Ratan Tata: దివికెగిసిన పారిశ్రామిక దిగ్గజం.. రతన్‌ టాటా అస్తమయం..

టాటా.. ఈ పేరే ఒక బ్రాండ్‌.. భారత దేశ వ్యాపార రంగంలో టాటాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. టాటా గ్రూప్‌ సంస్థల చైర్మన్‌గా ఉన్న రతన్‌ టాటా... దిగ్గజ పారిశ్రామికవేత్త(86) కన్ను మూశారు.

Written By: Raj Shekar, Updated On : October 10, 2024 7:56 am

Ratan Tata

Follow us on

Ratan Tata: టాటా అంటేనే ఇండియాలో ఒక బ్రాండ్‌. చిన్న వస్తువైనా.. పెద్ద వస్తువైనా.. టాటా ముద్ర ఉంటే.. దానిని నాణ్యతగా భావిస్తారు. అంతలా జనంలోకి వెళ్లి సంస్థ టాటా. దశాబ్దాలుగా టాటా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వస్తోంది. రెండేళ్ల క్రితం ఎయిర్‌ ఇండియాను టేకోవర్‌ చేసింది. ఇటీవలే టాటా ఎయిర్‌ పోరుతో సర్వీస్‌లు ప్రారంభించింది. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ.. తన బ్రాండ్‌కు మాత్రం ఎప్పుడూ నష్టం కలుగకుండా చూసుకుంటోంది. టాటా గ్రూప్‌ సంస్థల చైర్మన్‌గా కొన్నేళ్లుగా పనిచేస్తున్న రతన్‌ టాటా అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రతన్‌ టాటా మరణించిన విషయాన్ని హర్ష గొయెంకా ఎక్స్‌ వేదికగా అధికారికంగా ట్వీట్‌ చేశారు.

తనదైన ముద్ర..
ఇదిలా ఉంటే.. వ్యాపార సామ్రాజ్యంలో రతన్‌ టాటా తనకంటూ ప్రతేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం వ్యాపారంలోనే కాకుండా దాతృత్వంలోనూ తనకు ఎవరూ సాటిలేరని నిరూపించుకున్నారు. రతన్‌ టాటా ఎంతో ఉదార స్వభావం ఉన్న వ్యక్తి. 86 ఏళ్ల రతన్‌ టాటా 1937 డిసెంబర్‌ 28న జన్మించారు. విదేశాల్లో చదువు పూర్తయిన తర్వాత అసిస్టెంట్‌గా టాటా గ్రూప్‌లో ప్రయాణం ప్రారంభించారు. తర్వాత జంషెడ్‌పూర్‌లోని టాటా ప్లాంట్‌లో కొన్ని నెలలు శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత తన బాధ్యతలు నిర్వర్తించడం మొదలు పెట్టారు. అసిస్టెంట్‌ స్థాయి నుంచి చైర్మన్‌గా ఎదిగారు. 1991 మార్చి నుంచి 2012 డిసెంబర వరకు టాటా సన్స్‌ చైర్మన్‌గా ఉన్నారు. 2008లో భారత ప్రభుత్వం రతన్‌ టాఆకు దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది.

ప్రముఖుల నివాళి..
రతన్‌ టాటా మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు నివాళులర్పించారు…
– భారత పారిశ్రామిక రంగానికి టైటాన్‌ రతన్‌ టాటా అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అభివర్ణించారు. దేశ ఆర్థిక వృద్ధికి, పారిశ్రామిక వృద్ధికి ఆయన వెలకట్టలేని సేవలు అందించారని కొనియాడారు. రత్‌ టాటా కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

– భారత దేశ ముద్దు బిడ్డను కోల్పోయామని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. వ్యాపారంలో, దాతృత్వంలో చెరగని ముద్ర వేసి వెళ్లిపోయారని పేర్కొన్నారు.

– రతన్‌ టాటా మరణంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.