Vinayak Raut : ఆమె ఓ మాజీ ఎంపీ కోడలు.. ఆమెకు వివాహం జరిగి చాలా రోజులైంది. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఆమె పెద్దగా బయటకు కూడా రారు.కానీ,ఇప్పుడు ఆమె గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. జాతీయ మీడియా మొత్తం ఆమె మీదనే ఫోకస్ పెట్టింది. పుంఖానుపుంఖాలుగా కథనాలను ప్రసారం చేస్తోంది. ఇంతకీ ఏం జరిగింది..
రకరకాల నిబంధనల వల్ల ఆమె పేరు ఇక్కడ ప్రస్తావించడం లేదు. ఉద్దవ్ ఠాక్రే పార్టీ శివసేన కు చెందిన మాజీ ఎంపీ వినాయక్ రౌత్ కోడలు తను. చాలా సంవత్సరాల క్రితమే ఆమెకు వివాహం జరిగింది. అయితే ఇటీవల ఆమె మీద క్షుద్రపూజలు జరిగాయి. ఆమె జుట్టును మామ వినాయక్ రౌత్, భర్త జితేశ్ రౌత్ తీసుకున్నారు. క్షుద్ర పూజలను ఫిరోజ్ బాబా, కాజీబాబా నిర్వహించారు.
తనపై క్షుద్రపూజలు నిర్వహించిన నేపథ్యంలో ఆమె తెరపైకి వచ్చారు. జరిగిన దారుణాలను పూస గుచ్చినట్టు వివరించారు. తనను అత్తింటివారు ఇబ్బందిపెట్టారని, శారీరకంగా హింసించారని ఆమె ఆరోపించారు. తను శిరోజాలు తీసుకుని క్షుద్రపూజలలో ఉపయోగించారని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో ప్రముఖంగా ప్రస్తావించారు. తనకు, తన భర్తకు వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని.. అతీంద్రియ శక్తుల వల్లే ఇదంతా జరుగుతోందని ఆమె అత్తామామలు భావించడం మొదలు పెట్టారు. అందువల్లే క్షుద్రపూజలు నిర్వహించారని ఆమె ఆరోపించారు.
తన కోడలు చేస్తున్న ఆరోపణలపై వినాయక్ రౌత్ నోరు విప్పారు. ఈ వ్యవహారంపై జాతీయ మీడియాలో వస్తున్నకథనాలపై క్లారిటీ ఇచ్చారు. తన కుమారుడు జితేశ్ కు, అతడి భార్యకు మధ్య భరణానికి సంబంధించిన కేసు విచారణ సాగుతోందని ఆయన వివరించారు. అందువల్లే ఇలాంటి నిరాధారణమైన ఆరోపణలు చేస్తోందని వినాయక్ వివరించారు. భరణం వివాదం సాగుతుండగానే తను పోలీసులను ఆశ్రయించినట్టు వినాయక్ వెల్లడించారు. గడిచిన మూడు సంవత్సరాలుగా తమ కుమారుడు, కోడలికి వివాదాలు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
మాజీ ఎంపీ కోడలి మీద క్షుద్ర పూజలు జరిగాయని వార్తలు రావడంతో నేషనల్ మీడియా మొత్తం వినాయక్ కుటుంబం మీద ఫోకస్ పెట్టింది. కానీ,వినాయక్ క్లారిటీ ఇవ్వడంతో ఈ వ్యవహారం మరో టర్న్ తీసుకుంది. దీంతో ఈ విషయంపై రకరకాల డిబేట్లు, చర్చలు జరుగుతున్నాయి. దీనిపై పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారు.. ఎవరిని దోషులుగా తేల్చుతారో చూడాల్సి ఉంది.
