Differences In YCP: నిప్పు నివురు కప్పతే అంతా ప్రశాంతంగానే అనిపిస్తుంది. కానీ అది రగులుకోవడం మొదలు పెడితే మిగిలేది బూడిదే. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అలాగే ఉందన్న టాక్ ఆ పార్టీలలో గట్టిగానే వినిపిస్తోంది. సీఎం వైఎస్.జగన్ ఒంటెద్దు పోకడలతో విసిగిపోయిన మంత్రులు, ఎమ్మెల్యేలు అదును కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేణుగోపాల్, ఆనం రామనారాయణరెడ్డి, వసంత కృష్ణప్రసాద్, ధర్మానప్రసాద్ అడపాదడపా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ జాబితాలోకి తాజాగా మాజీ మంత్రి మేకతోటి సుచరిత చేశారు. ఇలా వైసీపీలో అసంతృప్త ఎమ్మెల్యేల జాబితా పెరిగిపోతోంది.

అపాయింట్మెంట్ ఇవ్వని జగన్
సాధారణంగా ఏ పార్టీలో అయినా ఎమ్మెల్యేలు, నేతల మధ్య వివాదం జరిగితే అధినేత పిలిచి మాట్లాడతారు. కానీ వైసీపీలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ముందు ఆయన కరుణిస్తేనే తర్వాత జగన్ దర్శనం కలిగేది. తాజాగా మాజీ మంత్రి సుచరిత భర్త దయాసాగర్ ఇటీవల ఆదాయపు పన్ను శాఖ అధికారిగా రిటైర్ అయ్యారు. ఆయన వైసీపీలో ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. కానీ జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఇక టిక్కెట్ ఇస్తారన్న నమ్మకం లేదు. దీంతో ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఆయన వేరే పార్టీలోకి పోతే తాను కూడా అదే పార్టీలోకి వెళ్తానని సుచరిత నేరుగానే చెబుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేల సంఖ్య వైసీపీలో అంతకంతకూ పెరిగిపోతోంది. ఎమ్మెల్యేలు ఇలా అదే పనిగా పార్టీ , ప్రభుత్వ తీరుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేయడం వైఎస్ఆర్సీపీలోనూ చర్చనీయాంశం అవుతోంది.

అందరిలో అసంతృప్తే..
వైసీపీలో మెజారిటీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తే ఉన్నట్లు సమాచారం. జగన్ పనితీరుపై అసంతృప్తి లేకపోయినా కేవలం వారికి వారి నియోజకవర్గాలు, జిల్లాల్లో ఉన్న రాజకీయ ఆధిపత్య పోరాట పరిస్థితుల కారణంగానే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారు. కోటంరెడ్డి, ఆనం, వసంత కృష్ణప్రాద్, మద్దిశెట్టి వేణుగోపాల్, సుచరిత ఇలా.. బయట వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నవారికీ టిక్కెట్ గ్యారంటీ లేదని అందుకే.. బయటపడుతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వారి అసంతృప్తి పూర్తిగా రాజకీయ కారణాలే కానీ.. జగన్ పనితీరు కారణం కాదంటున్నారు. కానీ పార్టీ అధ్యక్షుడు జగన్ తీరు కూడా వివాదాస్పదంగానే ఉందన్నఆందోళన పార్టీ నేతల్లో ఉంది. ఎంత కష్టపడినా .. ఖర్చు పెట్టుకున్నా చివరికి సర్వేల పేరుతో టిక్కెట్ ఎగ్గొట్టి బాగా డబ్బులున్న వారికి ఇస్తారని భావిస్తున్నారు.

ఎమ్మెల్యేలు, దిగువస్థాయిలో ప్రజాప్రతినిధులంతా వైసీపీ వాళ్లే. వాళ్ల తీరుపై ప్రజల్లో అసంతృతప్తి కనిపిస్తోంది. ఇలాంటి అసంతృప్తుల్ని వీలైనంత వరకూ తగ్గించకపోతే.. ముందు ముందు సమస్య అవుతందని వైఎస్ఆర్సీపీ హైకమాండ్కు దిగువశ్రేణి నేతలు సలహాలిస్తున్నారు.