ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 303 కి చేరింది. వైద్య ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 37 మందికి కరోనా పాజిటివ్ నమోదైనట్లు స్టేట్ కరోనా నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో 32, నెల్లూరు జిల్లాలో 42, ప్రకాశం జిల్లాలో 24, కడప జిల్లాలో 27, కృష్ణా జిల్లాలో 29, పశ్చిమ గోదావరి జిల్లాలో 21, విశాఖపట్నం జిల్లాలో 20, తూర్పుగోదావరి జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 17, అనంతపురం జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 74 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నేటికీ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 74 నమోదై కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. నిన్నటి వరకు ఒక్క అంకెకే పరిమితమైన కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగి పోయింది. వీరిలో ఢిల్లీ నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారని సమాచారం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జిల్లాలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తున్నారు. తరువాతి స్థానంలో నెల్లూరు జిల్లాలో 42 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మృతి చెందగా, ఆరుగురు కోలుకుని ఆసుపత్రి నుంచి ఇళ్లకు వెళ్లారని అధికారులు చెప్పారు.