YSR Congress Party MLAs Skipping Assembly Sessions వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదు. ఆ పార్టీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. నిబంధనల ప్రకారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇస్తే కానీ సభకు హాజరు కానని జగన్మోహన్ రెడ్డి భీష్మించుకొని కూర్చున్నారు. అయితే గెలిచిన వారిలో చాలామంది కొత్తవారు. అటువంటి వారికి సభకు వెళ్లాలని ఉంది. కానీ జగన్ మోహన్ రెడ్డి మొండి పట్టుదల గురించి తెలియంది కాదు. పోనీ కూటమి పార్టీలోకి వెళ్దామంటే అక్కడ హౌస్ ఫుల్. కూటమి తరుపున 164 మంది గెలిచారు. వారికి ఎమ్మెల్యేల అవసరం కూడా లేదు. అటు నుంచి పెద్దగా ఒత్తిడి లేదు. అయితే ఇటు సభకు హాజరు కావాలని అధినేతకు చెప్పుకోలేక.. సభకు హాజరు కాలేక చాలామంది వైసిపి ఎమ్మెల్యేలు సతమతమవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* సభకు వెళ్లాలని ఆరాటం..
వైసీపీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలామంది సభకు వెళ్లాలని భావిస్తున్నారు. అధినేత జగన్ అందుకు అంగీకరించడం లేదు. ముఖ్యమంత్రి ఎంత సేపు మాట్లాడితే తనకు అంతసేపు అవకాశం ఇవ్వాలని జగన్ కోరుతూ వస్తున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూలత రావడం లేదు. స్పీకర్ సైతం అంగీకరించకపోవడంతో వారు సభకు వెళ్లడం లేదు. సభకు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి వారాంతపు ప్రెస్ మీట్ లు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ చాన్స్ లేదు. నియోజకవర్గంలో ఎలాగు గుర్తింపు లేదు. సభకు వెళ్లి గుర్తింపు తెచ్చుకుందాం అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వారు పడుతున్న బాధ వర్ణనాతీతం.
* గ్యాలరీలో ప్రకాశం ఎమ్మెల్యే
సందట్లో సడే మియా అన్నట్టు స్పీకర్ అయ్యన్నపాత్రుడు డిజిటల్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో తమపై ఎక్కడ అనర్హత వేటు పడుతుందో అన్న ఆందోళన వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సభకు వచ్చారు. వైసీపీ నుంచి ఎన్నికైన ఆయన కూటమిపై బాగానే విరుచుకుపడుతుంటారు. అయితే ఆయన సభకు హాజరు కావాలని వచ్చారో.. లేకుంటే సభ గ్యాలరీలో కూర్చుని వీక్షించాలని వచ్చారో తెలియడం లేదు. ఇంతలోనే మంత్రులు ఆయనకు ఎదురుపడ్డారు. అసెంబ్లీలో ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. ఎప్పటికైనా వచ్చారు సంతోషం అంటూ పలకరించారు. ఈ క్రమంలో వారి మధ్య చర్చ సాగింది. ప్రజల కోసం ఖర్చు చేస్తున్న బడ్జెట్ వివరాలను అడగాల్సింది పోయి.. బిల్ గేట్స్ కు ఖర్చుపెట్టిన టీ సమోసా ఖర్చులు అడుగుతున్నారు ఎందుకు అని వ్యాఖ్యానించారు. మీకు అన్ని తెలిసే నన్ను ఆటపట్టిస్తున్నారా అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారట తాటిపర్తి చంద్రశేఖర్. ప్రస్తుతం ఈ విషయంపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.