MLC Kavita Layer : మద్యం కుంభకోణంలో అరెస్టై, విచారణ ఖైదీగా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కవిత.. బెయిల్ కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు సాగించారు. కింది కోర్టులు ఆమె బెయిల్ పిటిషన్లను రద్దు చేశాయి. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. చివరికి మంగళవారం ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 45 ని ఉటంకిస్తూ, సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో కవిత మంగళవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం ఆమె వెంట భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు వంటి వారు ఉన్నారు.. కవితకు బెయిల్ రావడంలో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తీవ్రమైన కృషి చేశారు.. ఆయన కృషివల్లే సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను కవితకు మంజూరు చేసింది.
ఇరుపక్షాల మధ్య గంటన్నరకు పైగా వాదనలు
కవిత బెయిల్ మంజూరు కు సంబంధించి మంగళవారం గంటన్నరకు పైగా ఇరుపక్షాల మధ్య వాదనలు జరిగాయి.. కేంద్ర దర్యాప్తు సంస్థల తరఫున లాయర్ ఎస్వీ రాజు, కవిత తరఫున ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు.. కవిత బెయిల్ పొందేందుకు అర్హురాలని ముకుల్ రోహత్గీ వాదించడంతో.. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయన వాదనలతో ఏకీభవించింది. చివరికి కవితకు బెయిల్ మంజూరు చేసింది.. ఈ ఏడాది మార్చి 15న లిక్కర్ కుంభకోణంలో కవితను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె అనేకసార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఈసారి మాత్రం కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించారు. ఢిల్లీలో మద్యం విధానంలో 100 కోట్లు చేతులు మారాయనేది కేవలం ఆరోపణ మాత్రమేనని, ఈ కేసులో 493 మందిని విచారించారని, కవిత ఇంతవరకు ఎవరినీ బెదిరించలేదని, ఆమె దేశం విడిచి వెళ్లిపోవడానికి ఆస్కారం లేదని, ఆమె బెయిల్ పొందేందుకు అన్ని విధాల అర్హురాలని ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టు ఎదుట వాదించారు.
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ
కవితకు బెయిల్ రావడంతో.. ఆమె తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది..ముకుల్ రోహత్గీ 1955 ఆగస్టు 17న ముంబైలో జన్మించారు. ఆయన గతంలో ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఆయన సీనియర్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు..ముకుల్ రోహత్గీ తండ్రి పేరు జస్టిస్ అవధ్ బిహారీ రోహత్గీ .. ఆయన కూడా న్యాయవాదే. ప్రస్తా మన దేశంలో పేరు పొందిన న్యాయవాదులలో ముకుల్ రోహత్గీ ఒకరు. ఆయన ముంబైలోని ప్రభుత్వ లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఢిల్లీలోని హైకోర్టులో యోగేష్ కుమార్ సబర్వాల్ వద్ద ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అలా అనేక విధాలుగా ఎదిగారు..ముకుల్ రోహత్గీ వసుధను పెళ్లి చేసుకున్నారు. ఆమె కూడా న్యాయవాది.. ఈ దంపతులకు నిఖిల్, సమీర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.. 1999 నవంబర్ నెలలో ముకుల్ రోహత్గీని అప్పటికేంద్ర ప్రభుత్వం అదనపు సొలిసిటర్ జనరల్ గా నియమించింది. 2014 నుంచి 2017 వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో ముకుల్ రోహత్గీ భారత అటార్నీ జనరల్ గా పనిచేశారు..ముకుల్ రోహత్గీ తన పదవీకాలంలో అనేక కేసులను వాదించారు. ప్రభుత్వం గెలిచేలా చేశారు. త్రిబుల్ తలాక్, మణిపూర్ నకిలీ ఎన్ కౌంటర్, జాతీయ న్యాయ నియామకాల కమిషన్, ఆధార్ వంటి కేసులలో ఆయన అద్భుతమైన వాదనలు వినిపించారు. వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముకుల్ రోహత్గీ ” లా ఆఫీసర్ ” గా పనిచేశారు.. గుజరాత్లో 2002 అల్లర్లు, బూటకపు ఎన్కౌంటర్ కేసులను వాదించారు.. హై ప్రొఫైల్ కేసులను ముకుల్ రోహత్గీ ఎక్కువగా వాదిస్తారు. సుదీర్ఘ అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయన గంటకు 10 నుంచి 15 లక్షల వరకు ఛార్జ్ చేస్తారు. ఇక ఆయన బృందం ఏదైనా కేసు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వచ్చి విచారిస్తే.. కచ్చితంగా ఫైవ్ స్టార్ హోటల్లో బస కల్పించాలి. వారికి రానుపోను విమాన చార్జీలను చెల్లించాలి. పైగా ఆ ప్రాంతానికి వస్తే ఎక్కువ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More