POK Protest: పాకిస్తాన్ కు చుక్కలు కనిపిస్తున్నాయి.. ఇక భారత్ కు అప్ప చెప్పడమే..” మాకు ప్రజాస్వామ్యం కావాలి. స్వేచ్ఛగా బతికే హక్కు కావాలి. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి. మా మీద మీ పెత్తనం కుదరదు. సవారి చేస్తానంటే వీలుపడదు. ఇకపై చేతులు ముడుచుకొని కూర్చోలేము. కచ్చితంగా మా గొంతును సవరిస్తాం. మా హక్కుల కోసం పోరాడుదాం. అవసరమైతే ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ముందుకు దూసుకొస్తాం. తుపాకి తూటాలు.. పోలీసుల అరెస్టులు.. ఆర్మీ వేధింపులు మమ్మల్ని ఏమి చేయలేవు” ఇవీ కొద్దిరోజులుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడి ప్రజల నుంచి వినిపిస్తున్న నినాదాలు.
పాకిస్తాన్ దుర్మార్గం వల్ల కొంతకాలంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ పాలకుల తీరును నిరసిస్తూ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు.. పాకిస్తాన్ పాలకుల తీరును తీవ్రంగా ఎండ కడుతున్నారు. చివరికి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారు పోరాటం సాగిస్తున్నారు. ఇంటర్నెట్ నిలిపివేసినప్పటికీ.. నిత్యావసరాలు అందకుండా చేసినప్పటికీ.. తాగునీరు.. విద్యుత్ సరఫరాను ఆపివేసినప్పటికీ అక్కడి ప్రజలు ఆగడం లేదు. పైగా మరింత దూకుడుగా ఉద్యమాన్ని సాగిస్తున్నారు.
తాజాగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నివాసం ఉంటున్న ప్రజలు ఆవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముజఫరాబాద్ వరకు లాంగ్ మార్చ్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు.. పోలీసులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ నిరసనలలో ఐదుగురు ఆందోళనకారులు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. పాకిస్తాన్ ఆక్రమిత రావల్కోట్.. చాందిని చౌక్.. గలి.. బల్దియా అడ్డ.. ప్రాంతాలలో నిరసనకారులు భారీగా మోహరించారు. వీరిని వెనక్కి పంపించడానికి పాకిస్తాన్ భద్రతా బలగాలు భాష్ప వాయువును ప్రయోగించాయి. గాలిలోకి కాల్పులు కూడా జరిపాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగినప్పటికీ నిరసనకారులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రావల్కోట్ ప్రాంతంలోకి ప్రవేశించడానికి నిరసనకారులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
రహదారులను మూసివేసినప్పటికీ.. అన్ని మార్గాలను నిర్బంధించినప్పటికీ నిరసనకారులు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా భద్రతా బలగాల కళ్ళు కప్పి రావల్కోట్ ప్రాంతంలోకి ప్రవేశించారు. అయితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో చట్టసభలలో శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కు అప్పగించాలన్న డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం లేదని.. నియంతృత్వం అధికంగా ఉందని.. అందువల్లే జమ్ము కాశ్మీర్లో భారత్ వ్యవహరిస్తున్న విధంగా.. పాకిస్తాన్ నడుచుకోవాలని.. పాకిస్తాన్ పరిపాలకులు చేతకాకపోతే భారత్ కు అప్పగించాలని పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రజలు కోరుతున్నారు.
