Homeజాతీయ వార్తలుNarendra Modi retirement: మోడీని దిగిపోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ హింట్ ఇచ్చాడా? ప్రధానిని దించడం సాధ్యమేనా?!

Narendra Modi retirement: మోడీని దిగిపోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ హింట్ ఇచ్చాడా? ప్రధానిని దించడం సాధ్యమేనా?!

Narendra Modi retirement: 75 ఏళ్లు నిండిన వ్యక్తి రాజకీయాల నుంచి రిటైర్‌ కావాలనే బీజేపీ సిద్ధాంతం. ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా దీనికే కట్టుబడి ఉంది. సెప్టెంబర్‌తో ప్రధాని నరేంద్రమోదీకి 75 ఏళ్లు నిండుతాయి. దీంతో మోదీ రిటైర్‌ అవుతారన్న చర్చ జరుగుతోంది. మోదీ తర్వాత ఎవరు అన్న అంశంపైనా ఎరికి వారు లెక్కలు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌స్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చను రేకెత్తించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 సెప్టెంబర్‌లో 75 ఏళ్లు చేరుకోనున్న నేపథ్యంలో, రాజకీయంగా సున్నితమైన అంశంగా మారాయి. విపక్ష నాయకులు ఈ వ్యాఖ్యలను మోదీకి పరోక్ష సందేశంగా భావిస్తుండగా, బీజేపీ నాయకులు దీనిని సాధారణ వ్యాఖ్యగా తిరస్కరించారు.

భాగవత్‌ ఏమన్నారంటే..
ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త మోరోపంత్‌ పింగళే జీవితంపై రాసిన పుస్తకాన్ని నాగపూర్‌లో మోహన్‌ భగవత్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 75 ఏళ్ల వయసులో నాయకులు తమ బాధ్యతల నుంచి తప్పుకొని కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని సూచించారు. పింగళే ఒకసారి చెప్పినట్లు, ‘‘75వ ఏట శాలువా కప్పితే, అది వృద్ధాప్యం సూచనగా భావించి, ఇతరులకు మార్గం వదలాలి’’ అని భాగవత్‌ గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు, భాగవత్‌ స్వయంగా 2025 సెప్టెంబర్‌ 11న 75 ఏళ్లు చేరుకోనున్న నేపథ్యంలో, రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు దారితీశాయి.

Also Read: మోదీ భౌగోళిక రాజకీయ చాణక్యం.. పాకిస్తాన్, టర్కీ టార్గెట్‌

విపక్షాలకు ఆయుధం..
భాగవత్‌ వ్యాఖ్యలు ఇప్పుడు విపక్షాలకు ఆయుధంగా మారాయి. మోదీకి పరోక్ష సందేశంగా భావించాలని విమర్శిస్తున్నాయి. శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్‌ రౌత్, ‘‘మోదీ గతంలో అద్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, జశ్వంత్‌ సింగ్‌ వంటి నాయకులను 75 ఏళ్ల తర్వాత రాజకీయంగా పక్కకు నెట్టారు. ఇప్పుడు ఆయన కూడా అదే నిబంధనను పాటిస్తారా?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నాయకుడు జైరాం రమేష్‌ ఎద్దేవా చేస్తూ, ‘‘మోదీ 75 ఏళ్లకు రిటైర్‌ కావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ గుర్తు చేస్తున్నారు, కానీ భాగవత్‌ కూడా అదే వయసులో ఉన్నారు. ఒకే బాణంతో ఇద్దరూ లక్ష్యంగా ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నాయకుడు పవన్‌ ఖేరా కూడా, ‘‘ఇద్దరూ బ్యాగ్‌ తీసుకొని ఒకరినొకరు మార్గనిర్దేశం చేసుకోవచ్చు’’ అని విమర్శించారు.

స్పందించిన బీజేపీ..
బీజేపీ నాయకులు భాగవత్‌ వ్యాఖ్యలను సాధారణ సూచనగా తేలికగా తీసుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ‘‘మోదీ 2029 తర్వాత కూడా ప్రధానిగా కొనసాగుతారు. ఆయన వారసుడి కోసం ఇప్పుడే వెతకాల్సిన అవసరం లేదు’’ అని స్పష్టం చేశారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బావన్‌కులే, ‘‘బీజేపీలో 75 ఏళ్లకు రిటైర్మెంట్‌ నిబంధన లేదు. ఇది రాజ్యాంగంలో కూడా లేదు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, మొరార్జీ దేశాయ్, మన్మోహన్‌ సింగ్‌ వంటి నాయకులు 75 ఏళ్ల తర్వాత కూడా నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు’’ అని గుర్తు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా 2023లో ఈ విషయంపై స్పష్టత ఇస్తూ, మోదీ 75 ఏళ్లకు రిటైర్‌ కావడం లేదని, ఆయన నాయకత్వం 2029 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.

Also Read: చరిత్ర సృష్టించిన భారత్‌.. నాలుగో స్థానం మన సొంతం

అంతర్గత సమన్వయమా.. సంఘర్షణా..?
ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీకి భావజాల మూలంగా ఉన్నప్పటికీ, ఈ వ్యాఖ్యలు రెండు సంస్థల మధ్య అంతర్గత ఉద్రిక్తతలను సూచిస్తున్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ‘‘బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది, దీనిని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ గుర్తు చేస్తూ, ఆర్‌ఎస్‌ఎస్‌ –బీజేపీ సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తారు. భాగవత్‌ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్‌ లోపల, బీజేపీతో సంబంధిత నాయకత్వ భవిష్యత్‌ చర్చలను సూచిస్తాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి, ఎందుకంటే ఆర్‌ఎస్‌ఎస్‌ 2025లో తన శతాబ్ది ఉత్సవాలను జరుపుకోనుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular