Site icon OkTelugu

Early Elections In Telangana: ముందస్తు మంత్రాంగం.. త్వరలో తెలంగాణ అసెంబ్లీ రద్దు!

Early Elections In Telangana: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ఆరు నెలలుగా జరుగుతున్న ప్రచారం ఇక నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వీలైనంత త్వరగా రాష్ట్ర అసెంబ్లీ రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నారు. తెలంగాణలో హ్యాట్రిక్‌ విజయం సాధించి.. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఉత్సాహంగా వెళ్లాని యోచిస్తున్నారు. ఈమేరకు పార్టీ ముఖ్యనేతలు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌తో వరుస సమావేశాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

kcr

ఇంటగెలిస్తే.. రచ్చ గెలవచ్చని..
తెలంగాణలో హ్యాట్రిక్‌ విజయం సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా నూతనంగా స్థాపించబోయే బీఆర్‌ఎస్‌కు ఆదరణ లభిస్తుందన్న ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నారు. ఈమేరకు త్వరలోనే శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష, రుణాలు తీసుకోవడంలో కేంద్రం నుంచి ఎదురవుతున్న సహాయ నిరాకరణ, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం తదితర అంశాలపై సభలో చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది. తర్వాత అసెంబ్లీ రద్దు చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

Also Read: AP MPs: కండోమ్ రెడ్డి, విగ్ రాజా.. ఛీఛీ.. దిగజారిపోయిన ఏపీ ఎంపీలు!

ప్రత్యేక సమావేశాలే చివరివా?
త్వరలో నిర్వహించబోయే శాసనసభ ప్రత్యేక సమావేశాలే చివరి సమావేశాలనే వార్తలు వస్తున్నాయి. కేంద్రం వైఖరిని ఎండగట్టి.. తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీ రద్దు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రశాంత్‌ కిశోర్‌ నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎటువంటి వ్యతిరేకత లేనప్పటికీ దాదాపు 50 మంది ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని తేలింది. మూడోసారి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్‌ నిర్మొహమాటంగా ఈ 50 మందిని పక్కన పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత
తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారం 2023 డిసెంబరులో శాసనసభకు ఎన్నికలు జరగాలి. అయితే ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ చేసిన సర్వేలో సిట్టింగ్‌లలో చాలామంది ఓడిపోతారని తేలింది. ఈమేరకు సర్వే రిపోర్టును పీకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. నివేదిక చదివిన కేసీఆర్‌ పార్టీ గెలుపుకోసం చేయాల్సిన కార్యక్రమాలు, పార్టీ బలోపేతం, ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపైన ప్రశాంత్‌కిశోర్‌తో మంతనాలు జరుపుతున్నారు. ఈసారి సిట్టింగ్‌ల్లో ఎక్కువమందికి టికెట్లు ఇవ్వొద్దని, వారికి ప్రత్యామ్నాయ పదవులు ఇవ్వాలని పీకే కేసీఆర్‌కు సూచించినట్లు తెలిసింది.

Early Elections In Telangana

ప్రతీ అడుగు ముందస్తువైపే..
జాతీయ పార్టీ స్థాపనలో బిజీగా ఉన్న కేసీఆర్‌ ఇదే సమయంలో రాష్ట్రంలో పార్టీ గెలుపు, ముందస్తు ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన తనయుడు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరారామావు ద్వారా జిల్లాల్లో సభలు, సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల ఖమ్మం జిల్లా పర్యటకు వెళ్లి సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎన్నికలకు సిద్ధమవ్వాలంటూ పార్టీ జిల్లా నేతలకు పిలుపునిచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్‌ రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ఈనెల 18 లేదా 19 తేదీల్లో జాతీయ పార్టీని ప్రకటిస్తారు. రాబోయే ఎన్నికల్లో గెలుపొందడానికి అభ్యర్థుల మార్పుతోపాటు ప్రచార వ్యూహాన్ని కూడా ఖరారు చేయనున్నారు. శాసనసభను వీలైనంత తొందరగా రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నారు.

డిసెంబర్‌ వరకూ మూఢం..
జాతకాలు, వాస్తు, ముహుర్తాలను బాగా నమ్మే కేసీఆర్‌ తెలంగాణ అసెంబ్నీ ఇప్పట్లో రద్దు చేయరనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈనెల 23 తర్వాత మరో ఆరు నెలల వరకూ మూఢమే ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ డిసెంబర్‌లో అసెబ్లీ రద్దు చేయవచ్చని కొంతమంది పేర్కొంటున్నారు. మంచి రోజులు లేవనే ఆలోచనతోనే కేసీఆర్‌ ఈనెల 18 లేదా 19 జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌ను ప్రకటించాలని భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. జాతీయస్థాయిలో పార్టీకి గుర్తింపు రావాలంటే సమయం ఎక్కువ అవసరం. ఈ క్రమంలో డిసెంబర్‌ వరకు ఆగితే ఆరు నెలలు కరిగిపోయే అవకాశం ఉంది. ఈ క్రమంలో పార్టీ ప్రకటించి వచ్చే ఆరు నెలల్లో దానిని బలోపేతం చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:Undavalli Arunkumar- KCR: బీఆర్‌ఎస్‌ కార్యవర్గంపై కసతర్తు.. ఏపీ పగ్గాలు ఉండవల్లికి

Exit mobile version