భారత్ ను బలోపేతం కావించి, ప్రపంచ దేశాలలో భారత్ ప్రతిష్టతను గణనీయంగా ఇనుమడింప చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపట్టినదని కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కొనియాడారు.
ప్రధాని మోదీ రెండోసారి ప్రధానిగా ఒక ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ
భారత్ ను బలోపేతం కావించడానికి ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రతి బిజెపి కార్యకర్త అండగా నిలవాలని ఆయన పిలుపిచ్చారు.
దశాబ్దాలుగా పరిష్కారం కానీ ఎన్నో సమస్యలను ఏడాది కాలంలోనే పరిష్కరించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిది అని తెలిపారు. ఆర్టికల్370, 35ఏను రద్దు చేయడం చరిత్రాత్మక నిర్ణయమని గుర్తు చేశారు.
అయోధ్య రామమందిరం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును శిరసావహించి దేశ ప్రజలందరిలో సమైక్యతను మోడీ పెంచారని పేర్కొన్నారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడేలా ట్రిపుల్ తలాక్ బిల్లును తెచ్చారని చెప్పారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లో మతపరమైన హింసకు గురైన మైనార్టీలకు పౌరసత్వం కల్పించేలా కేంద్రం సీఏఏను తీసుకురావడం గొప్ప నిర్ణయమని ప్రశంసించారు.
ఏడాది కాలంలోనే 36 బిల్లులను బీజేపీ సర్కారు పాస్ చేయించిందని సంజయ్ చెప్పారు. అనేక సమస్యలను పరిష్కరించిన 17వ లోక్ సభలో తానూ ఒక సభ్యుడు అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి మోడీ సకాలంలోనే లాక్ డౌన్ ప్రకటించారని, అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా భారీ ప్యాకేజీతో న్యాయం చేశారని చెప్పారు.