Home Blog Page 228

ఒకే సినిమాకు కలిసి పనిచేయబోతున్న తమన్ , అనిరుద్.. చరిత్రలో ఎప్పుడూ జరగని సంఘటన..

Thaman Anirudh Collaboration
Thaman Anirudh Collaboration

Thaman Anirudh Collaboration: ప్రస్తుతం మన సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే , మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు తమన్ , అనిరుద్. ఒకరు సౌత్ మొత్తాన్ని ఏలుతుంటే , మరొకరు టాలీవుడ్ ని ఏలుతున్నారు. ఇద్దరికీ కూడా చేతినిండా సినిమాలు ఉన్నాయి, క్షణం కూడా తీరిక లేని పరిస్థితి. చాలా టైట్ షెడ్యూల్స్ మీద వీళ్ళు సాంగ్స్ కంపోజ్ చేస్తుంటారు. అలాంటి ఈ టాప్ డైరెక్టర్స్ కలిసి ఒకే సినిమాకు పనిచేస్తారని మనం కలలో అయినా ఊహించి ఉంటామా?, కానీ ఆ అరుదైన సంఘటనకు త్వరలోనే బాలీవుడ్ వేదిక కానుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే , సల్మాన్ ఖాన్ హీరో గా, వంశీ పైడిపల్లి దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవం రీసెంట్ గానే గ్రాండ్ గా జరిగింది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించబోతుంది. బాలీవుడ్ లో ఒక సినిమాకు అనేక సంగీత దర్శకులు పని చేస్తారని , మన సౌత్ లో లాగా ఒక సినిమాకు , ఒకే మ్యూజిక్ డైరెక్టర్ వంటివి వాళ్ళ దగ్గర ఉండదని మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు సల్మాన్ ఖాన్ చిత్రానికి ఈ ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేయబోతున్నారు. ఇక మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరే ఊహించుకోండి. తమన్ ఇప్పటికే బాలీవుడ్ లో కొన్ని చిత్రాలకు మ్యూజిక్ అందించాడు కానీ , అవి పెద్ద రేంజ్ లో క్లిక్ అవ్వలేదు. కానీ అనిరుద్ మాత్రం ‘జవాన్’ చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి , తొలిసినిమాతోనే సిక్సర్ కొట్టేశాడు. అయితే ప్రస్తుతం ఇద్దరు మంచి ఫార్మ్ లోనే ఉన్నారు , సల్మాన్ కి అదిరిపోయే రేంజ్ మ్యూజిక్ ఇస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కి మంచి సినిమా అవసరం ఉంది. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. ఇప్పటి తరం యూత్ ఆడియన్స్ కి ఒక సినిమాపై ఆసక్తి కలగాలంటే, కచ్చితంగా పాటలు అద్భుతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ఇప్పుడు సల్మాన్ ఖాన్ విషయం లో జరగబోతుంది . కాబట్టి ఈసారి సల్మాన్ ఖాన్ కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాడని , పైగా వంశీ పైడిపల్లి కూడా మినిమం గ్యారంటీ డైరెక్టర్ అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

'కరుప్పు' 11 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. 2వ సోమవారం ఈ రేంజ్ గ్రాస్ అసలు ఊహించలేదు..

Karuppu 11 Days Collections
Karuppu 11 Days Collections

Karuppu 11 Days Collections: ‘ తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లు సునామీ ఎలాంటిదో ప్రతీ రోజు మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. 14 ఏళ్ళ నుండి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య, ఈ ఒక్క సినిమాతో ఈ రేంజ్ కం బ్యాక్ ఇస్తాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఎంత సూపర్ హిట్ సినిమా అయినా వీకెండ్ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అయిపోతున్న రోజులివి, అలాంటిది 2 వ సోమవారం రోజున కూడా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ సునామీ ఎలాంటిది అనేది. 11 రోజుల థియేట్రికల్ రన్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం , ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

ఒక్క తమిళనాడు ప్రాంతం నుండే ఈ చిత్రానికి 11 రోజుల్లో 120 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో 150 కోట్ల గ్రాస్ ని కచ్చితంగా రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 26 కోట్ల 18 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక నుండి 18 కోట్ల 55 లక్షలు , కేరళ నుండి 11 కోట్ల 50 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 75 లక్షలు , ఓవర్సీస్ నుండి 67 కోట్ల 45 లక్షలు రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 246 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు , 118 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 71 కోట్ల రూపాయలకు జరగ్గా, 47 కోట్ల రూపాయిల లాభాలు ఇప్పటి వరకు వచ్చాయి. ఇక తెలుగు లో ఈ చిత్రం ‘వీరభద్రుడు’ అనే టైటిల్ తో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ చిత్రానికి విడుదలకు ముందు 7 కోట్ల 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 13 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే 5 కోట్ల 75 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట. రాబోయే రోజుల్లో ఇంకా ఎంత లాభాలను ఈ చిత్రం రాబట్టబోతుందో చూడాలి.

50 శాతం పడిపోయిన 'దృశ్యం 3' వసూళ్లు.. 5 రోజుల్లో వచ్చిన గ్రాస్ ఎంతంటే..

Drishyam 3 Collections
Drishyam 3 Collections

Drishyam 3 Collections: మోహన్ లాల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దృశ్యం 3’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , ఆడియన్స్ లో డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా తక్కువకు జరగడం తో , కేవలం వీకెండ్ తోనే ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. కేవలం మలయాళం లోనే కాదు , తెలుగు , తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుకి చాలా దగ్గరగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 3 కోట్ల 75 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 5 రోజుల్లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు అక్షరాలా 3 కోట్ల రూపాయిలు , ఇక కేవలం 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని దాటినట్టే.

చాలా కాలం తర్వాత మోహన్ లాల్ కి తెలుగు లో ఒక సూపర్ హిట్ చిత్రం గా ‘దృశ్యం 3’ నిలవబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , కేరళ రాష్ట్రము నుండి 45 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్ల 10 లక్షలు, తమిళనాడు రాష్ట్రము నుండి 5 కోట్ల 75 లక్షలు, కర్ణాటక రాష్ట్రం నుండి 10 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్ల 65 లక్షలు , ఓవర్సీస్ నుండి 84 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేరళ రాష్ట్రంలో వచ్చిన వసూళ్లకంటే ఓవర్సీస్ లో వచ్చిన వసూళ్లు రెండింతలు ఉండడం సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 154 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 68 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

విడుదలకు ముందు అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి ఈ చిత్రానికి కేవలం 30 కోట్ల రూపాయిల బిజినెస్ మాత్రమే జరిగింది. ఇప్పటి వరకు 38 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి, రాబోయే రోజుల్లో ఇంకా ఎంత లాభాలు రాబోతున్నాయి ఊహించుకోవచ్చు. అయితే నాల్గవ రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి, కానీ 5 వ రోజున కేవలం 13 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి . అంటే దాదాపుగా 50 శాతం వసూళ్లు డ్రాప్ అయ్యాయి అన్నమాట. లాంగ్ రన్ కి ఇది శుభ సూచికం కాదు, రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

అమెరికా అబ్రహం అకార్డ్స్.. నవరంధ్రాలు మూసుకున్న పాకిస్థాన్

America Abraham Accords Pakistan
America Abraham Accords Pakistan

America Abraham Accords Pakistan: అమెరికాను నమ్మి బాగుపడినట్టు ఈ ప్రపంచ చరిత్రలో ఏ దేశానికీ లేదు. అమెరికా అనేది అవసరాల ఆధారంగా నడుచుకునే దేశం. తనకు ప్రయోజనాలు ఉన్నాయనుకుంటే ఎక్కడి దాకైనా వెళ్తుంది. ఏమైనా చేస్తుంది. ఇతర దేశాల పరిపాలనలో కూడా వేలు పెడుతుంది. అవసరమైతే ఆ దేశాల అధ్యక్షులను అపహరిస్తుంది. తన ప్రయోజనాల వరకే ఇతర దేశాలతో అమెరికా ప్రయాణం సాగిస్తుంది. ఆ తర్వాత దూరం పెడుతుంది. అవసరమైతే ఇంకా ఎంతకైనా తెగిస్తుంది.

పాకిస్థాన్ తో కొంతకాలంగా అమెరికా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. ఆ మధ్య పాకిస్థాన్ సైనికాధ్యక్షుడు అసిమ్ మునీర్ అమెరికా వెళ్లాడు. ట్రంప్ ను కలిశాడు. కొన్ని రంగుల బాక్సులు ఇచ్చాడు. వాటిని చూసిన ట్రంప్ ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు. పాకిస్థాన్ లో వెంటనే మైనింగ్ మొదలు పెడుతున్నానని సంకేతాలు ఇచ్చాడు. ఇంతవరకు అక్కడ మైనింగ్ మొదలు కాలేదు. అమెరికా అక్కడ అడుగు పెట్టింది కాబట్టి.. ఇతర దేశాలు అటువైపు చూడలేవు. పైగా అమెరికా తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే అక్కడ మైనింగ్ షురూ చేస్తుంది.

తమతో బాగానే ఉంటోందని పాకిస్థాన్ జబ్బలు చరుచుకుంటున్నది. కానీ అసలు విషయం పాకిస్థాన్ కు ఇప్పుడు అర్థమైంది. అదును చూసి పాకిస్థాన్ ను అమెరికా గట్టి దెబ్బకొట్టింది. అబ్రహం అకార్డ్స్ ను తెరపైకి తీసుకొచ్చి పాకిస్థాన్ కు షాక్ ఇచ్చింది. అబ్రహం అకార్డ్స్ అంటే.. పచ్చిమాసియా దేశాలతో కలిసి పని చేయడం.. ఇందులో ఇజ్రాయిల్ కూడా ఉంటుంది.. ఇజ్రాయిల్ ఉండడం ముస్లిం దేశాలకు ఏమాత్రం నచ్చదు. కానీ ఇప్పుడు అమెరికా ఒత్తిడి తీసుకొస్తుంది కాబట్టి తప్పదు. అబ్రహం అకార్డ్స్ ను 2020లో తెరపైకి తీసుకొచ్చారు. పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులను మెరుగు పరిచేందుకు.. రాజకీయంగా, దౌత్యపరంగా పరిస్థితులను చక్క దిద్దడానికి అబ్రహం అకార్డ్స్ ను రూపొందించారు. అమెరికా ఇందులో మధ్యవర్తిత్వపాత్ర పోషించింది. ఇజ్రాయిల్ తో సంబంధాలు పెంపొందించుకోవాలని అమెరికా పదేపదే ప్రస్తావించింది. ఇది ముస్లిం దేశాలకు ఏమాత్రం నచ్చడం లేదు.

నాడు అమెరికా మధ్యవర్తిత్వంలో రూపొందించిన ఒప్పందాలపై మొరాకో, సుడాన్, బహ్రేయిన్, యూఏఈ వంటి దేశాలుసంతకాలు చేశాయి. అబ్రహం అకార్డ్స్ ను ఏకంగా అరబ్ దేశాలకు విస్తరించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇజ్రాయిల్ పాలస్తీనా పై విపరీతంగా దాడులు చేయడం.. గాజా నగరాన్ని నరకంగా మార్చడంతో అబ్రహం అకార్డ్స్ ను మిగతా ముస్లిం దేశాలు ఎలా స్వీకరిస్తాయో తెలియడం లేదు. ఇజ్రాయిల్ వ్యవహార శైలి నేపథ్యంలో తాము దౌత్య పరమైన సంబంధాలు కొనసాగించలేమని సౌదీ అరేబియా అనేక సార్లు వివరించింది.

అబ్రహం అకార్డ్స్ ను 2020లో నాటి పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత షహబాజ్ షరీఫ్ కూడా అబ్రహం అకార్డ్స్ కు సమ్మతి వ్యక్తం చేయలేదు. ఇజ్రాయిల్ ను తాము గుర్తించబోమని ఆయన పదే పదే స్పష్టం చేశారు. ఇటీవల ఇరాన్ , అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదర్చడానికి పాకిస్థాన్ ప్రయత్నాలు చేసింది. సరిగ్గా ఇప్పుడు దీనిని ట్రంప్ పాకిస్థాన్ ముందు పెడుతున్నారు.ఒకవేళ పాకిస్థాన్ కనుక సంతకాలు పెడితే అంతే సంగతులు. ఇది ఆర్థికంగా.. భద్రతపరంగా.. రాజకీయపరంగా పాకిస్తాన్ దేశానికి అనేక రకాల చిక్కులు తెచ్చిపెడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఒత్తిడి నేపథ్యంలో పాకిస్తాన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

ట్రంప్ కుంపటి రాజేశాడు.. పాకిస్థాన్ అధ్యక్షుడిగా అసిమ్ మునీర్..

Donald Trump Pakistan Politics
Donald Trump Pakistan Politics

Donald Trump Pakistan Politics: అడుగులకు మడుగులొత్తినా.. మాటలకు తాళాలు తప్పెట్లు వాయించినా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇకపై బాగుంటుందనే నమ్మకం లేదు. అతడు ఎంత వంగి వంగి దండాలు పెట్టినా అమెరికా నమ్మడం లేదు. పైగా అతడి కుర్చీ లాగేసి.. అందులో మహా క్రూరుడు అసిమ్ మునీర్ ను కూర్చోపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీంతో షరీఫ్ పరిస్థితి దారుణంగా మారింది. ట్రంప్ ధోరణివల్ల అతడి పోస్ట్ ఉంటుందో.. ఊడుతుందో అర్థం కాని పరిస్థితి.

ఇటీవల ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు నిర్వహించేందుకు పాకిస్థాన్ సిద్ధమైంది. ఒక దఫా మధ్యవర్తి పాత్ర కూడా పోషించింది. పాకిస్థాన్ ఎంతో ఖర్చు పెట్టుకుని ఆ పని చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు మలిదఫా కూడా శాంతి చర్చలకు తాము నాయకత్వం వహిస్తామని పాకిస్థాన్ చెబుతోంది. ఇది ఎక్కడి దాకా దారి తీస్తుందో తెలియదు. అయితే శాంతి నెలకొనే అవకాశం లేదని కొంతమంది.. పాకిస్థాన్ శాంతి చర్చలకు సారథ్యం వహించడం ఏంటని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

శాంతి చర్చలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. ట్రంప్ ట్రూత్ సోషల్ లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అవి పాకిస్థాన్ రాజకీయాలలో ప్రకంపనలకు కారణమయ్యాయి. అరబ్ దేశాలు అబ్రహం అకార్డ్స్ లో చేరాలని పేర్కొన్న ట్రంప్..సౌదీ అరేబియా, ఖతార్ చేరతాయని, ఇరాన్ కూడా అందులో చోటు సంపాదించుకుంటుందనే నమ్మకం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రూత్ సోషల్ లో అన్నిదేశాల అధ్యక్షుల పేర్లను ట్రంప్ ప్రస్తావించారు. పాకిస్థాన్ విషయంలోమాత్రం నాలుక మడతపెట్టారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి పేరును షహబాజ్ షరీఫ్ పేరును ఆయన మర్చిపోయారు. అతడి పేరు స్థానంలో సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ పేరును ప్రస్తావించారు.దీంతో అమెరికా తదుపరి పాకిస్థాన్ ప్రధానమంత్రిగా మునీర్ ను చేస్తుందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యయుత విధానాలకు ట్రంప్ చరమగీతం పాడుతున్నారని ఓ వర్గం మీడియాలో వార్తలు ప్రసారమవుతున్నాయి. వెనిజులా అధ్యక్షుడిని ట్రంప్ ఇదేవిధంగా అపహరించారు. నేరగాడిగా జైల్లోపెట్టారు. ఇప్పుడు షరీఫ్ విషయంలో కూడాఇలానే చేస్తారేమోనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఆంధ్ర సమాంతర రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకే ఒక్కడు

Pawan Kalyan

Pawan Kalyan Rajahmundry tour : పవన్ కళ్యాణ్ నిన్న రాజమండ్రి పర్యటన ఆద్యంతం ఆకట్టుకుంది. హృదయానికి హత్తుకుంది. పర్యావరణానికి ఇచ్చే ప్రాధాన్యత.. ప్రేమ ఎంతో గొప్పగా ఉంది. గోదావరి పుష్కరాల్లో పన్నీరు స్నానం అవసరం లేదని.. కెమికల్స్ స్నానం లేకుండా ఉంటే చాలు అని పవన్ కళ్యాణ్ అన్నారు.

రాజమండ్రి వద్ద కాలుష్య కారకాలైన మురికి నీరు, కెమికల్ నీరు గోదావరిలో కలుస్తోందని.. దీనివల్ల భక్తులు పుష్కర స్నానం ఎలా చేస్తారంటూ పవన్ ప్రశ్నించారు.

ఇక రాజమండ్రిలో జనసేన సమావేశంలో తనను విమర్శించే వారిపై ఘాటైన విమర్శలు చేశారు. కాపు కుల సంఘాలు , దాసరి రాము లాంటి వారు కూడా పవన్ ను విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను కుల నాయకుడిగా ముద్ర పడాలని వారంతా కుట్ర చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం తాను ఎప్పుడూ కుల పక్షపాతిని కాదని కుండబద్దలు కొట్టారు.

ఆంధ్ర సమాంతర రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకే ఒక్కడు.. దీనిపై ’రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

ప్లే ఆఫ్ సమరం: ఆ సెంటిమెంట్ ఈసారీ రిపీట్ అవుతుందా..

IPL 2026 Playoffs : ఇప్పటివరకు ఐపీఎల్ జోరుగా సాగింది. అభిమానులకు వీనులవిందైన క్రికెట్ ఆనందాన్ని అందించింది. ఇకపై ఐపీఎల్ ఆట తీరు మారబోతోంది. మంగళవారం నుంచి ప్లే ఆఫ్ సమరం షురూ అవుతోంది. ధర్మశాల వేదికగా బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ పోటీ పడపోతున్నాయి. క్వాలిఫైయర్ 1 లో భాగంగా ఈ పోటీ జరుగుతోంది.

రెండు జట్లలో ప్లేయర్లు అద్భుతంగా ఉన్నారు. పోటీ చూడపోతే రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా సరే నేరుగా ఫైనల్ వెళ్లొచ్చు. ఓడిపోయిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ వెళ్తుంది. క్వాలిఫైయర్ లో విజేత జట్టుకు, ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుకు ఫైనల్ పోరు జరుగుతుంది.

ప్లే ఆఫ్ సమరం జరుగుతున్న నేపథ్యంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. క్వాలిఫైయర్ మ్యాచ్ లో గెలిచిన జట్టు ట్రోఫీ గెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. గత పరిణామాలు కూడా దీనినే నిరూపించాయి. 2011 నుంచి ప్లే ఆఫ్ విధానం అమల్లో ఉంది. నాటి నుంచి 15 సీజన్లు జరిగాయి. 12 సార్లు క్వాలిఫైయర్ 1 లో గెలిచిన జట్టు ట్రోఫీ సొంతం చేసుకుంది. 2013, 2016, 2017లో మాత్రం విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. మిగతా సందర్బాలలో మాత్రం క్వాలిఫైయర్ 1 లో గెలిచిన జట్టే ఐపీఎల్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. 2011లో చైన్నై, 2012,2014లో కోల్ కతా, 2015లో ముంబాయి, 2018లో చెన్నై, 2020లో ముంబయి, 2021లో చెన్నై, 2022లో గుజరాత్, 2023లో చెన్నై, 2024లో కోల్కతా, 2025లో బెంగళూరు ట్రోఫీలను అందుకుని సరికొత్త చరిత్ర నెలకొల్పాయి.

2013లో క్వాలిఫైయర్ 1లో చైన్నై ఎదుట ముంబయి నిలబడలేకపోయింది. క్వాలిఫైయర్ 2 లో రాజస్థాన్ పై గెలిచిన ముంబయి .. పైనల్ మ్యాచ్ లో చెన్నైమీద గెలిచి ట్రోఫీ అందుకుంది. 2016లో సన్ రైజర్స్ అదరగొట్టింది. నాలుగో స్థానంలో నిలిచిన వార్నర్ సేన ఏకంగా విజేత అయింది. ఎలిమినేటర్ లో కోల్ కతాను ఓడించింది. క్వాలిఫైయర్ 2 లో గుజరాత్ ను మట్టి కరిపించింది. ఫైనల్ పోరులో బెంగళూరును ఓడించి ట్రోఫీ అందుకుంది.

2017లో క్వాలిఫైయర్ లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ చేతిలో ముంబయి ఇండియన్స్ ఓటమి పాలయింది. క్వాలిఫైయర్2లో కోల్ కతాను ఓడించింది. చివరి పోరులో ముంబయి ఒక్క పరుగు తేడా పూణె మీద గెలిచి ట్రోఫీ దక్కించుకుంది ముంబయి ఇండియన్స్.

ప్లే ఆఫ్ సమరం: ఆర్సీబీకి శాపంగా విరాట్ కోహ్లీ.. జీటీతో మ్యాచ్ లో ఏం జరుగుతుందో..

Virat Kohli Orange Cap 2026
Virat Kohli Orange Cap 2026

RCB vs GT IPL playoffs : ఐపీఎల్ లో భాగంగా ధర్మశాలలో బెంగళూరు, గుజరాత్ జట్లు నేడు పోటీ పడుతున్నాయి. మరి కాసేపట్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. రెండు జట్లలో సమవుజ్జీలైన ప్లేయర్లున్నారు. దీంతో పోటీ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. బెంగళూరు జట్టు తరఫున విరాట్ కోహ్లీ వీరోచితంగా ఆడుతున్నాడు. 37 ఏళ్ల వయసులోనూ అతడు దూకుడుకు పర్యాయపదంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ ప్లే ఆఫ్ లో రెచ్చిపోతే తమకు తిరుగుండదని బెంగళూరు మేనేజ్మెంట్ భావిస్తోంది.

విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడైనప్పటికీ ప్లే ఆఫ్ ముందు అతడి ఆట గురించి బెంగళూరు యాజమాన్యం కలవరపడుతోంది. ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు. ఇందులో విరాట్ కోహ్లీ 557 పరుగులు చేశాడు. అతడి యావరేజ్ 50.64, స్ట్రైక్ రేట్ 163.82 గా ఉంది. విరాట్ కోహ్లీ ఫామ్ పరంగా పెద్దగా ఇబ్బంది లేకపోయిన్పటికీ ప్లే ఆఫ్ సమరంలో అతడి రికార్డులు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ సీజన్ లో చివరి లీగ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ హైదరాబాద్ జట్టు పై కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. దీనికి తోడు ప్లే ఆఫ్ సమరంలో విరాట్ కోహ్లీకి దారుణమైన రికార్డు ఉంది. తన కెరియర్ లో విరాట్ కోహ్లీ మొత్తం 17 ప్లే ఆఫ్ మ్యాచ్ లు ఆడాడు. అతడి సగటు 26.40, 121.10 స్ట్రైక్ రేట్.. పైగా అతడు 396 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతడు రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 70 *(2011లో చైన్నై జట్టుతోజరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ లో అతడు ఈ స్కోర్ చేశాడు)

ప్లే ఆఫ్ లో ఐదుసార్లు అతడు సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యాడు. ఒకసారి సున్నా పరుగులకే ఔటయ్యాడు. ఐదుసార్లు ఏకంగా 30 పరుగుల లోపే వెనక్కి వెళ్లిపోయాడు. గడిచిన సీజన్ లో ప్రీతిజింటా జట్టుతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. ఫైనల్ మ్యాచ్ లో 35 బంతులు ఎదుర్కొని 43 రన్స్ చేశాడు. అతడి ప్లే ఆఫ్ రికార్డ్ నిరాశపరుస్తున్ననేపథ్యంలో పాతజ్జాపకాలను మరిచిపోయి, విరాట్ ఒక రేంజ్ లో బ్యాటింగ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు.

వేలంలో ఎవరూ దేకలేదు.. సీన్ కట్ చేస్తే ఆరెంజ్ క్యాప్ తో సంచలనం

Chris Gayle
Chris Gayle

Chris Gayle : వేలంలో ఎవరూ దేకలేదు. కనీసం పట్టించుకోలేదు. ఇతడినేంటి కోనుగోలు చేసేది అన్నట్టుగా జట్ల యాజమన్యాలు వ్యవహరించాయి. నవ్విన నాప చేను పండుతుందన్నట్టుగా అతడు అదరగొట్టాడు. సూపర్ బ్యాటింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఐపీఎల్ లో బెంగళూరు తరఫున క్రిస్ గేల్ నెలకొల్పిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడు పొట్టి ఫార్మాట్ లో సింహం లాగా రెచ్చిపోయాడు. పరుగుల వరద పారించాడు. ఇప్పటికీ అతడు సాధించిన రికార్డులు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. మేటి ప్లేయర్లు ఐపీఎల్ లో ఆడుతున్నప్పటికీ క్రిస్ గేల్ రికార్డులను ఏ ఆటగాడు బద్దలు కొట్టలేకపోతున్నాడు.

గేల్ ఆరెంజ్ క్యాప్ విభాగంలో అనేక సందర్భాల్లో స్థానం సంపాదించుకున్నాడు. బెంగళూరు తరఫున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. అయితే అతడి ఐపీఎల్ కెరియర్ లో 2010లో సీజన్ తర్వాత అతడిని కోల్ కతా నైట్ రైడర్స్ తప్పించింది. అయితే ఆ సీజన్ లో ఆసీస్ ఆటగాడు డిర్క్ నేన్స్ గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో బెంగళూరు అతడిని కొనుగోలు చేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో గేల్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు.

నాటి సీజన్ లో గేల్ వీరోచితంగా బ్యాటింగ్ చేశాడు. 12 మ్యాచ్ లలో 608 పరుగులు చేశాడు. తద్వారా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోకుండా ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ఆటగాడిగా గేల్ రికార్డు నెలకొల్పాడు. వాస్తవానికి కోల్ కతా తనను తప్పించడంతో గేల్ అది మనసులో పెట్టుకున్నాడు. తనను కొనుగోలు చేసిన బెంగళూరు జట్టుకు ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ లు ఆడి తన పేరును అతడు సార్థకం చేసుకున్నాడు. గత సీజన్ లో బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత గేల్ సంబరాలు చేసుకున్నాడు. ట్రోఫీని అందుకుని విజయగర్వంతో ఉప్పొంగి పోయాడు. తోటి ప్లేయర్లతో కలిసి ఫొటోలు దిగాడు. వాటిని సోషల్ మీడియాలో పంచుకుని, తన ఆనందాన్ని మరింత పరివ్యాప్తం చేసుకున్నాడు.

అమెరికా–ఇరాన్‌ వార్‌... ఒకవైపు శాంతి మంత్రం.. మరోవైపు యుద్ధ తంత్రం..!

America Iran war latest updates
America Iran war latest updates

America Iran war latest updates: పశ్చిమాసియాలో త్వరలోనే శాంతి నెలకొంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచానికి శుభవార్త చెప్పారు. ఇరాన్‌ కూడా యురేనియం వదులుకునేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో ఇక అంతా మంచే జరుగుతుందని భావిస్తున్న వేళ అమెరికా ఆత్మరక్షణ పేరుతో ఇరాన్‌పై భీకర దాడులు మొదలు పెట్టింది. మరోమారు తన సైనిక బలాన్ని ప్రదర్శించింది. ఇరాన్‌ దక్షిణ తీర ప్రాంతాల్లోని బందర్‌ అబ్బాస్, క్వెష్మ్‌ పోర్టు సమీపంలోని సైనిక స్థావరాలు, క్షిపణి లాంచ్‌ ప్యాడ్లు, సముద్రంలో మైన్లు (మందుపాతరలు) పరచే బోట్లు, నేవీ బేస్‌లపై తీవ్ర దాడులు జరిపింది. అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రతినిధి కెప్టెన్‌ టిమోతీ హాకిన్స్‌ ఈ దాడులను ‘‘ఆత్మరక్షణ చర్య’’గా సమర్థించారు. ఇరాన్‌ తీరం వెంట ఉన్న క్షిపణి స్థావరాలు తమ విమాన వాహక నౌకలు, యుద్ధ నౌకలకు నేరుగా ముప్పు కలిగించాయని, మందుపాతరలు పరచడానికి ప్రయత్నించే బోట్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. లర్క్‌ ద్వీపంలో కనీసం నలుగురు మరణించినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌ కూడా పాల్గొన్నట్లు కొన్ని వార్తా వర్గాలు పేర్కొన్నాయి.

సీజ్‌ఫైర్‌ ఉల్లంఘన..
ఏప్రిల్‌ 7న ప్రకటించిన సీజ్‌ఫైర్‌ అమలులో ఉన్నప్పటికీ ఇరాన్‌ తన సైనిక సామర్థ్యాన్ని వేగంగా పునరుద్ధరిస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్‌ గుర్తించింది. ఇది ఇరాన్‌కు స్పష్టమైన హెచ్చరిక. దోహాలో జరుగుతున్న కీలక దౌత్య ప్రయత్నాలుదాడులు జరుగుతున్న అదే సమయంలో ఖతార్‌ రాజధాని దోహాలో ఇరాన్‌–అమెరికా దూతల మధ్య కీలక చర్చలు సాగుతున్నాయి. ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ మహమ్మద్‌ బాఘర్‌ ఘాలిబఫ్‌ నేతృత్వంలోని బృందం ఈ సంప్రదింపుల్లో పాల్గొంటోంది. ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘాయీ మాట్లాడుతూ అనేక అంశాలపై అవగాహన కుదిరినట్లు, అయితే ఇంకా కొన్ని కీలక సమస్యలు మిగిలి ఉన్నాయని తెలిపారు.ఇరాన్‌ ప్రధాన దృష్టి యుద్ధ ముగింపు (లెబనాన్‌తో సహా) వైపే ఉందని, ప్రస్తుతం అణు అంశాలను చర్చించడం లేదని స్పష్టం చేశారు.

యుద్ధం పూర్తిగా ముగిస్తే..
యుద్ధం పూర్తిగా ముగిస్తే 60 రోజుల వ్యవధిలో అణు సంబంధిత చర్చలు ప్రారంభించవచ్చని సంకేతాలిచ్చారు. ఖతార్‌ మధ్యవర్తిత్వం ఈ చర్చలకు కీలకమవుతోంది. లెబనాన్‌పైనా దాడులు జరగకుండా ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది.

మిసైల్‌ దాడులు..
ఈ తరుణంలో అమెరికా 33 మిసైల్‌ సైట్లలో దాదాపు 30ను తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 70 శాతం మొబైల్‌ మిసైల్‌ లాంచర్లను మోహరించింది. ఇది ఇరాన్‌ ఎదురుదాడి సామర్థ్యాన్ని ఇప్పటికీ కాపాడుకోవాలన్న సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది. మరోవైపు అమెరికా దాడులు ఇరాన్‌ను మరింత ఒత్తిడికి గురి చేసి చర్చల టేబుల్‌ వద్ద రాజీకి సిద్ధం చేయడానికి ఉద్దేశించినట్లు కనిపిస్తోంది. ఈ ద్వంద్వ వ్యూహం (దాడి + దౌత్యం) మధ్యప్రాచ్య రాజకీయాల సారాంశాన్ని బయటపెడుతోంది. స్ట్రెయిట్‌ ఆఫ్‌ హార్ముజ్‌ భద్రత, ఇరాన్‌ అణు కార్యక్రమ నియంత్రణ, ప్రాంతీయ స్థిరత్వం – ఇవన్నీ అమెరికా స్ట్రాటజిక్‌ లక్ష్యాలు. ఇరాన్‌ మాత్రం ఆర్థిక ఒత్తిడి, సైనిక నష్టాల నుంచి బయటపడి తన ప్రాంతీయ ప్రభావాన్ని కాపాడుకోవాలని చూస్తోంది.

ఇరాన్‌ ఎలా స్పందిస్తుంది?
ఈ చర్చలు విజయవంతమైతే మధ్యప్రాచ్యంలో కొత్త శాంతి అధ్యాయం మొదలవుతుంది. ఇరాన్‌ ఆయిల్‌ ఎగుమతులు సాఫీగా జరగడం, ఆర్థిక ఉక్కిరిబిక్కిరి తగ్గడం, ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గడం వంటి సానుకూల ఫలితాలు వస్తాయి. కానీ ఒప్పందం కుదరకపోతే ఉద్రిక్తతలు మరింత పెరిగి పెద్ద యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం రెండు వైపులా ‘‘ఒప్పందం కావాలి’’ అన్న కోరిక కనిపిస్తోంది. అయితే షరతులు, అణు అంశాలు, సైనిక నియంత్రణ వంటి విషయాల్లో ఇంకా తీవ్ర అసమ్మతి నెలకొని ఉంది.

దోహా చర్చల ఫలితాలు రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. మధ్యప్రాచ్య శాంతి ఎప్పుడూ సులభం కాదు. బాంబులు పడుతున్నప్పుడే దౌత్యం నడుస్తున్న ఈ ఆటలో ఏ చిన్న తప్పిదం కూడా సమస్యగా మారుతుంది. ఈ సంక్లిష్టతల మధ్య నుంచి నిజమైన శాంతి ఎలా ఉద్భవిస్తుందో చూడాలి.

బాలినేని కోసం రంగంలోకి పవన్!

Pawan Kalyan Balineni Srinivasa Reddy
Pawan Kalyan Balineni Srinivasa Reddy

Pawan Kalyan Balineni Srinivasa Reddy: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా కొత్తవారి చేరికలతో పార్టీని మరింత బలోపేతం చేయాలని చూస్తున్నారు. అయితే ఈ చేరికల విషయంలో జనసేన నేతలు అనుసరిస్తున్న వైఖరిపై పవన్ ఆగ్రహంగా ఉన్నారు. పార్టీని అభివృద్ధి చేయాలంటే చేరికలను ప్రోత్సహించాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే ఇటీవల కొన్ని జిల్లాల్లో పార్టీ క్రమశిక్షణ కట్టు దాటుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు ఆ జిల్లాలపై. అందులో భాగంగా ప్రకాశం జిల్లా పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేశారు. అక్కడ పార్టీ నేతలు అనుసరిస్తున్న తీరును తప్పు పట్టారు. ఒక నేతపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే వెళ్లిపోండి అంటూ తేల్చి చెప్పడం విశేషం. ఇటీవల జరిగిన పరిణామాలతోనే పవన్ సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తోంది.

బాలినేని రాక పై వ్యతిరేకత..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ కూడా. కానీ ఆయన రాకను ప్రకాశం జిల్లా నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చివరకు అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన వారి వైఖరి మారడం లేదు. దీంతో అధినేత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. క్రమంలోనే నిన్న జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రకాశం జిల్లా నేతలను ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. అయితే ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రియాజ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఆయన మాజీ మంత్రి బాలినేని రాకను వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల బాలినేనికి జనసేన డీలిమిటేషన్ కమిటీ లో చోటు ఇచ్చారు. అధినేత ఆదేశాల మేరకు రాయలసీమతో పాటు ఒంగోలు, నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం అయ్యారు బాలినేని. అక్కడ ఓ నేత బాహాటంగానే విమర్శలు చేశారు బాలినేని పై. దీనిపై తాజాగా స్పందించిన పవన్ సదరు నేతపై వేటు వేశారు. అంతటితో ఆగకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని రద్దు చేశారు. నియోజకవర్గ ఇన్చార్జి లతోపాటు వివిధ విభాగాల ప్రతినిధులను సైతం పదవుల నుంచి తొలగించారు. కొత్త కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా మాజీ మంత్రి బాలినేనికి కీలక బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు సంకేతాలు పంపారు.

కమిటీలన్నీ రద్దు..
ఇటీవల బాలినేని విషయంలో వైఖరి మారుతోంది పవన్ కళ్యాణ్ కు. మొన్ననే ఆయన సీఎం చంద్రబాబును సైతం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాలినేని రాకను టిడిపి ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో జనసేన క్యాడర్ సైతం వ్యతిరేకిస్తోంది. ఒంగోలు కార్పొరేషన్ నుంచి 26 మంది కార్పొరేటర్ లను జనసేనలో చేర్పించారు బాలినేని. అయినా సరే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రియాజ్ సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. వాస్తవానికి బాలినేని వైసీపీ నుంచి రావడంతో ఆయనపై అనుమానపు చూపులు ఉండేవి. పని జిల్లా జనసేన నేతలు వైఖరి చూస్తుంటే వారి వెనుక వైసిపి ఉన్నట్టు అర్థం అవుతుంది. కేవలం బాలినేని అడ్డుకోవాలని రీతిలో వైసిపి నాయకత్వం స్థానిక జనసేన నేతలతో ఇలా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వరకు వెళ్లడంతో ఆయన కమిటీలన్నింటినీ రద్దు చేశారు. ఇకనుంచి బాలినేనికి జిల్లా బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉంది. టిడిపి పరంగా కూడా బాలినేనిపై ఇకనుంచి అభ్యంతరాలు రాకపోవచ్చు. ఎందుకంటే బాలినేని ఒంగోలు విడిచి దర్శి వైపు అడుగులు వేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మొత్తానికైతే పరిస్థితులు చూస్తుంటే మాజీ మంత్రి బాలినేనికి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

కేశినేని నానికి ఇన్నాళ్లకు మనశ్శాంతి!

Kesineni Nani latest news
Kesineni Nani latest news

Kesineni Nani latest news: రాజకీయాల్లో చాలామంది క్షణికావేశాలకు పోతుంటారు. తప్పుడు నిర్ణయాలు తీసుకొని చేజేతులా అవకాశాలను కోల్పోతుంటారు. అటువంటి వారే విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని. తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడయ్యారు నాని. 2014 నుంచి 2019 మధ్య ఎంపీగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని బాగానే అభివృద్ధి చేశారు. 2019లో జగన్ ప్రభంజనంలో గెలిచేసరికి తన సొంత ఇమేజ్ అని భావించారు. అందుకే నాయకత్వాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు. 2024 ఎన్నికలకు రోజుల ముందు టిడిపికి గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరి సొంత తమ్ముడు చేతిలో ఓడిపోయారు. తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. కానీ ఇంతటి పరిణామాలకు తన సొంత తమ్ముడు కారణమని.. టిడిపికి గుడ్ బై చెప్పడానికి తన తమ్ముడు కేసినేని చిన్ని వ్యవహార శైలి కారణమని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు కేశినేని నాని.

చంద్రబాబు ప్రోత్సాహంతోనే..
టిడిపి అధినేత చంద్రబాబు కేసినేని నానిని ఎంతగానో ప్రోత్సహించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన నాని ఓడిపోయారు. ఆయనను తెలుగుదేశం పార్టీలోకి రప్పించి కీలకమైన విజయవాడ పార్లమెంట్ సీటును ఇచ్చారు చంద్రబాబు. నాని సైతం చంద్రబాబు నాయకత్వం విషయంలో చాలా గౌరవంగా ఉండేవారు. అయితే 2019లో రెండోసారి గెలిచిన తర్వాత.. తనకు పక్కలో బల్లెం లా తయారయ్యారు సోదరుడు కేసినేని చిన్ని. సొంత ఇమేజ్తో గెలిచానని నాని సైతం కొంచెం నాయకత్వం విషయంలో నిర్లక్ష్యం చేశారు. దానిని క్యాష్ చేసుకున్న సోదరుడు చిన్ని నాయకత్వం మనసులో స్థానం సంపాదించుకున్నారు. క్రమేపి చిన్ని పార్టీ నాయకత్వానికి దగ్గర కాగా.. కేశినేని నాని మాత్రం అలా దూరమైపోయారు. పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అలా పొలిటికల్ గా కేశినేని నానికి డ్యామేజ్ జరిగింది. అయితే తాను టిడిపికి దూరం కావడానికి సోదరుడు చిన్ని కారణమని ఆగ్రహంతో రగిలిపోయారు నాని. అదును కోసం ఎదురు చూశారు.

మద్యం కుంభకోణంపై సంచలన ఆరోపణలు..
ఇటీవల మద్యం కుంభకోణం కేసులో కేశినేని చిన్ని కుటుంబం పేరు బయటకు వచ్చింది. ప్రస్తుతం విజయవాడ ఎంపీగా ఉన్న చిన్ని భార్య జానకి లక్ష్మి కి ఈడి నోటీసులు ఇచ్చింది. రేపు ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది. వైసిపి హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు రాజ్ కసిరెడ్డి. ఆయనతో కేసినేని చిన్ని దంపతులకు చెందిన కంపెనీ వ్యాపార భాగస్వామి అని.. అప్పట్లో మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన సొమ్మును చిన్ని కంపెనీలకు వెళ్ళింది అంటూ మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. వైసిపి హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఎంపీ చిన్ని కుటుంబ పాత్ర ఉందంటూ ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా ఏపీ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు కూడా చేశారు. ప్రత్యేకంగా లేఖ రాశారు. ఇప్పుడు ఈడి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడంతో.. మాజీ ఎంపీ కేసినేని నాని మనసు కొంత కుదుటపడింది. తనను ఎలా టిడిపి నాయకత్వం నుంచి దూరం చేశారో.. అదే టిడిపి నాయకత్వం ఎంపీ చిన్నిపై అనుమానపు చూపులు చూసేలా చేశారు నాని. మున్ముందు ఈ పరిణామాలు ఎటు వైపునకు దారితీస్తాయో చూడాలి.

ధురంధర్ 2' ఎఫెక్ట్ టాలీవుడ్ ఓవర్సీస్ మార్కెట్ పై బలంగా పడిందా..? ఇలా జరుగుతుందని అనుకోలేదు..

Dhurandhar 2 effect on Tollywood
Dhurandhar 2 effect on Tollywood

Dhurandhar 2 effect on Tollywood: తెలుగు సినిమా ఓవర్సీస్ మార్కెట్ పై ‘ధురంధర్ 2’ ప్రభావం చాలా బలంగా పడిందా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే ఈ సినిమా తర్వాతే మన టాలీవుడ్ మార్కెట్ ఓవర్సీస్ లో బాగా పడిపోయిందని కొందరి వాదన. ఎందుకంటే ‘ధురంధర్ 2’ లాంటి హై క్వాలిటీ చిత్రానికి టికెట్ రేట్స్ కేవలం 12 డాలర్లు మాత్రమే పెట్టారు , పైగా అందుకు ఫ్రీ పాసులు కూడా ఉన్నాయి , ఆ పాసులు ఉపయోగిస్తే కేవలం 5 డాలర్స్ కి ‘ధురంధర్ 2’ టికెట్ వచ్చేసింది. ఈ ప్రభావం , ఈ చిత్రానికి పోటీగా వచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై చాలా బలంగా పడింది. ఒకపక్క ‘ధురంధర్ 2’ లాంటి క్రేజీ పాన్ ఇండియన్ సీక్వెల్ కి సంబంధించిన టికెట్స్ ని అంత తక్కువ రేట్ కి ఇస్తుంటే, ఒక మామూలు కమర్షియల్ సినిమా, పైగా రీమేక్ , అలాంటి చిత్రానికి 25 డాలర్లు పెట్టి ఎందుకు వెళ్ళాలి అనే భావన ఓవర్సీస్ ఆడియన్స్ లో కలిగింది.

అందుకే ఆ చిత్రానికి ఓవర్సీస్ నుండి కనీసం 5 లక్షల డాలర్ల ప్రీమియర్స్ గ్రాస్ కూడా రాలేదు . ఇది పవన్ కళ్యాణ్ కి చాలా అవమానకరంగా మారిన అంశం. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అంటే రీమేక్ చిత్రం, రొటీన్ కమర్షియల్ , హైప్ కూడా లేదు కాబట్టి , నార్త్ అమెరికా మరియు ఓవర్సీస్ ఆడియన్స్ పట్టించుకోలేదు అనుకుందాం, కానీ ‘పెద్ది’ ఏమి పాపం చేసిందని నార్త్ అమెరికా లో అంతటి తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి అనేది విశ్లేషకుల నుండి ఎదురు అవుతున్న ప్రశ్న. సినిమా విడుదలకు సరిగ్గా 8 రోజుల సమయం ఉంది , ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం 4 లక్షల 60 వేల డాలర్లు మాత్రమే వచ్చింది.

ఈ చిత్రానికి ఆడియన్స్ లో మంచి హైప్ ఉంది , విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కూడా బాంబు లాగా పేలింది. ఇలాంటి కంటెంట్ ఉన్నప్పుడు స్టార్ హీరో సినిమాకు కనీసం 2 మిలియన్ డాలర్ల ప్రీమియర్స్ రావాలి, కానీ ‘పెద్ది’ చిత్రానికి ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూస్తే కనీసం 1.5 మిలియన్ డాలర్ల గ్రాస్ కూడా వచ్చేలా లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అందుకు కారణం ‘ధురంధర్ 2’ అని , ఆ చిత్రానికి పెట్టినట్టుగానే , ఈ సినిమాకు కూడా టికెట్ రేట్స్ తక్కువ పెట్టాలని , అప్పుడు ఎవ్వరూ ఊహించనంత గ్రాస్ వస్తుందని అంటున్నారు. ‘ధురంధర్ 2’ చిత్రం ఓవర్సీస్ ఆడియన్స్ మైండ్ సెట్ ని మార్చేసిందని , మన టాలీవుడ్ బయ్యర్స్ కూడా రాబోయే రోజుల్లో సినిమాలకు టికెట్ రేట్స్ బాగా తగ్గిస్తారని అంటున్నారు.

ఎండలోనూ ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే ఇలా చేయండి..

Phone overheating
Phone overheating

How to prevent Phone overheating: స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో కీలక భాగంగా మారిపోయింది. అయితే వేసవికాలంలో లేదా ఎక్కువసేపు ఎండలో ఫోన్ ఉపయోగించినప్పుడు ఫోన్ వేడెక్కడం పెద్ద సమస్యగా మారుతోంది. చాలా మంది దీనిని చిన్న విషయంగా తీసుకుంటారు. కానీ ఫోన్ ఎక్కువగా వేడెక్కడం వల్ల బ్యాటరీ పనితీరు తగ్గడం నుంచి డివైస్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే వరకు అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాలి.

ఎండలో ఫోన్ వేడెక్కడానికి ప్రధాన కారణాల్లో సూర్యరశ్మి నేరుగా పడటం, ఎక్కువసేపు వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, మొబైల్ డేటా లేదా GPS నిరంతరం ఆన్‌లో ఉంచడం ముఖ్యమైనవి. ముఖ్యంగా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత ఉన్న సమయంలో ఫోన్‌ను బయట ఉపయోగిస్తే అంతర్గత ప్రాసెసర్‌పై ఒత్తిడి పెరిగి వేడి మరింత అధికమవుతుంది.

ఫోన్ వేడెక్కడం వల్ల మొదట ప్రభావం పడేది బ్యాటరీపైనే. అధిక ఉష్ణోగ్రత కారణంగా బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాటరీ ఉబ్బిపోవడం లేదా దీర్ఘకాలంలో బ్యాటరీ లైఫ్ పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. దీంతో ఫోన్‌ను తరచూ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఫోన్ ఓవర్‌హీట్ అయితే పనితీరు కూడా తగ్గిపోతుంది. యాప్స్ నెమ్మదిగా ఓపెన్ అవడం, ఫోన్ హ్యాంగ్ అవడం, స్క్రీన్ స్పందించకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఎందుకంటే వేడి పెరిగినప్పుడు ప్రాసెసర్ ఆటోమేటిక్‌గా తన స్పీడ్ తగ్గించుకుంటుంది. దీనిని ‘థర్మల్ థ్రోట్లింగ్’ అంటారు. కొన్ని సందర్భాల్లో ఫోన్ కెమెరా కూడా సరిగా పనిచేయదు. ఎక్కువ వేడి కారణంగా కెమెరా యాప్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవ్వడం లేదా వీడియో రికార్డింగ్ ఆగిపోవడం జరుగుతుంది. అలాగే ఫోన్‌లోని సెన్సార్లు, డిస్‌ప్లే భాగాలు కూడా దీర్ఘకాలంలో దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముందుగా ఎండలో ఫోన్‌ను నేరుగా ఉంచకూడదు. ముఖ్యంగా బైక్ డాష్‌బోర్డ్‌పై లేదా కారులో సూర్యరశ్మి పడే చోట పెట్టడం ప్రమాదకరం. సాధ్యమైనంత వరకు ఫోన్‌ను చల్లని ప్రదేశంలో ఉంచడం మంచిది.ఫోన్ వేడిగా ఉన్నప్పుడు వెంటనే ఛార్జింగ్ పెట్టకూడదు. కొద్దిసేపు ఫోన్ చల్లబడే వరకు ఆపి, తర్వాత మాత్రమే ఛార్జ్ చేయాలి. అలాగే చౌక నాణ్యతలేని ఛార్జర్లు వాడితే కూడా వేడి ఎక్కువ అవుతుంది. అందుకే ఒరిజినల్ ఛార్జర్ ఉపయోగించడం సురక్షితం.

అవసరం లేని యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటే ఫోన్ వేడి పెరుగుతుంది. అందువల్ల ఉపయోగించని యాప్స్‌ను క్లోజ్ చేయడం, బ్లూటూత్, GPS, హాట్‌స్పాట్ వంటి ఫీచర్లను అవసరం లేకపోతే ఆఫ్ చేయడం మంచిది. స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను కూడా తక్కువగా ఉంచితే వేడి తగ్గుతుంది. వేసవిలో గేమింగ్ లేదా హెవీ వీడియో ఎడిటింగ్ వంటి పనులను ఎక్కువసేపు చేయకుండా మధ్యలో విరామం ఇవ్వడం మంచిది. ఫోన్‌కు మందమైన కవర్లు ఉపయోగిస్తే వేడి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటాయి. కాబట్టి అధిక వేడి సమయంలో కవర్ తొలగించడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

ఫోన్ వేడెక్కడం సాధారణ విషయం అనిపించినా దీన్ని నిర్లక్ష్యం చేస్తే డివైస్ పనితీరు, బ్యాటరీ లైఫ్, భద్రతపై ప్రభావం పడుతుంది. చిన్నచిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఫోన్‌ను సురక్షితంగా, ఎక్కువకాలం ఉపయోగించుకోవచ్చు.

క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందా.. టెన్షన్ పడకుండా ఇలా చేస్తే సేఫ్..

What to do if credit card is blocked
What to do if credit card is blocked

What to do if credit card is blocked: ఈ రోజుల్లో చాలా మంది నగదు కంటే క్రెడిట్ కార్డులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. షాపింగ్ నుంచి ఆన్‌లైన్ చెల్లింపుల వరకు ప్రతిదీ కార్డ్ ద్వారానే చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే క్రెడిట్ కార్డ్ అకస్మాత్తుగా పనిచేయకుండా బ్లాక్ అవుతుంది. అలాంటి సమయంలో చాలామంది గందరగోళానికి గురవుతారు. తమ ఖాతాలోని డబ్బు సురక్షితంగానే ఉందా? కార్డ్ హ్యాక్ అయ్యిందా? అనే భయాలు మొదలవుతాయి. ఇలాంటి సమయంలో టెన్షన్ పడకుండా ఇలా చేస్తే చాలు..

అయితే ప్రతి సందర్భంలోనూ కార్డు బ్లాక్ కావడం అనేది ప్రమాద సూచిక కాదు. చాలా సందర్భాల్లో బ్యాంకులు వినియోగదారుల భద్రత కోసమే ఈ చర్య తీసుకుంటాయి. ముఖ్యంగా అనుమానాస్పద లావాదేవీలు కనిపించినప్పుడు లేదా కార్డు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నప్పుడు బ్యాంకులు ముందస్తు జాగ్రత్తగా కార్డును తాత్కాలికంగా నిలిపివేస్తాయి. ఒకవేళ మీరు మీ కార్డు పోగొట్టుకున్నట్లు లేదా ఎక్కడో మర్చిపోయినట్లు బ్యాంకుకు సమాచారం ఇస్తే, వెంటనే దానిని బ్లాక్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇతరులు మీ కార్డును ఉపయోగించి డబ్బు ఖర్చు చేయకుండా అడ్డుకోవచ్చు. కొన్నిసార్లు వరుసగా తప్పు PIN నమోదు చేసినా లేదా అసాధారణ ప్రాంతాల్లో ట్రాన్సాక్షన్లు జరిగినా కూడా కార్డు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా బ్యాంకు నుంచి వచ్చిన SMSలు, ఇమెయిల్స్‌ను పూర్తిగా పరిశీలించడం చాలా ముఖ్యం. ఎందుకంటే కార్డు ఎందుకు బ్లాక్ అయ్యిందో బ్యాంకులు సాధారణంగా సందేశాల రూపంలో సమాచారం పంపిస్తాయి. సమస్య అసలు ఏంటో అర్థం చేసుకుంటే తదుపరి చర్యలు తీసుకోవడం సులభమవుతుంది.అలాగే మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయి కార్డు స్టేటస్‌ను చెక్ చేయాలి. కొన్ని సందర్భాల్లో భద్రతా కారణాలతో తాత్కాలికంగా నిలిపిన కార్డులను యాప్ ద్వారానే మళ్లీ యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీని కూడా పరిశీలించడం మంచిది.

క్రెడిట్ కార్డు బిల్లు బకాయి ఎక్కువ రోజులు చెల్లించకపోయినా బ్యాంకులు కార్డును నిలిపివేయొచ్చు. అందుకే పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని వెంటనే క్లియర్ చేయడం అవసరం. చెల్లింపులు పూర్తయిన తర్వాత కొంతసేపటికి కార్డు మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశముంది.సమస్య కొనసాగితే వెంటనే కస్టమర్ కేర్‌ను సంప్రదించడం ఉత్తమ మార్గం. బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడి అసలు కారణం తెలుసుకోవచ్చు. అవసరమైతే KYC వివరాలు ధృవీకరించి కార్డును తిరిగి ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది.ఒకవేళ కార్డు పూర్తిగా దెబ్బతిన్నా, పోయినా లేదా భద్రతా సమస్యలు ఎక్కువగా ఉన్నా బ్యాంకు కొత్త కార్డును జారీ చేస్తుంది. కొత్త కార్డు వచ్చేవరకు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

క్రెడిట్ కార్డు బ్లాక్ అవ్వడం అనేది భయపడాల్సిన విషయం కాదు. చాలా సందర్భాల్లో అది వినియోగదారుల డబ్బును రక్షించేందుకు బ్యాంకులు తీసుకునే భద్రతా చర్య మాత్రమే. సరైన సమయంలో స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటే సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.

కొత్త ఫీచర్లతో వస్తున్న టియాగో.. ధర ఎంతో తెలుసా..

Tata Tiago new features and price
Tata Tiago new features and price

Tata Tiago new features and price: భారతీయ ఆటోమోబైల్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Tata Tiago.. ఇప్పుడు మరింత ఆధునిక రూపంలో మార్కెట్లోకి రావడానికి సిద్ధమైంది. 28 మే 2026న ఈ కారు అధికారికంగా మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు ఈ కారుపై అంచనాలను భారీగా పెంచాయి. గతంతో పోలిస్తే … ఈసారి టియాగోలో అత్యంత అధునాతనమైన , ప్రీమియం ఫీచర్లను జోడించినట్లు స్పష్టమవుతోంది. ఇది ఎంట్రీ లెవల్ కార్ల విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పే అవకాశం ఉంది. మరి ఈ కొత్త కారులో ఏమేం ఉన్నాయంటే?

ఈసారి టాటా కంపెనీ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పెట్రోల్, సీఎన్‌జీ (CNG), ఎలక్ట్రిక్ (EV) వేరియంట్లను ఒకేసారి లాంచ్ చేస్తోంది. డిజైన్ పరంగా చూస్తే.. బాహ్య రూపంలో చిన్న చిన్న మార్పులు చేసి కారుకు ఒక ప్రీమియం లుక్ ను ఇచ్చారు. కొత్తగా రూపొందించిన గ్రిల్, ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్ తో కారు మొత్తం ఫినిషింగ్ చూస్తుంటే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ కారు మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, రెనాల్ట్ క్విడ్ వంటి కార్లకు గట్టి పోటీనివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

కొత్త టియాగో కారులో Interior పరంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. నాణ్యమైన మెటీరియల్, సౌకర్యవంతమైన సీట్లు, ఆధునిక డ్యాష్‌బోర్డ్‌తో ఆకట్టుకుంటుంది. ఈ కారులో అందరినీ ఆశ్చర్యపరిచే అతిపెద్ద ఫీచర్ ‘360-డిగ్రీ వ్యూ కెమెరా’. సాధారణంగా లగ్జరీ SUVలకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్‌ను, ఒక ఎంట్రీ లెవల్ కారులో టాటా అందించడం గొప్ప విషయం. దీనివల్ల ఇరుకైన సందుల్లో పార్కింగ్ చేయడం, ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేయడం డ్రైవర్లకు చాలా సులభతరం కానుంది.

టాటా అంటేనే భద్రతకు మారుపేరు. టియాగో ఇప్పటికే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో మార్కెట్లో తన పట్టు నిలుపుకుంది. ఈ కొత్త మోడల్‌లో కూడా సేఫ్టీ ఫీచర్లను మరింత బలోపేతం చేసినట్లు తెలుస్తోంది. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్ట్రక్చరల్ స్టెబిలిటీ వంటివి దీనికి అదనపు బలం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ, సామాన్యులకు అందుబాటులో ఉండేలా, ఈ కారు ధర సుమారు రూ. 5.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కావచ్చని మార్కెట్ వర్గాల అంచనా.