Fake Doctor Robbery In Hospitals: వైద్యవృత్తి అనేది అత్యంత పవిత్రమైనది. ఒక వైద్యుడు రోగులకు సేవ చేయాలంటే అనేక అర్హతలు ఉండాలి. ఎంబిబిఎస్ చదవడమే కాదు.. హౌస్ సర్జన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత స్పెషలైజేషన్ తీసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే దాదాపు పది సంవత్సరాలపాటు అతడు పుస్తకాలతో కుస్తీ పట్టాలి. ఇంత చేస్తేనే అతడు వైద్యవృత్తికి అర్హుడు. పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయడానికి ఎలిజిబిలిటీ సంపాదిస్తాడు. కానీ, ఈ కథనంలో ఈమె పూర్తి డిఫరెంట్. ఆమె ఎంబిబిఎస్ చదవలేదు. హౌస్ సర్జన్ పూర్తి చేయలేదు.. చివరికి స్పెషలైజేషన్ కోర్స్ కూడా ఎంచుకోలేదు.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ యూఎస్ఏ రివ్యూ…బొమ్మ హిట్టా..? ఫట్టా..?
శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో మాదిరిగా మెడకు స్టెత్.. ఒంటికి వైట్ యాఫ్రాన్.. ధరించింది. వైద్యురాలి అవతారం ఎత్తింది. రోగులకు మత్తుమందు ఇచ్చేది. వారు మత్తులోకి వెళ్లిన తర్వాత బంగారు ఆభరణాలను తస్కరించేది. ఆభరణాలను తస్కరించడానికి ఆమెకు భర్త సహకరించేవాడు. అయితే ఇటీవల ఆ దొంగ దంపతులు సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్, మార్కెట్ విభాగం పోలీసులకు దొరికిపోయారు.
పోలీసులకు దొరికిపోయిన ఆ ఇద్దరి నిందితుల పేర్లు గౌండ్ల శిరీష, ఎడలపల్లి సాయికుమార్ గౌడ్. శిరీష ఫార్మ్ డీ చదివింది. ఈమెది వికారాబాద్ జిల్లా నవాబ్ పేట. ఆర్థిక ఇబ్బందుల వల్ల శిరీష సులభంగా డబ్బు సంపాదించడానికి భర్తతో కలిసి ఈ దొంగతనాలకు ప్రణాళిక రూపొందించింది. తనకు ఉన్న కొద్దిపాటి వైద్య పరిజ్ఞానంతో వృద్ధులైన మహిళలను రక్షింగా చేసుకునేది. డాక్టర్ మాదిరిగా వేషధారణతో హల్ చల్ చేసేది. తన వెంట ఉన్న మత్తు ఇంజక్షన్ ను వృద్ధ మహిళలకు ఇచ్చేది. వారు మత్తులోకి వెళ్ళిన తర్వాత.. ఒంటి మీద ఉన్న ఆభరణాలను దొంగిలించి.. వెంటనే పరారయ్యేది. ఈ నెల 11న సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రి.. చందానగర్ ప్రాంతంలోని సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రిలో శిరీష, ఆమె భర్త దొంగతనాలకు పాల్పడ్డారు. బంగారు ఆభరణాలను ఇతర వ్యక్తులకు అమ్మి.. విలాసాలకు.. షాపింగ్ కోసం ఖర్చు చేసేవారు.
పోలీసులు వీరిని పట్టుకున్న తర్వాత.. తమదైన శైలిలో విచారించారు. ఈ క్రమంలో వారి వద్ద సుమారు 11 తులాల బంగారాన్ని.. ఒక మారుతి సుజుకి బాలెనో కారును.. రెండు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో డాక్టర్ వేషధారణలో ఓ వృద్ధ మహిళకు మత్తు ఇంజక్షన్ వేసింది శిరీష. ఆమె ఒంటి మీద ఉన్న ఆభరణాలను దొంగిలించింది. ఈ దృశ్యాలు మొత్తం రహస్య కెమెరాలలో నిక్షిప్తమయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు వారిద్దరి మీద నిఘా పెట్టారు. అనంతరం వారి గురించి ఆరా తీశారు. చందానగర్లోని సిటిజన్ హాస్పిటల్ లో కూడా వీరి ఇదే స్థాయిలో దొంగతనానికి పాల్పడిన నేపథ్యంలో.. పోలీసులు నిఘా పెట్టి అరెస్ట్ చేశారు.
