TDP – Jana Sena : ఉత్తరాంధ్ర పై అన్ని పార్టీలు ఫోకస్ పెంచాయి. రాజకీయ కార్యకలాపాలకు ఉత్తరాంధ్రను వేదిక చేసుకుంటున్నాయి. పీసీసీ పగ్గాలు అందుకున్న షర్మిల ఇచ్చాపురం నుంచే పర్యటనలను ప్రారంభించారు. తాజాగా లోకేష్ సైతం ఇచ్చాపురం నుంచి శంఖారావసభలు మొదలుపెట్టారు. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు ఉత్తరాంధ్రలో పార్టీ స్థితిగతులపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన విశాఖ టూర్ లో ఉన్నారు. యువ గళం విజయోత్సవ సభను విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో పాటు పవన్, లోకేష్ ఈ సభకు హాజరయ్యారు. దీనికి పోటీగా ఏపీ సీఎం జగన్ భీమిలి నియోజకవర్గం నుంచి సిద్ధం పేరిట ఎన్నికల ప్రచార సభను ప్రారంభించారు. ఉత్తరాంధ్ర పై పట్టుకోసమే రాజకీయ పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తుండడం విశేషం.
ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉండగా.. ఉత్తరాంధ్ర స్థానాలు ఐదో వంతు అన్నమాట. 20 శాతం సీట్లు ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో ఉన్నాయి. అందుకే ఇక్కడ ఎలాగైనా పట్టు సాధించాలని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. టిడిపి ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర ప్రజలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. కానీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బతింది. 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆరు స్థానాలకి పరిమితమైంది. అవి కూడా విశాఖ నగరంలో నాలుగు స్థానాలు, శ్రీకాకుళంలో రెండు స్థానాలను మాత్రమే టిడిపి కైవసం చేసుకుంది. 28 స్థానాలతో దాదాపు స్వీప్ చేసినంత పని వైసిపి చేసింది.
అందుకే టిడిపి, జనసేన ఇక్కడ ఫోకస్ పెట్టాయి. తన పాదయాత్ర విశాఖ తో ముగియడంతో లోకేష్ శ్రీకాకుళం జిల్లా నుంచి శంఖారావ సభలను ప్రారంభించారు. దాదాపు ఈ 34 నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు. అటు మెగా బ్రదర్ నాగబాబు సైతం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. టిడిపి నేతలతో సమన్వయంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇవన్నీ ఉత్తరాంధ్ర పై పట్టు కోసం చేసిన ప్రయత్నాలేనని తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో 25 స్థానాలను కైవసం చేసుకుంది. వైసిపి 9 స్థానాలకు పరిమితమైంది. అందుకే ఈసారి ఉత్తరాంధ్రలో 30 పైగా స్థానాలను గెలుచుకోవాలని టిడిపి, జనసేన భావిస్తోంది. అయితే అరకు పార్లమెంట్ స్థానం పరిధిలోని ఎస్టీ నియోజకవర్గాల్లో వైసిపి బలంగా ఉంది. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు ఉన్నారు. దీంతో వారందరినీ కట్టడి చేసి టిడిపి, జనసేన కూటమి ఆధిపత్యం సాధించేలా రెండు పార్టీలు వ్యూహాలు పన్నాయి. అందుకే లోకేష్ దాదాపు ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో తన శంఖారావ సభలు నిర్వహించడానికి డిసైడ్ అయ్యారు. మరోవైపు విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జనసేన బలోపేతంపై నాగబాబు దృష్టి పెట్టారు. టిడిపి శ్రేణులతో కలిసి పనిచేయాలని జనసేన పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉండడంతో వాటిని పరిష్కరిస్తున్నారు. మొత్తానికైతే ఉత్తరాంధ్ర విషయంలో ఆ రెండు పార్టీలు గట్టి వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.