YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అదే దూకుడుతో ముందుకు సాగుతున్నారు. వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. సోదరుడు జగన్ ఆరోపణలను తిప్పి కొడుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయిన తాను.. ముమ్మాటికీ వైఎస్ షర్మిలారెడ్డి నేనని తేల్చి చెబుతున్నారు. ఎవరి అభ్యంతరాలూ తనకు అవసరం లేదన్నారు. ఎవరూ కితాబు ఇవ్వకపోతే… నా విలువ ఎక్కువ కాదు.. తక్కువ కాదు అంటూ తేల్చి చెప్పారు. రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ తో పాటు జగన్ పై కీలక కామెంట్స్ చేశారు. ప్రభుత్వ దోపిడీ, అవినీతి గురించి ప్రస్తావించారు. అయితే మొదట వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే షర్మిల వ్యాఖ్యలపై మాట్లాడారు. కానీ షర్మిల విమర్శల డోసు పెంచడంతో జగన్ స్పందించారు. షర్మిల పేరు ఎత్తకుండా విమర్శలు చేశారు. తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని ఆరోపించారు. దీనికి దైవమే సాక్ష్యం అన్నారు. అదే సమయంలో వైసీపీ పార్టీ శ్రేణులు ఆమె వైఎస్ షర్మిల కాదని.. ఆమె పుట్టింటి పేరు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. బ్రదర్ అనిల్ కుమార్ ఇంటి పేరును జతచేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. వైసీపీలో దిగువ స్థాయి నాయకుడి నుంచి మంత్రుల వరకు షర్మిలపై ఇదే తరహా ఆరోపణలు చేశారు.
దీనిపై షర్మిల తాజాగా కామెంట్స్ చేశారు. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెను.. వైయస్ షర్మిల రెడ్డి కాకుండా ఎలా ఉంటాను. నా కుమారుడికి సైతం వైయస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నాను. అక్రమంగా సంపాదించుకోవడానికి నా భర్తతో జగన్ వద్దకు వెళ్లానని నిందలు మోపుతున్నారు. ఈరోజు వరకు ఏది ఆశించి నా అన్న వద్దకు వెళ్లలేదు. దానికి మా అమ్మే సాక్ష్యం అంటూ తేల్చి చెప్పారు. మీకు దమ్ముంటే మా అమ్మని అడగండి అంటూ షర్మిల బాంబు పేల్చారు. ఒకవేళ విజయమ్మ నోరు తెరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అయితే రోజురోజుకు షర్మిల విమర్శల డోసు పెంచడంతో ఏం చేయాలో అధికార పార్టీకి పాలు పోవడం లేదు. ఇప్పుడు షర్మిల విజయమ్మ ప్రస్తావన తీసుకురావడం కూడా వారికి ఇబ్బందికరంగా మారింది. ఏం మాట్లాడితే ఎలాంటి పరిణామం ఎదురవుతుందోనని వారిలో ఆందోళన కనిపిస్తోంది. మొత్తానికైతే షర్మిల విజయమ్మను రూట్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే అధికార పార్టీకి ఇబ్బందికర పరిణామాలే.