దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నప్పటికి కోవిద్ బారినుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న వారి కంటే కోలుకున్న రోగుల సంఖ్య పెరిగింది. కరోనా విలయతాండవంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వార్త కొంత ఉపశమనాన్నిస్తున్నది. బుధవారానికి మొత్తం పాజిటివ్ కేసులు 2.7 లక్షలు దాటగా, వారిలో 1,35,205 మంది రోగులు కోలుకున్నారు. 1,33,632 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ విధంగా చికిత్స తీసుకుంటున్న వారి కంటే కోలుకున్న వారి సంఖ్య పెరిగినట్లయింది. మొత్తం కరోనా కేసుల్లో కోలుకున్న రోగుల సంఖ్య 48.99 శాతంగా నిలిచింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 9,985 మందికి కరోనా సోకింది. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసులు మొత్తం 2,76,583కు చేరాయి. గత 24 గంటల్లో 279 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 7,745కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 3,289 మంది మృతి చెందారు. గుజరాత్లో 1313, ఢిల్లీలో 905 మరణాలు చోటు చేసుకున్నాయి.