Homeఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వ న్యాయవాదులపై వేటు..!

ప్రభుత్వ న్యాయవాదులపై వేటు..!


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో న్యాయస్థానాల్లో గట్టి ఎదురుదెబ్బలు అనేకం తగిలాయి. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టులో అనేక కేసులు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో 64 కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. దీంతో జగన్ ప్రభుత్వం అపఖ్యాతి పాలయ్యిందనే ప్రచారం జరుగుతోంది. న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన కేసుల్లో ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ తొలగింపు, పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు, ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం అమలు, రాజధాని తరలింపు, ఐఏఎస్ జాస్తి కిషోర్ సస్పెన్షన్, పోలవరం జాలవిద్యుత్ కేంద్రం టెండర్ల రద్దు, రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ అమలు, విద్యుత్ ఒప్పందాల రద్దు, విశాఖలో చంద్రబాబు పర్యటన అడ్డుకోవడం, బాబుకి భద్రత కుదింపు వంటి ఎన్నో కేసులు ఉన్నాయి.

న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. న్యాయస్థానాల్లో వాదనలు వినిపించే న్యాయవాదులను మార్చాలని ఇటీవల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం న్యాయవాదులుగా పనిచేస్తున్న గెడ్డం సతీష్ కుమార్, పెనుమాక వెంకటరావు, షేక్ హాబీబ్ లు తమ రాజీనామాలను అందజేశారు. ఇప్పటికే ముగ్గురు న్యాయవాదులు రాజీనామాలు సమర్పించగా న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి రాజీనామాలకు ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వం ఏడుగురు గవర్నమెంట్ ప్లీడర్స్ (జిపి)లు, మరో 14 మంది అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్స్ (ఏజిపి) లను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాజీనామాల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ప్రభుత్వ నిర్ణయాలలో ఉన్న లోపాన్ని న్యాయవాదులపై నెట్టి వారిని మార్చడం వల్ల ప్రయోజనం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version