Kodi Kathi Case
Kodi Kathi Case: కోడి కత్తి కేసు గుర్తుంది కదూ. విపక్ష నేతగా ఉన్న నేటి సీఎం జగన్ పై శీను అనే యువకుడు కోడి కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీ గానే శీను ఉన్నాడు. ఐదు సంవత్సరాలుగా జైలు జీవితం గడుపుతున్నాడు. కేసు విచారణ మాత్రం కొలిక్కి రాలేదు. ఈ దాడి వెనుక కుట్ర కోణం ఉందని జగన్ చెబుతున్నారు. అటువంటిదేమీ లేదని ఎన్ ఎ ఐ నిగ్గు తేల్చింది. విచారణకు స్వయంగా హాజరుకావాలని ఏపీ సీఎం జగన్ ను కోరుతూ వస్తోంది. సీఎం గా ఉండటంతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నానని ఒకసారి.. అధికార విధుల్లో బిజీగా ఉన్నానని మరోసారి.. విచారణకు హాజరయ్యే సమయం తనకు లేదని ఇంకోసారి జగన్ చెబుతూ వచ్చారు. ఇప్పుడేమో లోతైన విచారణ జరపాలని కోరుతున్నారు. కోర్టులో ఇదే విషయంపై పిటిషన్ దాఖలు చేశారు.
విపక్ష నేతగా జగన్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అటు పాదయాత్ర చేస్తూనే వారం వారం సిబిఐ కేసుల్లో హాజరవుతూ వచ్చారు. ఈ క్రమంలో విజయనగరంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో సీబీఐ కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వెళుతుండగా 2018లో జగన్ పై దాడి జరిగింది. శీను అనే యువకుడు కోడి కత్తితో దాడి చేశాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. ఇది రాజకీయ ప్రేరేపిత దాడిగా జగన్ అభిమానించి అంతులేని సానుభూతిని సాధించగలిగారు. సీన్ కట్ చేస్తే జగన్ అధికారంలోకి రాగలిగారు. ఇప్పటికీ నాలుగున్నర ఏళ్ల పాటు అధికారం అనుభవించారు. కానీ తనపై జరిగిన దాడి కేసును ఒక కొలిక్కి తేలేకపోయారు. కనీసం విచారణకు హాజరు కాకుండా కేసులో జాప్యం చేస్తూ వచ్చారు.
తొలుత కోడి కత్తి కేసులో కుట్ర కోణం ఉందని జగన్ ఆరోపించారు. రాజకీయ ప్రేరేపిత దాడిగా అభివర్ణించారు. కానీ తమ దర్యాప్తులో అటువంటిదేమీ లేదని ఎన్ ఎ ఐ తేల్చి చెప్పింది. కేసు విచారణకు హాజరైతే ఒక కొలిక్కి తెస్తామని చెప్పుకొస్తోంది. కానీ జగన్ మాత్రం ఇంకా బలమైన, ఇంకా లోతైన విచారణ జరపాలని కోర్టును కోరుతూ వస్తున్నారు. ఎంత లోతు దర్యాప్తు కావాలో మాత్రం చెప్పడం లేదు. ఇప్పటివరకు అసలు లోతైన దర్యాప్తు చేయలేదని ఆయన భావిస్తున్నారు. వాస్తవానికి ఎన్ఐఏ దర్యాప్తు కోరిందే జగన్. అప్పట్లో ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని.. దాడి జరిగింది ఎయిర్పోర్ట్లో కాబట్టి.. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని కోరారు. దీంతో ఎన్ఐఏ ను దర్యాప్తునకు ఆదేశించారు. ఎన్ఐఏ దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు నివేదించినా.. జగన్ మాత్రం నమ్మడం లేదు. ఏకంగా విచారణనే తప్పుపడుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు.
వాస్తవానికి ఈ కేసులో బాధితుడు జగన్. న్యాయం పొందాల్సింది ఆయనే. స్వయంగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సింది ఆయనే. కానీ ఎందుకనో ఆయన సిద్ధపడటం లేదు. దీంతో ఐదేళ్లుగా నిందితుడికి బెయిల్ మంజూరు కాలేదు. వారి కుటుంబ సభ్యులు కోరుతున్నా కనికరించడం లేదు. అయితే ఈపాటికి జగన్కు ఈ కేసు ద్వారా న్యాయం జరిగింది. అంతులేని సానుభూతి దక్కింది. ఇప్పుడు న్యాయంతో పని లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. మరి కొద్ది రోజులు పాటు విచారణ కొనసాగాలని భావిస్తున్నారు. దీని వెనుక ఏం ఆశిస్తున్నారో తెలియంది కాదు.