Ayodhya Ram Mandir: వందల సంవత్సరాలు కొట్లాడితే.. అయోధ్యలో రాముడికి ఆలయం సాధ్యమైంది. బాల రాముడు ఆలయంలో కొలువై.. భక్తుల కోరికలు తీర్చుతున్నాడు. కోట్లాదిమంది హిందువులకు ఆలంబనగా నిలుస్తున్నాడు. అటువంటి రాముడిని కొంతమంది హిందువులే మోసం చేశారు. రాముడు మీద ఎంతో భక్తితో సమర్పించే విరాళాలను దొబ్బి తిన్నారు.
రామాలయంలో హుండీలో పడే కానుకలను లెక్కించడానికి కొంతమంది సిబ్బందిని రామ జన్మభూమి ట్రస్ట్ నియమించుకుంది. వారికి 20 నుంచి 25 వేల వరకు వేతనాలు ఇస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. భక్తులు సమర్పించే కానుకలలో వారు నొక్కడం మొదలుపెట్టారు. కేవలం 20 నుంచి 25 వేల వేతనం మాత్రమే వచ్చే వారు.. అయోధ్య రామాలయ చుట్టుపక్కల ప్రాంతంలో కోట్లు విలువ చేసే భూములు కొన్నారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఆడిట్ నిర్వహించారు. అందులో వస్తున్న విరాళాలకు.. లెక్కిస్తున్న సొమ్ముకు పొంతన లేకుండా పోయింది. దీంతో ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించారు. దీంతో దొంగలు దొరికిపోయారు.
దొంగలు దొరికిపోయిన తర్వాత అక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. హుండీలో సొమ్ములు పక్కదారి పడుతున్నాయని అనుమానం వ్యక్తం చేసిన అధికారిని సస్పెండ్ చేశారు. అయితే దీనిపై రామ జన్మభూమి ట్రస్ట్ బాధ్యులు కొంతమంది రంగంలోకి దిగారు. హుండీలో సొమ్ములు సక్రమంగానే ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు ఆడిటింగ్ జరుగుతోందని.. ఇప్పుడే సొమ్ములు మాయమయ్యాయి అనే విషయంపై ఒక అంచనాకు రాలేమని వారు చెబుతున్నారు. అలాంటప్పుడు ఫిర్యాదు చేసిన అధికారిని విధుల నుంచి ఎలా తొలగించారో వారే చెప్పాలి.
కోట్లాదిమందికి ఆదర్శప్రాయుడు.. నచ్చిన దైవం.. మెచ్చిన దేవుడైనటువంటి రాముడి విషయంలో కొంతమంది దుర్మార్గులు ఇలా చేయడం భక్తుల్లో ఆవేదన కలిగిస్తోంది. ఎంతో కష్టపడి రామాలయం నిర్మించుకుంటే.. దేశం మొత్తం విరాళాలు ఇచ్చి రాముడి మీద భక్తి పారవశ్యాన్ని నిరూపించుకుంటే.. ఇలా చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఒకవేళ ఆడిటింగ్ లో వారు అక్రమాలకు పాల్పడ్డట్టు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని భక్తుల కోరుతున్నారు. ఎందుకంటే కోట్లాదిమంది నమ్మకాన్ని వమ్ము చేస్తే.. అంతకుమించిన పాపం మరొకటి ఉండదని వారు గుర్తు చేస్తున్నారు. మరి దీనిపై రామ జన్మభూమి ట్రస్ట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
