Site icon OkTelugu

TDP Office Attack: టిడిపి ఆఫీస్ పై దాడి.. వైసిపి కీలక నేతల చుట్టూ ఉచ్చు

TDP Office Attack

TDP Office Attack

TDP Office Attack: ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసకర ఘటనలపై సీరియస్ యాక్షన్ కు దిగుతోంది. ముఖ్యంగా 2021 అక్టోబర్ 19న టిడిపి కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి 56 మంది నిందితులను గుర్తించారు పోలీసులు. అప్పట్లో ఈ ఘటనపై కేసు నమోదయినా.. అరెస్టులు మాత్రం జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ కేసు తెరపైకి వచ్చింది. మొత్తం ఈ దాడి కేసులో 56 మంది నిందితులను గుర్తించారు. కీలక నిందితులుగా వైసిపి ఎమ్మెల్సీ అప్పి రెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ లను చేర్చారు. ఓ ఐదుగురిని అరెస్టు చేసి మంగళగిరి న్యాయస్థానంలో హాజరు పరిచారు. వారికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వైసిపి శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి.

వైసీపీ సర్కార్ తో పాటు సీఎం జగన్ పై అప్పట్లో టిడిపి నేతలు ఆరోపణలు చేశారు. దీంతో అప్పట్లో టిడిపి కేంద్ర కార్యాలయం పై వైసీపీ శ్రేణులు దాడులు చేశాయి. అడ్డొచ్చిన వారిపై తీవ్రంగా దాడి చేశారు. చాలామంది గాయపడ్డారు. టిడిపి కార్యాలయంలో పనిచేస్తున్న వారు, పార్టీ నేతలు ప్రాణభయంతో పరుగులు తీశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం కలిగించింది. డిజిపి కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న టిడిపి కార్యాలయం పై దాడి జరిగిన నాటి డిజిపి పెద్దగా స్పందించలేదు. సీఎం జగన్ సైతం లైట్ తీసుకున్నారు. కార్యకర్తలకు బీపీ వస్తే ఇలానే ఉంటుందని హేళనగా మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ పర్యవేక్షించారని ఆరోపణలు వచ్చాయి.కానీ అప్పట్లో చిన్న చిన్న కేసులు నమోదు చేసిన పోలీసులు పట్టించుకోవడం మానేశారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టిడిపి కార్యాలయం పై జరిగిన దాడిని సీరియస్ గా తీసుకుంది. నాటి ఘటనకు సంబంధించి సీసీ పూటేజీలు, వీడియోలను చూసిన పోలీసులు ఈ దాడిలో మొత్తం 57 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. కొత్తగా 27 మంది నిందితులను గుర్తించగలిగారు. ఇందులో వైసీపీ కీలక నేతలు ఉండడంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి, దేవినేని అవినాష్ తో పాటు విజయవాడ నగరపాలక సంస్థ వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్ అంబేద్కర్, గుంటూరు కార్పొరేషన్ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానంద్, గిరి రాము, ఎస్.కె ఖాజా మొహిద్దిన్, షేక్ మస్తాన్వలిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. త్వరలో మరిన్ని అరెస్టులు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

Exit mobile version