేటకు బయలుదేరారు. ఒకేసారి మూడు అరుదైన కచిడి చేపలు చిక్కాయి. ఆ మూడు చేపలను హార్బర్లో బహిరంగ వేలం వేశారు. స్థానిక వ్యాపారి ఒకరు లక్ష యాభై వేల రూపాయలకు కొనుగోలు చేశారు. చేపలు అరుదుగా దొరకడం, వాటికి మార్కెట్లో మంచి ధర ఉండటంతో భారీ తరపు అమ్ముడైపోయాయి. అయితే ఈ చేపలు ఒక్కొక్కటి 12 నుంచి 13 కిలోల బరువు ఉన్నాయి. అందులో రెండు మగ చేపలు, మరొకటి ఆడ చేప. వీటిని వేలంలో దక్కించుకునేందుకు చాలామంది పోటీపడ్డారు. చివరకు ఓ వ్యాపారికి దక్కాయి.

కచిడి చేపలకు ప్రత్యేకత ఉంది. పొట్ట భాగంలో లభించే ప్రత్యేక పదార్థాన్ని కొన్ని ఔషధాలు తయారీలో వినియోగిస్తారు. అందుకే ఈ చేపలకు మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఇంకా పెద్ద పరిమాణంలో ఉండే కచిడి చేపలు చిక్కితే.. ఒక్కొక్కటి రెండు లక్షల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ధర పలికే అవకాశం ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.

ఎగబడ్డ జనం..
కచిడి చేపలు చిక్కాయి అని తెలియడంతో పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ లో సందడి నెలకొంది. వాటిని చూసేందుకు భారీగా జనం ఎగబడ్డారు. వేట విరామం అనంతరం ఈ చేపలు చిక్కడం శుభపరిణామమని మత్స్యకారులు చెబుతున్నారు. ఇక ఏడాది పొడవునా భారీగా మత్స్య సంపద చిక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేట నిషేధ సమయానికి గాను ప్రభుత్వం ప్రతి మత్స్యకారుడికి 20 వేల రూపాయల చొప్పున భృతి అందిస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా భారీగా అందించింది. శ్రీకాకుళం జిల్లా డోంకూరు నుంచి తిరుపతి జిల్లా తడ వరకు తీర ప్రాంతం విస్తరించి ఉంది. మత్స్యకారులు వేట రెండు నెలల పాటు వేటకు దూరంగా ఉంటారు. ఈ ఏడాది కూడా మొన్ననే వేట విరామ సమయం ముగిసింది. దీంతో చేపల వేట ప్రారంభం అయింది. అరుదైన చేపలు చిక్కుతుండడంతో మత్స్యకారులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీకి కాపులు ఓటు వేస్తే కాపు నేత సీఎం అవుతారా?!

YSRCP
YSRCP

YSRCP Kapu Vote Bank: పవన్ కళ్యాణ్ ఏపీలో కుల దరిద్రం గురించి మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ కులాల మధ్య కుంపట్లు ఏంటని ప్రశ్నిస్తున్నారు. కులం విషయంలో చాలా స్పష్టంగా చెబుతున్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కులం అనే దానిని హైలెట్ చేస్తోంది. ఆ పార్టీకి చెందిన కాపు నేతలు ఏకంగా ఆత్మీయ సమావేశాలు పేరుతో రాజకీయం చేస్తున్నారు. పవన్ ఒకవైపు కుల రాజకీయాలు వద్దు అంటే.. ఇదిగో మేం చేసి చూపిస్తున్నాం అంటున్నట్టు చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ భిన్నమైన వైఖరిని గమనిస్తున్నారు ఏపీ ప్రజలు. ప్రధానంగా తమ సామాజిక వర్గాన్ని బూచిగా చూపి చేస్తున్న రాజకీయాన్ని కాపులు నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వారికి ఒక క్లారిటీ వస్తోంది.

ధైర్యం చేసిన పవన్..
అయితే రాష్ట్రంలో ఎవరు చేయని ధైర్యం పవన్ కళ్యాణ్ చేశారు. పవన్ కళ్యాణ్ ను కాపుల ప్రతినిధిగా చూస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కాపుల ద్వారానే ఆయన రాజకీయం చేస్తున్నారని.. కాపులు ఆయనకు అండగా నిలుస్తున్నారని… అలా కాపులు కూటమికి దగ్గరయ్యారని.. పవన్ కళ్యాణ్ కు కాపులు నమ్మితే చంద్రబాబును సీఎం చేస్తున్నారంటూ ఇప్పుడు వైసీపీ నేతలు అంటున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ కుల దరిద్రం వద్దని హెచ్చరిస్తున్నారు. క్రిమినల్ ను వెనుకేసుకు రావాలా అంటూ సాయి కృష్ణ ఉదంతాన్ని ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించేందుకు చాలా ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే పవన్ వాస్తవాలను నొక్కి చెబుతున్నారు. ఇటీవల సాయికృష్ణ అదృశ్యం అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవడంలేదని వైసీపీ కాపు నేతలు ప్రశ్నించడాన్ని ఇప్పుడు గుర్తించుకోవాలి.

కాపుల చుట్టూనే రాజకీయం..
కాపులు చుట్టూ జరుగుతున్న రాజకీయాన్ని ఒక్కసారి గమనిస్తే ఇట్టే అర్థం అవుతుంది. తాను కాపులకు మాత్రమే ప్రతినిధిని కానని.. అలా ఒక కులం ముద్ర వేస్తే ఊరుకునేది లేదన్నట్టు పవన్ మాట్లాడుతున్నారు. కాపులంతా పవన్ కళ్యాణ్ ను నమ్మితే ఆయన చంద్రబాబును సీఎం చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా.. అది కాపులకు సంబంధించినది అయితే పవన్ కళ్యాణ్ కు ముడి పెడుతున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు అంటూ పవన్ వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. నేను కుల రాజకీయాలు చేయడం లేదు కదా అని నిలదీసినంత పని చేస్తున్నారు. ఒక క్రిమినల్ కాపు కులస్తుడైతే.. రోడ్డు మీదకు వచ్చి దౌర్జన్యం చేస్తే ఊరుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం లేదు. పవన్ కళ్యాణ్ కు కుల అభిమానం అంటూ ప్రత్యేకంగా లేదు. అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ పట్ల కాపులు అభిమానం చూపకుండా ఉండలేకపోతున్నారు. మాపై అభిమానం చూపండి అంటూ వైసీపీ కాపు నేతలు కాపు సామాజిక వర్గాన్ని కోరుతున్నారు. కూటమికి ఓటు వేస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబును సీఎం చేస్తున్నారని చెబుతున్నారు. వైసీపీకి ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డి కాదు తామే సీఎం అవుతామని చెప్పలేకపోతున్నారు. తాము సైతం జగన్మోహన్ రెడ్డి కోసమే ఈ కాపు రాజకీయం చేస్తున్నామన్న విషయాన్ని కాపు నేతలు గ్రహించడం లేదు. ఎంతవరకు కాపులు కూటమికి అండగా నిలబడితే అది చంద్రబాబుకు ప్రయోజనం అని చెబుతున్నారు. మరి వైసీపీకి ఓటు వేస్తే తమకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం అన్న విషయాన్ని బాహాటంగా ఒప్పుకోవడం లేదు. ఫైనల్ గా తమ చుట్టూ జరుగుతున్న రాజకీయం.. తమ గురించి ఏపీ ప్రజల్లో బలమైన చర్చ జరుగుతోందని మాత్రం కాపులు కాస్త సంతృప్తి పడుతున్నారు. అంతకుమించి ఏమీ జరగడం లేదు.

ఖవాజా నోరు లేస్తోంది.. యుద్ధమంటూ వస్తే.. వార్‌ వన్‌సైడే!

Khawaja Latest Comments
Khawaja Latest Comments

Khawaja Latest Comments: ఆపరేషన్‌ సిందూర్‌తో చావు తప్పి కన్ను చొట్టబోయిన చందంగా మారింది పాకిస్తాన్‌ పరిస్థితి. ఇప్పటికీ భారత్‌ దాడిలో దెబ్బతిన్న పోర్టులకు మరమ్మతులు కూడా చేసుకోలేక ప్యాచ్‌లు వేసుకుంటోంది. ఐదు రోజుల దెబ్బే ఇలా ఉంటే.. మరి పూర్తి యుద్ధం చేస్తే ప్రపంచ పటంలో ఆ దేశం మాయం అవుతుంది. అయినా పాకిస్తాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ కారు కూతలు కూస్తున్నాడు. ఇటీవల చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచాయి. భారత్‌ పాకిస్తాన్‌కు వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించినా లేదా అడ్డుకున్నా, అది జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, కోట్లాది ప్రజల జీవనాధారం సింధూ నదీ వ్యవస్థపై ఆధారపడి ఉందని గుర్తు చేశారు. నీటి హక్కులను రక్షించుకోవడానికి అన్ని మార్గాలు వాడతామని, అవసరమైతే యుద్ధం వరకు వెళ్లడానికి వెనకాడమని హెచ్చరించాడు.

ఒప్పందంలో ఏముంది..
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్తాన్‌ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. సింధూ నదీ వ్యవస్థలోని ఆరు ప్రధాన నదులను రెండు భాగాలుగా విభజించారు. రవి, బియాస్, సట్లెజ్‌ నదుల జలాలపై భారత్‌కు పూర్తి హక్కులు ఇచ్చారు. ఇండస్, జీలం, చీనాబ్‌ నదుల జలాలను ప్రధానంగా పాకిస్తాన్‌ వినియోగించుకునేలా నిర్ణయించారు. అయినప్పటికీ పశ్చిమ నదులపై విద్యుత్‌ ఉత్పత్తి, సాగునీటి అవసరాల కోసం భారత్‌కు కొన్ని పరిమిత హక్కులు కల్పించారు. ఆరు దశాబ్దాలుగా యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు ఉన్నా ఈ ఒప్పందం కొనసాగడం గమనార్హం.

జలవిద్యుత్‌ ప్రాజెక్టులపై పాక్‌ అభ్యంతరం..
జమ్మూ–కశ్మీర్‌ ప్రాంతంలో భారత్‌ చీనాబ్, జీలం నదులపై జలవిద్యుత్‌ ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. ఇవి ఒప్పంద నిబంధనలకు విరుద్ధమని పాకిస్తాన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత్‌ మాత్రం ఈ ప్రాజెక్టులు ఒప్పందం పరిధిలోనే ఉన్నాయని, నీటిని మళ్లించడం లేదా అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేస్తోంది. తమకు లభించిన హక్కులను పూర్తిగా వినియోగించుకోవడం బాధ్యత అని భారత్‌ వాదిస్తోంది.

ఇటీవల భారత్‌లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ ఒప్పందంపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో చేసిన ‘‘రక్తం, నీరు ఒకేసారి ప్రవహించలేవు’’ అనే వ్యాఖ్య మళ్లీ ప్రస్తావనకు వచ్చింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదం కొనసాగితే ఒప్పందంపై పునఃసమీక్ష అవసరమని భారత రాజకీయ వర్గాల్లో అభిప్రాయం బలపడుతోంది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.

కాపు అస్త్రం.. జగన్ సొంత వర్గం ఆగ్రహం!

YS Jagan Kapu Strategy
YS Jagan Kapu Strategy

YS Jagan Kapu Strategy: వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం సొంత సామాజిక వర్గం వారికి ఎంత మాత్రం అర్థం కావడం లేదు. లేని దాని గురించి పాకులాడుతూ.. ఉన్నవాటిని పోగొట్టుకున్న చందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అని సొంత సామాజిక వర్గం వారి వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నా బీసీలు, నా ఎస్సీలు అన్నారు. ఇప్పుడేమో నా కాపులు అంటూ రాజకీయం చేస్తుండడం పై రెడ్డి సామాజిక వర్గంలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు సొంత సామాజిక వర్గాన్ని చూడలేదు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా సొంత సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు. 2014, 2019 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం పెద్ద సాహసమే చేసింది. కానీ 2024 కు వచ్చేసరికి మాత్రం చేతులెత్తేసింది ఆ సామాజిక వర్గం.

ఏకతాటి పైకి రెడ్డి సామాజిక వర్గం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రెడ్డి సామాజిక వర్గమంతా ఒకే తాటి పైకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచింది. వైసీపీ అంటే తమ పార్టీ అన్నట్టు రెడ్డి సామాజిక వర్గం ఓన్ చేసుకుంది. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఆ నలుగురు తప్ప మిగతా నేతలకు ఎటువంటి అవకాశం లేదు. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పేదవర్గాలకు కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే ఆ సామాజిక వర్గం మనసు మారింది. 2024 ఎన్నికల్లో పూర్తిగా వారు సైలెంట్ అయ్యారు. అలాగని వారు వైసీపీని వీడలేదు. కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేయడం లేదు.

అన్ని వర్గాలు దూరం..
అధికారంలో ఉన్నప్పుడు నా బీసీలు అంటూ బీసీ పల్లవి అందుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో కాపులను వదిలేశారు. రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీలు, ఎస్సీలు తమ వెంట ఉంటారని అంచనా వేసుకున్నారు. కానీ అన్ని వర్గాలు దూరం కాగా రెడ్డి సామాజిక వర్గం వారు పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కాపులు అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు. సొంత పార్టీ నేతలతో కాపుల ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. దీంతో మిగతా సామాజిక వర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచనపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అయితే రుస రుసలాడుతోంది. ఇంత జరిగాక కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా కుల రాజకీయాలను పట్టుకుని వేలాడుతుండడం పై చర్చ నడుస్తోంది. కులాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి తప్ప.. ఇలా కుల రాజకీయాలను నమ్ముకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు.

ఇండియా, పాకిస్తాన్‌లో నా ఫేవరెట్స్ వారే.. జేడీ వాన్స్‌ హాట్ కామెంట్స్

JD Vance Sensational Comments
JD Vance Sensational Comments

JD Vance Sensational Comments: అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ.వాన్స్‌. ఆయన భార్య ఉష భారతీయురాలు. పక్కా తెలుగు అమ్మాయి. దీంతో వాన్స్‌ ఆంధ్రప్రదేశ్‌ అల్లుడు అయ్యాడు. ఆయన అమెరికా–ఇరాన్‌ డీల్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఇరాన్‌తో జరిగిన చర్చల అనంతరం చేసిన వ్యాఖ్యలు దౌత్య వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఆయన తన జీవితంలో రెండు ముఖ్యమైన వ్యక్తుల గురించి హాస్యంగా ప్రస్తావించడం ద్వారా వ్యక్తిగత స్థాయిలోని సన్నిహితత్వాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. ఇది అమెరికా–పాకిస్థాన్‌ సంబంధాల్లో లోతైన సమన్వయాన్ని సూచించే సంకేతం.

వాన్స్‌ చెప్పిన వ్యక్తులు వీరే..
వాన్స్‌ తన భార్య ఉషను ఇండియన్‌గా, పాకిస్తాన్‌ సైన్యాధిపతి అసిమ్‌ మునీర్‌ను పాకిస్తానీగా పేర్కొంటూ, గత మూడు నెలల్లో మునీర్‌తో జరిగిన సంభాషణలు ఇతరులతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ ప్రకటన ద్వారా ఆయన ఒక విదేశీ సైన్యాధిపతితో ఉన్న తన సన్నిహిత సంబంధాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. ఇది సాధారణ దౌత్యపరమైన మాటలకు మించి, వ్యక్తిగత రసాయనికతను బహిరంగంగా ఒప్పుకున్నట్లు కనిపిస్తుంది.

పాకిస్తాన్‌కు బూస్ట్‌..
జేడీ వాన్స్‌ వ్యాఖ్యలు పాకిస్తాన్‌ సైన్యాధిపతి అసిమ్‌ మునీర్‌ను చాలా సంతోషపెట్టాయి. ఒక అమెరికన్‌ ఉపాధ్యక్షుడు ఇంత స్పష్టంగా తన సన్నిహితత్వాన్ని ప్రకటించడం పాకిస్తాన్‌కు దౌత్యపరమైన గుర్తింపుగా మారింది. ఇది రెండు దేశాల మధ్య సైనిక, రాజకీయ సహకారం మరింత బలపడే అవకాశాలను సూచిస్తుంది. పాకిస్తాన్‌కు ఇది అంతర్జాతీయ వేదికపై మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది.

ఇరాన్‌ చర్చల్లో పురోగతి..
ఇక వాన్స్‌ ఇరాన్‌తో జరిగిన చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని ప్రకటించారు. ఇది అమెరికా ప్రాంతీయ సమస్యలపై సక్రియంగా నిమగ్నమై ఉన్నట్లు చూపిస్తుంది. ఇరాన్‌ వంటి సున్నితమైన అంశంపై చర్చల సమయంలో పాకిస్తాన్‌ సైన్యాధిపతితో ఇంత తరచుగా సంప్రదింపులు జరగడం, ప్రాంతీయ సమన్వయానికి పాకిస్తాన్‌ను కీలకంగా చూస్తున్నట్లు స్పష్టం చేస్తుంది.

దౌత్యంలో వ్యక్తిగత ప్రాముఖ్యత..
వాన్స్‌ వ్యాఖ్యలు వ్యక్తిగతం కాదు. ఇది అమెరికా విదేశాంగ విధానంలో వ్యక్తిగత బంధాలు ఎంత ప్రభావం చూపుతాయో చూపిస్తుంది. సాధారణంగా ఉన్నత స్థాయి నాయకులు విదేశీ సైన్యాధిపతులతో ఇంత సన్నిహిత సంబంధాన్ని బహిరంగంగా ఒప్పుకోవడం అరుదు. ఇది అమెరికా పాకిస్తాన్‌ సంబంధాలు ఇప్పుడు మరింత లోతైన, విశ్వసనీయ స్థాయికి చేరుకున్నాయని సూచిస్తుంది. వాన్స్‌ భార్య ఉష భారత సంతతికి చెందినది కావడం వల్ల ఆయనకు దక్షిణాసియాపై సహజమైన అవగాహన ఉండవచ్చు. అయినప్పటికీ పాకిస్తాన్‌ సైన్యాధిపతితో ఇంత దగ్గరి సంబంధం ఉండటం, అమెరికా భారతదేశం–పాకిస్తాన్‌ మధ్య సమతుల్య విధానం అనుసరిస్తున్నట్లు కనిపిస్తుంది.

మొత్తంమీద ఈ వ్యాఖ్యలు అమెరికా విదేశాంగ విధానం ఇప్పుడు మరింత వ్యక్తిగత, నేరుగా సంభాషణాత్మకంగా మారుతోందని చెప్పవచ్చు. భవిష్యత్తులో అమెరికా– పాకిస్తాన్, ఇరాన్‌ మధ్య సంబంధాలు ఎలా అభివృద్ధి చెందుతాయో, ప్రత్యేకించి దక్షిణాసియా–మధ్యప్రాచ్య ప్రాంతీయ రాజకీయాల్లో ఈ వ్యక్తిగత బంధాలు ఎంత ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది.