ఏపీలో రాజధాని మీద నెలకొన్ని ప్రతిష్టంభన ఇంకా వీడడం లేదు. ఇప్పటికే జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం చేసినా ఇంకా ఆ కేసు హైకోర్టులో పెండింగ్లోనే ఉంది. అయితే.. ఆ కేసు అలా నడుస్తుండగానే కొందరు కేబినెట్ మంత్రులు మాత్రం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి మాటల ప్రకారం.. ఏపీ రాజధానిని త్వరలో అమరావతి నుంచి విశాఖకు ఎట్టిపరిస్థితుల్లోనూ తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే రాజధాని విశాఖకు తరలిరావడం ఖాయమని, నగరానికి సమాంతరంగా మరో సిటీ రూపుదిద్దుకుంటుందని, అందులో ఐకానిక్ బ్రిడ్జ్ కూడా ఉంటుందని నిన్న ఒక్కరోజే ఇద్దరు మంత్రులు ప్రకటనలు చేశారు.
Also Read: ఆ బాధ్యతను ఎల్లో మీడియా భుజానా వేసుకుందా..?
ఈ లెక్కన చూస్తే మార్చి తర్వాత ఏ క్షణాన అయినా రాజధాని తరలింపుతోపాటు ఇతర చర్యలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు కూడా చెప్పేశారు. ఏపీ రాజధాని తరలింపునకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న మంత్రులు, సలహాదారులు రోజుకో వ్యాఖ్యలు చేస్తుండడం కూడా మరింత క్లారిటీ వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ ఏడాది వేసవిలోపే రాజధాని విశాఖకు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు అధికార గణం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజాగా మంత్రులతోపాటు సలహాదారులు చేస్తున్న వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. న్యాయపరమైన చిక్కులు కూడా త్వరలోనే తొలగిపోతాయని వారు ధీమాతో ఉన్నారు.
రాజధాని అమరావతి నుంచి మరికొద్ది రోజుల్లోనే విశాఖకు రానుందని తాజాగా నగరానికి చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. విశాఖ కేంద్రంగా త్వరలో పాలన ప్రారంభం కానుందన్నారు. తన నియోజకవర్గం భీమిలిలోని లక్ష్మీపురంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అవంతి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రి అయిన అవంతి వ్యాఖ్యలతో ప్రభుత్వ వైఖరి పూర్తిగా వెల్లడైంది. అవంతి చెప్తున్న దాన్ని బట్టి చూస్తే వచ్చే నెలలో రాజధాని తరలింపుపై ప్రభుత్వం నుంచి ఏదైనా ఆదేశాలు వచ్చే అవకాశాలూ ఉన్నాయన్న చర్చ అప్పుడే మొదలైంది.
Also Read: రామయ్యా.. రావయ్యా..: త్వరలోనే కేటీఆర్కు పట్టాభిషేకం!
త్వరలో విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందని చెప్పిన మంత్రి అవంతి.. అక్కడ ప్రభుత్వం చేయబోతున్న అభివృద్ధి వ్యూహాలను కూడా వెల్లడించారు. అటు అనకాపల్లి, గాజువాక నుంచి ఇటు తగరపువలస, భోగాపురం వరకూ మెట్రో రైల్ ప్రాజెక్టు రాబోతుందని తెలిపారు. అలాగే భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, సబ్బవరం, అనకాపల్లి, ఎస్.కోట, డెంకాడ, భోగాపురం మండలాలతో విశాఖకు సమాంతరంగా మరో నగరం రూపుదిద్దుకోనుందని అవంతి వెల్లడించారు. దీంతో విశాఖపై వైసీపీ సర్కారు భారీ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
అవంతి అలా మాట్లాడితే.. మరో మంత్రి రోడ్లు, భవనాల శాఖ మినిష్టర్ శంకర్ నారాయణ విశాఖలోనే ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల అధికారులతో సమీక్ష అనంతరం ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. శంకర్ నారాయణ మరో ప్లాన్ కూడా వెల్లడించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించబోయే కొత్త ఎయిర్పోర్టును విశాఖతో అనుసంధానించేందుకు రూ.1700 కోట్లతో బీచ్ కారిడార్ నిర్మిస్తామని శంకర్ నారాయణ వెల్లడించారు. ఇందులో భాగంగా భీమిలి-–భోగాపురం మధ్య ఐకానిక్ బ్రిడ్జి కూడా వస్తుందన్నారు. గోస్తనీ నదిపై 2.6 కిలోమీటర్ల పొడవున రూ.500 కోట్ల వ్యయంతో ఈ ఐకానిక్ వంతెన నిర్మిస్తామన్నారు. దీనికి డీపీఆర్ కూడా తయారవుతోందన్నారు. ఈ ఇద్దరు మంత్రుల మాటలను బట్టి చూస్తుంటే విశాఖ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More