Viral food safety video: ఆ మధ్య ముంబైలో పుచ్చకాయ తిని ఓ కుటుంబంలో నలుగురు చనిపోయారు. బిర్యానీ తిన్న తర్వాత వారు పుచ్చకాయ తినేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పుచ్చకాయ తిన్న తర్వాత బిర్యాని తింటే ప్రమాదకరమని చాలా మంది వైద్యులు చెప్పేశారు. దీంతో దేశవ్యాప్తంగా పుచ్చకాయల అమ్మకాలు పడిపోయాయి. ఈ దశలో చనిపోయిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. వారు తిన్న పుచ్చకాయలు ప్రమాదకరమైన జింక్ సల్ఫేట్ ఉందని గుర్తించారు. కొంతమంది కావాలని ఆ పుచ్చకాయలో జింక్ సల్ఫేట్ ఎక్కించారని.. అందువల్లే చనిపోయారని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసు పై విచారణ కొనసాగుతోంది.
ఆ కుటుంబం పుచ్చకాయ తిన్న తర్వాత.. ఎందుకు చనిపోయింది అనే విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాత చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు మనదేశంలో మరో ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పుచ్చకాయ తిన్న తర్వాత ఒక వ్యక్తి చనిపోయాడు. షియోపూర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఇంద్ర కుమార్, ఆయన కుమారుడు వినోద్ గురువారం రాత్రి అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం వారు ఉదయం పుచ్చకాయ తిన్నారు. అది తిన్న తర్వాత వారి ఆరోగ్యం దారుణంగా మారిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఇంద్ర కుమార్ చనిపోయాడు. వినోద్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇంద్ర కుమార్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు
మధ్యప్రదేశ్లో చోటు చేసుకున్న ఘటన తర్వాత మరోసారి పుచ్చకాయ మీద దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కొంతమంది పుచ్చకాయలో ప్రమాదకరమైన అవశేషాలు ఉన్నాయని చెబుతుంటే.. మరి కొందరేమో పుచ్చకాయ త్వరగా పెరగడానికి.. రంగు రావడానికి ప్రమాదకరమైన పదార్థాలను వాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇవి ఇలా సాగుతుండగానే సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ సంచలనం సృష్టిస్తుంది. ఆ వీడియో కాస్త చాలామందిలో ఆందోళన రేకెత్తిస్తోంది.
ఆహార పదార్థాలను కవర్ చేయకుండా.. బహిరంగంగా అలానే ఉంచితే ఎంత ప్రమాదమో ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ఆ వీడియోలో కోసి ఉన్న ఒక పుచ్చకాయ ముక్క ఉంది. పుచ్చకాయ ముక్కలు బల్లి వచ్చి తినడం మొదలు పెట్టింది. ఇలాంటి ఆహారాన్ని గమనించకుండా గనుక తింటే ఫుడ్ పాయిజన్ అవుతుందని.. ఆ తర్వాత ప్రాణాలు పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎటువంటి ఆహార పదార్థమైనా సరే మూత పెట్టి ఉంచాలని.. తెరిచి ఉంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
