Vallabhaneni Vamsi : ఏపీలో( Andhra Pradesh) కూటమి దూకుడు మీద ఉంది. ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో దూకుడుగా వ్యవహరించిన నేతలను టార్గెట్ చేసుకుంది. అందులో కొందరు జైలు జీవితం అనుభవించారు కూడా. మరికొందరు మాత్రం న్యాయస్థానాల ద్వారా ఉపశమనం పొందుతున్నారు. అయితే వల్లభనేని వంశీ మోహన్, పోసాని కృష్ణ మురళి లాంటి నేతలు మాత్రం తప్పించుకోలేకపోయారు. పోసాని కృష్ణ మురళి సుమారు 26 రోజులపాటు రిమాండ్ లో ఉండిపోయారు. వల్లభనేని వంశీ మోహన్ కు ఇప్పట్లో విముక్తి లభించే అవకాశం కనిపించడం లేదు. అందరికంటే ముందు అరెస్టయ్యారు బోరుగడ్డ అనిల్ కుమార్. మధ్యలో ఓసారి బెయిల్ పై విడుదలై మళ్లీ జైల్లోకి వచ్చారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పోసానికి బెయిల్ దక్కింది. కానీ వల్లభనేని వంశీ మోహన్ కు వచ్చినట్టే వచ్చి బెయిల్ దక్కకుండా పోతోంది. ఇప్పట్లో ఆయనకు బెయిల్ లభించే అవకాశం కనిపించడం లేదు.
Also Read : సజ్జల ఔట్.. ఆయన స్థానంలో కొత్త నేతకు జగన్ అవకాశం!
*టిడిపి ద్వారా ఎంట్రీ..
తెలుగుదేశం ( Telugu Desam) పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వల్లభనేని వంశీ మోహన్. 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచారు. 2019లో సైతం రెండోసారి టిడిపి తరఫున విజయం సాధించారు. అయితే అక్కడకు కొద్ది రోజులకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అది మొదలు చంద్రబాబు కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు. ఒకానొక దశలో వారి కుటుంబ సభ్యులకు కూడా వల్లభనేని చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. అందుకే ఇప్పుడు కేసుల రూపంలో మూల్యం చెల్లించుకుంటున్నారు. నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉండి పోవాల్సిన పరిస్థితి వల్లభనేని వంశీ మోహన్ పై ఏర్పడింది. అయితే ఇప్పట్లో ఆయనకు కోర్టుల్లో ఉపశమనం దక్కే అవకాశం లేదు. దీనిపై ఆయన అభిమానుల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. టిడిపి సోషల్ మీడియా మాత్రం సెటైరికల్ గా కామెంట్లు పెడుతోంది.
* రెండు కేసుల్లో బెయిల్
తాజాగా ఓ రెండు కేసుల్లో వల్లభనేని వంశీ మోహన్ కు( Vallabha Neni Vamsi Mohan) ఉపశమనం దక్కింది. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. దీంతో ఆయన విడుదల తప్పదని భావించారు అభిమానులు. కానీ కిడ్నాప్ తో పాటు కార్యాలయం పై దాడి విషయంలో మాత్రం ఆయనకు బెయిల్ లభించడం లేదు. భూ కబ్జా కేసుకు సంబంధించి బెయిల్ వచ్చింది. కానీ ఓ రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో ఇప్పట్లో వంశీ విడుదల ఉండదని తేలిపోయింది. దీనిపైనే రకరకాల చర్చ నడుస్తోంది. మరోవైపు వంశి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని.. ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని న్యాయస్థానాన్ని కుటుంబ సభ్యులు ఆశ్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
* టిడిపి హై కమాండ్ దయతలిస్తేనే..
ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపి( Telugu Desam) హై కమాండ్ దయతలిస్తేనే వల్లభనేని వంశీ మోహన్ బయటకు వచ్చేది. లేకుంటే మాత్రం మరి కొంతకాలం జైలు జీవితం తప్పదు. అయితే అప్పట్లో వల్లభనేని వంశీ మోహన్ చేసిన కామెంట్స్ పై ఇప్పటికీ టిడిపి శ్రేణులు మండిపడుతూనే ఉంటాయి. నాటి కామెంట్స్ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ ట్రోల్ చేస్తుంటాయి. మరి కొంతకాలం ఆగితే గాని టిడిపి హై కమాండ్ వల్లభనేని వంశీ మోహన్ పై దయతలిచే అవకాశం లేదని ప్రచారం నడుస్తోంది. మొత్తానికి అయితే కుటుంబ సభ్యుల్లో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. గతంలో కూడా వల్లభనేని వంశీ మోహన్ ఆరోగ్యం పై రకరకాల ప్రచారం నడుస్తూ వచ్చింది. ఆయనకు అనారోగ్య కారణాలతో బెయిల్ పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read : ఏపీ తీరాన్ని కరెక్ట్ గా వాడుకుంటున్న చంద్రబాబు!