
ఆంద్రప్రదేశ్ లో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులతో పాటు జిల్లాల, పట్టణాలు, గ్రామాల మధ్య ఉన్న సరిహద్దుల్లోనూ పోలీసులు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రైతుల సమస్యల పరిష్కారం పేరుతో పశ్చిమగోదావరి జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే సైకిల్ పై యాత్ర చేపట్టారు. రైతు సమస్యలపై కలెక్టర్ కు ఫిర్యాదు పేరుతో ఆయన చేపట్టిన యాత్ర ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తన నియోజకవర్గంలోని రైతు సమస్యలపై దృష్టిసారించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తన నియోజకవర్గంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నందున కలెక్టర్ కు సమస్యలు విన్నవించాలని భావించారు. కానీ కరోనా సహాయక చర్యల్లో బిజీగా ఉన్న కలెక్టర్ ఫోన్ తీయలేదు. పలుమార్లు ప్రయత్నించి విఫలమైన ఎమ్మెల్యే కమిషనర్ కు ఫోన్ చేశారు. ఆయన కూడా ఫోన్ తీయలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎమ్మెల్యే రామానాయుడు ఈ వ్యవహారంలో అటో ఇటో తేల్చుకోవాలని భావించి సైకిల్ పై పాలకొల్లు నుంచి ఏలూరుకు బయలుదేరారు.ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..
తన నియోజక వర్గ ప్రజలందరినీ తన కుటుంబంగానే భావిస్తున్నానన్నారు. మాట్లాదామంటే కలెక్టర్ , ఎస్పీ వంటి జిల్లా అధికారులు కనీసం ఫోన్ లో అందుబాటులో ఉండటం లేదన్నారు.
ప్రజా ప్రతినిధితో మాట్లాడటం కంటే ఇంకా ఎక్కువ ముఖ్యమైన పనులు అధికారులకు ఏమున్నాయో తనకు తెలియడం లేదన్నారు. ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని రామానాయుడు డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు, బకాయిలు, సాగునీరు అందించాలన్నారు.