Site icon OkTelugu

Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ ని అవుతానంటున్న ఆ సీనియర్!

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొంది 2029 సార్వత్రిక ఎన్నికలు.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయన్న టాక్ వినిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో 80 వరకు అసెంబ్లీ స్థానాలు, ఓ 13 వరకు ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న నియోజకవర్గాలకు తోడు 50% పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఉత్తరాంధ్రలో విశాఖ జిల్లాలో మరో ఎంపీ సీటు పెరగడం ఖాయమని తెలుస్తోంది. విశాఖ లోక్సభ స్థానంతో పాటు విశాఖ సెంట్రల్ లోక్సభ నియోజకవర్గ ఒకటి రానుందన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆశావహులు ఇప్పటినుంచి దృష్టి పెట్టారు. విశాఖ అభివృద్ధి చెందిన నగరం కావడంతో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తే మంచి గుర్తింపు ఉంటుందన్న అభిప్రాయం నాయకుల్లో ఉంది. దీంతో చాలామంది సీనియర్లు విశాఖ ఎంపీ స్థానంపై దృష్టి పెట్టారు. ప్రముఖంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు వినిపిస్తోంది.

* మంత్రి పదవి ఆశించి..
ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. మంత్రివర్గంలో స్థానం ఆశించారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా దక్కలేదు. అయితే విస్తరణలో ఛాన్స్ ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఆయన కుమారుడు గంటా రవితేజ భీమిలి నియోజకవర్గం లో యాక్టివ్ అయ్యారు. మొత్తం వ్యవహారాలను ఆయనే చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గంట శ్రీనివాసరావు పోటీ నుంచి తప్పుకుని కుమారుడు రవితేజను బరిలో దించుతారని తెలుస్తోంది. అయితే తనకు ఎంపీగా పార్లమెంట్ కు వెళ్లాలని ఉందని గంటా చెప్పారు. కానీ విశాఖ నుంచి మరోసారి ఎంపీగా తాను బరిలో దిగుతానని శ్రీ భరత్ ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం పునర్విభజనలో ఏర్పడబోయే విశాఖ సెంట్రల్ లోక్సభ నియోజకవర్గ నుంచి బరిలోకి దిగేందుకే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

* టిడిపి ద్వారానే ఎంట్రీ..
తెలుగుదేశం పార్టీ ద్వారా 1999లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు గంటా శ్రీనివాసరావు. ఆ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు. 2004లో మాత్రం చోడవరం నుంచి అసెంబ్లీకి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు గంటా శ్రీనివాసరావు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టిడిపిలో చేరి భీమిలి నుంచి గెలిచారు. ఐదేళ్లపాటు మంత్రి పదవి చేపట్టారు. 2019లో మాత్రం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2024లో తిరిగి భీమిలికి వచ్చి పోటీ చేసి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం కొత్తగా ఏర్పడబోయే లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

Exit mobile version