AP BJP: ఏపీ బీజేపీ నేతలది తలోదారి. ఎప్పుడు ఎవరు ఎలా రియాక్టవుతారో.. ఏం ప్రకటనలు ఇస్తారో వారికే తెలియదు. దేశంలో అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు దాటుతోంది. దేశంలో అన్ని ప్రాంతాల్లో పార్టీ విస్తరిస్తోంది. కానీ ఏపీలో మాత్రం బలోపేతం కాలేకపోతోంది. పార్టీ ఇన్ చార్జిలు, జాతీయ కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, పదాదికారులు, శక్తి ప్రతినిధులు.. ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది మంది నాయకులు ఆ పార్టీలో ఉన్నారు. కానీ సపోర్టుగా నిలవడానికి ప్రజలే సిద్ధంగా లేరు. అయినా బీజేపీ నేతలు గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. సొంత కాలిపై ఎదిగే ప్రయత్నాలు చేయడం లేదు. అలాగని ఏపీ తమకు అవసరం లేదనుకున్నారో.. లేక జాతీయ రాజకీయాలకు ఏపీని ప్రయోగ వేదికగా చూడాలనుకుంటున్నారో తెలియదు కానీ.. బీజేపీ అగ్రనేతలు కూడా ఏపీపై ఫోకస్ పెంచడం లేదు. ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నారు కనుక అటు ఇతర పార్టీల నుంచి గౌరవం, మీడియా నుంచి ప్రాధాన్యం దక్కుతుంది తప్ప వేరే ఇతర కారణాలేవీ లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశమంతా ఒక ఎత్తు.. ఏపీలో మరో ఎత్తు అన్న చందంగా ఉంది స్థానిక బీజేపీ నేతల దుస్థితి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వానికి పరోక్ష సహకారం అందించి…ఆ పార్టీకి ఎంతో కొంత మేలు చేయాలని భావించే నేతలే అధికం. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి సునీల్ దియోదర్, ఎంపీ జీవీఎల్ నరసింహరావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు త్రయం మాత్రం వైసీపీకి వీరవిధేయత కనబరుస్తూ వచ్చారు. ఇప్పటికీ అదే కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే దీనిపై అభ్యంతరాలు ఉన్నా.. ఇటీవల మరింత తీవ్రమయ్యాయి. మొన్నటికి మొన్న కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగానే అసంతృప్త వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడు విశాఖ రాజు విష్ణుకుమార్ రాజు జత అయ్యారు. ముఖ్యంగా టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందన్న ప్రచారం, కామెంట్స్ వెలువడిన ప్రతిసారీ ఈ ముగ్గురు నేతలు అటువంటిదేమీ లేదని ప్రకటనలు జారీచేస్తూ వస్తారు. వంతులవారీగా ఆ బాధ్యత తీసుకొని స్టేట్మెంట్లు ఇస్తుంటారు.
అయితే ఏపీలో బలమున్న పార్టీతో కలిసి నడవడం ద్వారా బలోపేతం కావాలని భావిస్తున్న బీజేపీ నాయకులు ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. ముఖ్యంగా వైసీపీని విభేదించే నాయకులు, టీడీపీ, జనసేనలతో పొత్తుతో ప్రయోజనముంటుందనుకున్న నేతలు తెరపైకి వస్తున్నారు. తమ వాదనలు వినిపిస్తున్నారు. తాజాగా విష్ణుకుమార్ రాజు ఇటువంటి అభిప్రాయమే వ్యక్తం చేసేవారు. వైసీపీని ఓడించాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి నడవాల్సిన అవసరముందని ఒక్కినొక్కానించారు. అంతటితో ఆగకుండా ప్రజల మనసులో ఏ అభిప్రాయముందో తెలుసుకోవాలని సునీల్ దియోదర్ ను నేరుగా సూచించారంటే రాజుగారి సంకేతాలు గట్టిగానే ఇచ్చినట్టయ్యింది. అయితే ఇది ఒక్క విష్ణుకుమార్ రాజుతోనే ఆగే పరిస్థితి లేదు. మున్ముందు మరింతమంది నాయకులు వెలుగుచూసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి పొత్తుపై బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కానీ బీజేపీలో అటువంటి క్రమశిక్షణేది కానరావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు ఉండదని సునీల్ దియోదర్ చెబుతూ వస్తున్నారు. నిజానికి బీజేపీకి ప్రస్తుతం జనసేన మిత్రపక్షంగా ఉంది. ఇప్పటికే టీడీపీతో జనసేన పొత్తు ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. అయితే టీడీపీ మాత్రం బీజేపీతో కలిసి నడవాలని తహతహలాడుతోంది. అదే సమయంలో మిత్రపక్షంగా ఉన్న పవన్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం తన వ్యూహం మార్చుకున్నట్టు ప్రకటించి.. బీజేపీకి దూరమవుతున్నట్టు సంకేతాలిస్తున్నారు. అయితే తమకు టీడీపీ అవసరం లేదని.. జనసేన ఒక్కటి ఉంటే చాలని బీజేపీ నేతలు స్టేట్ మెంట్లు కొనసాగిస్తున్నారు. అల్టిమేట్ గా ఈ ప్రకటనలు ప్రజల్లో గందరగోళం సృష్టించి వైసీపీకి లాభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More