Varma targets: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కొన్ని ఏళ్లుగా జగన్ కు బలమైన మద్దతుదారుగా ఉన్నారు. జగన్ కు అనుకూలంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏకంగా సినిమాలు తీశాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, కడప రెడ్లు లాంటి ఎన్నో సినిమాల్లో చంద్రబాబును విలన్ గా చూపించారు. జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా వర్మ వెళ్లి సన్మానించారు. అంతటి జిగ్రీ దోస్త్ జగన్ పై తాజాగా రాంగోపాల్ వర్మ తీవ్ర విమర్శలతో హీటెక్కిస్తున్నాడు. అసలు జగన్ కు వర్మ విలన్ గా ఎలా మారాడాన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలుస్తోంది.
సినిమా టికెట్ల తగ్గింపు వివాదం ఏపీ సర్కారును చుట్టుముడుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సినిమా పరిశ్రమను దెబ్బతీసేలా పలు నిర్ణయాలు తీసుకుంటుండంపై సినీ పెద్దలు మండిపడుతున్నారు. ముఖ్యంగా సినిమా టికెట్ ధరలు రూ.5, రూ.10. రూ.20లకే ఫిక్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజులుగా సైలంట్ గా ఉన్న ఇండస్ట్రీకి చెందిన నటీనటులు తమ గొంతును గట్టిగా విన్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈక్రమంలోనే వైసీపీ సర్కారును కొందరు హీరోలు, డైరెక్టర్లు టార్గెట్ చేస్తున్నారు. హీరో నాని ఇటీవల తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ కిరాణ కొట్టు కలెక్షన్ల కన్నా సినిమా కలెక్షన్లు తక్కువ వచ్చేలా టికెట్లు రేట్లు ఉన్నాయని చెప్పడం సంచలనంగా మారింది. ఈక్రమంలోనే నానిని వైసీపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వివాదానికి దారితీసింది.
ఈ నేపథ్యంలో టికెట్ల రేట్లు తగ్గింపుపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రంగంలోకి దిగారు. తనదైన శైలిలో ఏపీ మంత్రులకు కౌంటర్లు ఇస్తున్నారు. టికెట్ల రేట్లు ఫిక్స్ చేయడానికి అసలు ప్రభుత్వానికి ఏ హక్కు ఉందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పలు ఉదాహరణలను సైతం ఆయన ఇస్తున్నారు. ఇటీవల మంత్రి పేర్ని నానికి ట్వీటర్లో వర్మ పలు ప్రశ్నలను సంధించాడు.
దీనిపై పేర్ని నానిగానీ, వైసీపీ మంత్రులుగానీ ఎవరూ స్పందించలేదు. ఈక్రమంలోనే మరోసారి వర్మ వొడ్కా తాగుతూ రాత్రి యూట్లూబ్లో ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఈసారి నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం ఆసక్తిని రేపుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు కాకపోతే జగన్ కు ఇన్ని ఓట్లు వచ్చేవా? జగన్ సైతం చాలాసార్లు వైఎస్ ను చూసి ఓటు వేశారని చెప్పారని ఆయన గుర్తు చేశారు.
రాజశేఖర్ రెడ్డి కొడుకు కాకుంటే జగన్ కు ఇంత ఇమేజ్, ఫాలోయింగ్ వచ్చేదో లేదో తనకు తెలియదని వర్మ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. ‘అలాగే పుచ్చిపోయిన టమాటాలు వెనక్కివ్వడానికి.. టమాటాలు కొని రుచి చూసిన తర్వాత టేస్ట్ బాగోలేదని వెనక్కు ఇవ్వడానికి చాలా తేడా ఉందని’ వర్మ తనకు కౌంటర్ ఇచ్చిన పేర్ని నానికి గట్టి సమాధానమిచ్చారు.
ఓట్లేసిన ప్రజలు వైసీపీ పాలన బాగోలేదంటే ఆపార్టీ అధికారంలో నుంచి దిగిపోతుందా? అంటూ ప్రశ్నించారు. ఏ వస్తువుకైనా ధర నిర్ణయించే హక్కు తయారీదారుడిదేనంటూ మరోసారి స్పష్టం చేశారు. జగన్, పేర్నినాని, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని కలిసి రాజమౌళి కంటే గొప్ప సినిమా తీసి పేదప్రజలకు ఫ్రీగా చూపించాలని వర్మ సెటైర్ వేశారు.
అలా చేయలేని వాళ్లు తమ అధికారంతో ప్రతిభ ఉన్నవాళ్ల ప్రొడక్ట్ ధరను తగ్గించడం సరికాదని హితవు పలికారు. అయితే సినిమా టికెట్ల ధరల విషయంలో హేతుబద్దత లేకుండా అసలు పరిజ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వం సగటు సినిమా నిర్మాణదారుగా అన్ని కష్టాలు తెలిసిన వర్మ కరెక్ట్ గా మాట్లాడారని ప్రశంసలు కురుస్తున్నాయి. వర్మ కూడా ఓ బాధితుడు కావడంతో జగన్ తనకు ఎంత మిత్రుడైనా ఎదురించాడని అర్థమవుతోంది. నష్టం జరుగుతుంది కాబట్టే వర్మ నిజాలు మాట్లాడాడని తెలుస్తోంది. రాత్రి పూట వోడ్కా తాగుతూ వర్మ పోస్ట్ చేసిన ఏపీలో దుమారం రేపుతోంది. ఇక చివర్లో వర్మ తాను వోడ్కా తాగి మత్తులో మాట్లాడుతున్నానని అనుకున్నా తనకు ఏం పర్లేదని చెప్పడం హైలెట్ గా నిలిచింది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More