Tammineni Sitaram: తప్పు ఆవుదా? తమ్మినేని హాట్ కామెంట్స్.. ఇరకాటంలో వైసిపి

వైసీపీ ఈ పరిస్థితికి కొంతమంది నేతల తీరే కారణం. వారు చేసిన కామెంట్స్, తిట్ల దండకం పార్టీకి తీరని నష్టానికి గురిచేసింది. ఇప్పుడు తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో కొందరు నేతలు సైతం సక్రమంగా మాట్లాడడం లేదు. అలానే కొనసాగితే వైసిపికి డ్యామేజ్ ఖాయం.

Written By: Dharma, Updated On : September 26, 2024 10:00 am

Tammineni Sitaram

Follow us on

Tammineni Sitaram: ప్రస్తుతం ఏపీలో తిరుమలలో వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఈ విషయంలో వైసీపీని కార్నర్ చేసింది టిడిపి కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ముప్పేట దాడి చేస్తున్నారు. దీంతో వైసిపి ఆత్మరక్షణలో పడింది. గత వంద రోజులు మాట్లాడని వారు మీడియా ముందుకు వచ్చారు. టిడిపి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఖండించారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే చంద్రబాబు ఈ తరహా ప్రచారానికి తెర తీసారనిజగన్ ఆరోపించారు. సిబిఐతో పాటు సింగిల్ జడ్జి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టిటిడి చైర్మన్లుగా పనిచేసిన వై వి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలు ఖండించారు. అది తప్పుడు ప్రచారం గా పేర్కొన్నారు. తాజాగా మాజీ మంత్రులు కొడాలి నాని, తమ్మినేని సీతారాం ఈ వివాదం పై మాట్లాడారు. కొడాలి నాని కాస్త కూల్ గా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తేలికపాటి విమర్శలకు మాత్రమే పరిమితం అయ్యారు. అయితే స్పీకర్ గా పనిచేసిన సీనియర్ నేత తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు మాత్రం అభ్యంతరకరంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

* తప్పును ఒప్పుకునేలా
తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. అందులో జంతు కొవ్వు కలిసిందన్నది ఓ నిర్ధారణలో తేలినట్లు టిడిపి నేతలు చెబుతున్నారు. అయితే ఈ తప్పును తమ్మినేని ఒప్పుకున్నట్లు ప్రకటన చేశారు. తప్పు టిటిడిది కాదు.. ఆవుది అంటూ అర్థం వచ్చేలా మాట్లాడారు. సాధారణంగా ఆవాలు, పామాయిల్ తినే ఆవులు ఇచ్చే పాలలో కల్తీ అవుతుందని.. అలా నెయ్యిలో కల్తీ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ తమ్మినేని చేసిన ప్రకటన వైసీపీకి మరో డ్యామేజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.

* రాజకీయ ప్రతీకారంతో చేశారని ఆరోపణ
అయితే ఇది ఉద్దేశపూర్వకంగా, రాజకీయ పగతో చేసిన పని అని ఇప్పటివరకు వైసీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. కానీ తమ్మినేని మాత్రం ఏకంగా ఆవుపై నెపం మోపడం హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఆయన మట్టిలో ఉండే మాట్లాడుతున్నారా? అని నెటిజన్లు ప్రశ్నించే దాకా పరిస్థితి వచ్చింది. అంటే తమ్మినేని కల్తీ జరిగిందని ఒప్పుకున్నట్టేనా? నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందా? అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సమస్యపై మాట్లాడిస్తే తమ్మినేని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సొంత పార్టీలోనే తమ్మినేని కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి.

* వైసీపీకి భారీ డ్యామేజ్
ఈ వివాదం కోట్లాదిమంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ వివాదములో వైసీపీకి భారీ డ్యామేజ్ జరిగింది. దాని నుంచి బయటపడేందుకు ఆ పార్టీ ఆపసోపాలు పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ఒక సీనియర్ నేతగా ఉన్న తమ్మినేని.. ఒక్కసారిగా అలా మాట్లాడేసరికి ఈ వివాదం యూటర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.