ఏపీలో బీజేపీ, జనసేనల ఆది నుంచీ మిత్రపక్షంగానే నడుస్తున్నాయి. ఆ పొత్తు కేవలం ఏపీ వరకేననేది స్పష్టం. ఎందుకంటే తెలంగాణలో బీజేపీతో జనసేనకు చెడిందనే చెప్పాలి. ముఖ్యంగా మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ జనసేనాని పవన్ బీజేపీకి కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్కు మద్దతు తెలుపడం వివాదానికి దారితీసింది. కానీ.. ఏపీలో మాత్రం తాము ఇంకా కలిసే ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నాయి ఇరు పార్టీలు.
అయితే.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సందర్భంగా ఆ ఇరు పార్టీల్లోనూ విభేదాలు నడుస్తున్నాయి. ప్రధానంగా క్యాండిడేట్ విషయంలో తామంటే తాము పోటీ చేస్తామంటూ పోటాపోటీగా ప్రకటనలు చేసుకున్నారు. కానీ.. చివరికి జనసేన అధినేత పవన్ కల్యాణే తగ్గాల్సి వచ్చింది. చివరికి తిరుపతి సీటును సైతం వదులుకోవాల్సి వచ్చింది.
ఇదిలా ఉండగా.. ఒకవైపు తిరుపతి కేంద్రంగా ప్రత్యర్థి పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ.. బీజేపీ మాత్రం అభ్యర్థి ఎంపికతోనే ఇంతకాలం గడిపింది. మొత్తానికి తిరుపతి బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎస్ రత్నప్రభను ఎంపిక చేశారు. తన ఎంపికకు సహకరించిన జనసేనాని పవన్కల్యాణ్కు కృతజ్ఞతలు సైతం చెబుతూ రత్నప్రభ ట్వీట్ చేశారు. ఇందుకు పవన్ను కూడా ట్యాగ్ చేశారు. కానీ.. ఆయన మాత్రం స్పందించలేదు. దీంతో అసలు జనసేన వైఖరి ఏంటనే అనుమానాలు, ప్రశ్నలు పెద్ద ఎత్తున తెరపైకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జనసేన కార్యాలయంలో పవన్కల్యాణ్ను బీజేపీ అభ్యర్థి రత్నప్రభతోపాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ రాష్ట్ర వ్యవహారాల కో ఇన్చార్జ్ సునీల్ దేవధర్, బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మధుకర్ కలిశారు. ఈ భేటీలో పవన్తోపాటు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ప్రస్తుతానికి బీజేపీ–-జనసేన అగ్రనేతలు కలవడంతో విభేదాల ప్రచారానికి తెరపడినట్టైంది. అయితే.. ఈ ఇరు పార్టీల నేతలు కలిసినంత మాత్రాన, వారి మనసుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రధాన చర్చకు దారితీస్తోంది. మరోవైపు.. పెద్దలు కలిసినంత మాత్రాన క్యాడర్ ఒప్పుకొని సహకరిస్తుందా అనేది కూడా సందిగ్ధం నెలకొంది.