Lok Sabha Elections Results 2024: యావత్ భారతావనితోపాటు, ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రాబోయే ఐదేళ్లలో దేశ పాలనా పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారు.. ఆ బాధ్యతలను ఓటర్లు ఎవరి చేతికి అప్పగించారు అనేది కొన్ని గంటల్లో తేలబోతోంది. 18వ లోక్సభ ఏర్పాటు కోసం రెండు నెలలకుపైగా సుదీర్ఘంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం(జూన్4న) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందా.. లేక కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా.. ఇవేమీ కాకుండా కేంద్రంలో హంగ్ అన్న ఉత్కంఠ కొన్ని గంటల్లో వీడనుంది. దేశ ప్రజలతోపాటు ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఉత్కంఠగా భారత ప్లామెంటు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.
ఈవీఎంలలో జాతకం..
ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో 543 స్థానాలకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఇప్పటికే తీర్పు ఇచ్చారు. అభ్యర్థుల జాతకాలను ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకి అయినా.. కూటమికి అయినా 272 స్థానాలు కావాలి. ఈ మ్యాజిక్ ఫిగర్ను ఎవరు చేరతారు అనేది ఓట్ల లెక్కింపుతో తేలిపోతుంది.
542 స్థానాలకే పోలింగ్..
పార్లమెంటులో 543 లోక్సభ స్థానాలు ఉండగా, ప్రస్తుతం ఏడు విడతల్లో 542 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీటితోపాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకుఎన్నికలు జరిగాయి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ అధికారం నిలబెట్టుకోగా, సిక్కింలో ఎస్ఎన్ఎస్ పార్టీ అధికారం నిలబెట్టుకుంది.
కౌంటింగ్కు పటిష్ట భద్రత..
ఇదిలా ఉండగా కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇస్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చార్ సౌ పార్ నినాదంతో ఎన్నికల బరిలో దిగిన బీజేపీ ఆ మార్కు చేరుతుందా అన్న ఆసక్తి కూడా నెలకొంది. ఇక బీజేపీ అధికాంలోకి వస్తే.. మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ రికార్డును మోదీ సమం చేస్తారు. ఇక కాంగ్రెస్ మిత్ర పక్షాలు కూడా అధికారంపై ఆశతో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్కు భిన్నంగా ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలు వస్తాయని ధీమాగా ఉన్నాయి. ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఇక కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి సమస్యలు, ఘర్షలు తలెత్తకుండా ఈసీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఆ రాష్ట్రాలపై అందరి చూపు..
దేశంలో కీలక రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాలు గెలిచిన పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమబెంగాల్, బిహార్లో ఎక్కువ స్థానాలు ఎవరు గెలిస్తే వారికే అధికారం దక్కనుంది. ఈ నేపథ్యం ఆ రాష్ట్రాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో విపక్ష పార్టీలు చతికిలపడ్డాయి. దీంతో బీజేపీ సత్తా చాటుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
బరిలో 8,360 మంది..
ఇదిలా ఉండగా 18వ లోక్సభ ఎన్నికల బరిలో 8,360 మంది నిలిచారు. వీరిలో గెలిచేంది 542 మంది మాత్రమే. ఇక పార్టీల వారీగా చూస్తే బీఎస్సీ అత్యధికంగా 488 మందిని పోటీకి నిలిపింది. తర్వాత బీజేపీ 441 మందిని పోటీ చేయించింది. కాంగ్రెస్ 328 స్థానాల్లో పోటీ చేసింది. దేశంలోని 543 స్థానాలకు సగటున 15 మంది ఒక్కో నియోజకవర్గానికి పోటీ పడుతున్నారు. తమిళనాడులోని కరూరల్లో అత్యధికంగా 54 మంది పోటీలో ఉన్నారు.