ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిద్ కేసులు పెరిగిన నేపథ్యంలో చర్యలు ప్రారంభించింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు పాఠశాలలకు ఏపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
1-9వ తరగతులకు వరకు ఎలాంటి పరీక్షలు ఉండవని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అలాగే ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు యధాతథంగా నడుస్తాయని పేర్కొంది.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటిలో వైద్యఆరోగ్య, హోంశాఖ, విద్యాశాఖ మంత్రులతో పాటు ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. పది, ఇంటర్ పరీక్షలు కూడా రద్దు చేశారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఏపీలోనూ స్కూళ్ల వేత, టెన్త్, ఇంటర్ పరీక్షలపైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సమీక్షలో పాఠశాలల్లో కరోనా విస్తరించిన నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు సెలవులు ప్రకటిస్తున్నామని.. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు యధాతథంగా నడుస్తాయని మంత్రి సురేష్ తెలిపారు. దీంతో పది, ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కరోనా వేళ పరీక్షలు వద్దని.. తెలంగాణలో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.