క్వారంటైన్ పై వైసీపీ ఎమ్మెల్యేతో మంత్రి మోపిదేవి వార్

గుంటూరులో కరోనా వైరస్ మొదట్లో కారకుడిగా స్థానిక వైసిపి ఎమ్యెల్యే ముస్తఫా బావమరిదిని భావిస్తారు. ఢిల్లీలోని తబ్లిగ్ సదస్సుకు వెళ్లి వచ్చి ఇక్కడకు వైరస్ ను తీసుకొచ్చాడు. అతని ప్రయాణ చరిత్రను కూపీ లాగడం ద్వారా వేలాదిమందితో ఢిల్లీలో ఈ సదస్సు జరిగిన్నటు గుంటూరు డిఐజి రామకృష్ణ ఢిల్లీలోని కేంద్ర నిఘా వర్గాలను అలెర్ట్ చేశారు. ఆ సందర్భంగా ముస్తఫా వ్యవహారం వివాదంగా మారగా, తాజాగా 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారందరిని ఇంటికి పంపించి […]

Written By: Neelambaram, Updated On : April 14, 2020 8:22 pm
Follow us on


గుంటూరులో కరోనా వైరస్ మొదట్లో కారకుడిగా స్థానిక వైసిపి ఎమ్యెల్యే ముస్తఫా బావమరిదిని భావిస్తారు. ఢిల్లీలోని తబ్లిగ్ సదస్సుకు వెళ్లి వచ్చి ఇక్కడకు వైరస్ ను తీసుకొచ్చాడు. అతని ప్రయాణ చరిత్రను కూపీ లాగడం ద్వారా వేలాదిమందితో ఢిల్లీలో ఈ సదస్సు జరిగిన్నటు గుంటూరు డిఐజి రామకృష్ణ ఢిల్లీలోని కేంద్ర నిఘా వర్గాలను అలెర్ట్ చేశారు.

ఆ సందర్భంగా ముస్తఫా వ్యవహారం వివాదంగా మారగా, తాజాగా 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారందరిని ఇంటికి పంపించి వేయాలని అంటూ వైద్య అధికారులతో వివాదానికి దిగడం ద్వారా మరో రచ్చకు దారితీశారు. ఈ వ్యవహారంపై స్వయంగా జిల్లా మంత్రి మోపిదేవి వెంకట రమణ జోక్యం చేసుకొని తమ పార్టీ ఎమ్యెల్యే వ్యవహారంపై ఆక్షేపణ వ్యక్తం చేశారు.

14 రోజులు క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారిని ఇంటికి పంపాలని ఎమ్మెల్యే ముస్తఫా చేసిన డిమాండ్ ను జీవో ప్రకారం కుదరదని అంటూ మంత్రి మోపిదేవి నిర్మోహాటంగా తోసిపుచ్చారు. 14 రోజుల తర్వాత కూడా చాలామందికి తిరిగి పాజిటివ్ వచ్చినదని అంటూ గుర్తు చేశారు. ఈ విషయంలో వైద్యుల నిర్ణయం పైననే ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పారు.

14 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకొని, ఇంటికి పంపమని వత్తిడి తెస్తున్న వారిలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కూడా ఉండటం గమనార్హం. తన కుటుంబ సభ్యులను ఇంటికి పంపించాలని అంటూ ఎమ్మెల్యే ముస్తఫా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.

పైగా, నిబంధనలకు విరుద్దంగా గుంటూరు లోని రెడ్ జోన్ ప్రాంతాలలో ఎమ్మెల్యే పర్యటించారు. ఇది సమంజసం కాదని అందరూ పరిస్దితిని అర్థం చేసుకోవాలని మంత్రి హితవు చెప్పారు. బాధ్యత కలిగిన వ్యక్తులు కూడా అర్దం లేకుండా మాట్లాడుతున్నారని అంటూ మంత్రి విరుచుకు పడ్డారు.

మొత్తం 28 రోజులకు క్వారంటైన్‌లో ఉండవలసిందే అని మంత్రి మోపిదేవి స్పష్టం చేయడంతో ఈ విషయమై ఇద్దరి మధ్య వాదోపవాదాలు తీవ్రమవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో 100కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన మొదటి జిల్లా గుంటూరు కావడం గమనార్హం.

గుంటూరు జిల్లాలో మొత్తం 109 కేసులు నమోదు కాగా, అందులో 85 కేసులు గుంటూరు అర్బన్ పరిధిలోనే ఉన్నాయి. ఇక గ్రామీణ జిల్లాలో 24 మాత్రమే ఉన్నాయి. జిల్లాలో ఐదుగురు మృతి చెందారు.