YCP Leader: ఆ వైసీపీ నేత 100 కోట్ల లాస్ కథ?

కృష్ణా జిల్లాలో అధిక వడ్డీలు, వ్యాపారంలో లాభాల వాటా చూపించి ఇద్దరు వ్యక్తులు రెండు వేల కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. అయితే వారు ఎక్కువగా వైసీపీ నేతల నుంచే వసూలు చేయడం విశేషం.

Written By: Dharma, Updated On : August 26, 2023 10:28 am

YCP

Follow us on

YCP Leader: అధిక వడ్డీ ఆశ చూపి అధికార వైసీపీ ఎమ్మెల్యేని బురిడీ కొట్టించారు ఇద్దరు వ్యక్తులు. ఇప్పుడు సదరు వ్యక్తులు చేతులెత్తేయడంతో బాధిత ఎమ్మెల్యే లబోదిబోమంటున్నాడు. సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా సదరు వ్యక్తుల ఇంటి నుంచి బంగారం, ఇతరత్రా వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ ఎమ్మెల్యే అనుచరులపై కేసులు నమోదు కావడం సంచలనం సృష్టిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

కృష్ణా జిల్లాలో అధిక వడ్డీలు, వ్యాపారంలో లాభాల వాటా చూపించి ఇద్దరు వ్యక్తులు రెండు వేల కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. అయితే వారు ఎక్కువగా వైసీపీ నేతల నుంచే వసూలు చేయడం విశేషం. ఓ వైసిపి ఎమ్మెల్యే అయితే 100 కోట్లు వరకు వారికి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అదంతా బ్లాక్ మనీ కావడంతో ఎలా వసూలు చేసుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్నికల సమీపిస్తుండడంతో కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు.

ఆ ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం హైదరాబాదులో మకాం పెట్టారు. అక్కడినుంచి తమ వ్యాపార లావాదేవీలను కొనసాగిస్తూ వచ్చారు. నూటికి ఐదు రూపాయలకు పైగా వడ్డీ ఇస్తామని నమ్మించారు. దీంతో కృష్ణా జిల్లాలోనే వేలకోట్ల రూపాయలు అప్పులు పుట్టాయి. ఈ క్రమంలోనే సదరు వైసీపీ ఎమ్మెల్యే ఒకరు 100 కోట్ల రూపాయలకు పైగా నగదు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో ఠంచనుగా వడ్డీ చెల్లించారు. అయితే ఇటీవల హఠాత్తుగా ఇద్దరు వ్యాపారులు చెల్లింపులు నిలిపివేశారు. వారికి అప్పుగా ఇచ్చిన మొత్తాల్లో అత్యధికం బ్లాక్ మనీనే కావడంతో పోలీసుల వరకు కేసు వెళ్లడం లేదు.

ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. మంది మార్బలం తో హైదరాబాద్ వెళ్లి సదరు వ్యక్తుల ఇళ్లపై దాడి చేశారు. అదే సమయంలో వాహనానికి ప్రమాదం కూడా జరిగింది. అటు బాధితులు ఇద్దరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం బయటపడింది. ఇది కృష్ణా జిల్లా వైసీపీ నేతల్లో కలవరం రేపుతోంది. వైసిపి నేతలు వందలాది కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించి వ్యాపారాలు చేసుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఇదే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇబ్బందులు తప్పవని వైసిపి నేతలు భావిస్తున్నారు.