Punarvika: ఇప్పటివరకు సోషల్ మీడియా( social media) దుష్పరిణామాలనే చూసాం. కానీ తొలిసారిగా సోషల్ మీడియా ద్వారా ఒక మంచి కార్యక్రమం కొనసాగింది. చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు సోషల్ మీడియా అలుపెరగని కృషి చేసింది. ఆ చిన్నారి ఆపరేషన్ కోసం అవసరమైన నిధుల సేకరణలో సక్సెస్ అయ్యింది. 11 నెలల పునర్విక అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆ చిన్నారి ఆరోగ్యం కుదుటపడాలంటే 16 కోట్ల రూపాయల ఇంజక్షన్ అవసరం. కానీ వారిది నిరుపేద కుటుంబం కావడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియా సామాజిక బాధ్యతగా తీసుకొని.. సోషల్ మీడియా వేదికగా సాయం కోసం హోరెత్తించారు. రెండు రాష్ట్రాల ప్రజలు ఆ 11 నెలల చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లలో ఓ మహా యజ్ఞం లా సాగిన ఈ క్యాంపెయిన్ సక్సెస్ అయింది. రూపాయి రూపాయి కలిపి అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అయింది.
* పేద కుటుంబానికి కష్టం..
కర్నూలు జిల్లా( Kurnool district) వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్, పుష్పావతి దంపతులకు ఇద్దరు పిల్లలు. గత ఏడాది మేలో పునర్విక శ్రీ జన్మించింది. పుట్టుకతోనే కోట్ల మందిలో ఒకరికి వచ్చే అత్యంత అరుదైన ఎస్ ఎం ఎ టైప్ 1 వ్యాధి ఉండడాన్ని డాక్టర్లు గుర్తించారు. దీనిని నయం చేయాలంటే ఒక ఇంజక్షన్ కోసమే 16 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పేద కుటుంబానికి చెందిన సురేష్ కుమార్ అంత డబ్బులు ఖర్చు చేసే స్తోమత లేదు. ప్రభుత్వంతో పాటు అధికారులను సాయం కోసం వేడుకున్నాడు. అయితే భారీ నగదు కావడంతో సాయం విషయంలో జాప్యం జరిగింది.
* క్రౌడ్ ఫండింగ్..
అయితే సోషల్ మీడియా వేదికగా కంటెంట్ క్రియేటర్లు( content creators), ఇన్ఫ్లుయెన్సర్లు ఆ పాప కోసం క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజల దగ్గరకు వెళ్లి పాప పరిస్థితిని వివరించారు. ముఖ్యంగా ట్రావెల్ విత్ జగదీష్ అనే ఇన్ఫ్లుయెన్సర్ అత్యధికంగా కోటి యాభై లక్షల రూపాయలు సేకరించారు. ఇలా మొత్తం ఎనిమిది కోట్ల యాభై లక్షల వరకు సేకరణ జరిగింది. మరోవైపు ప్రభుత్వంతో పాటు ముఖ్యదాతల సహకారం కూడా తోడైంది. ఆ చిన్నారి ట్రీట్మెంట్ కు అవసరమైన నగదు సమకూరింది.
* చిన్నారి తండ్రి ప్రత్యేక విజ్ఞప్తి..
చిన్నారి చికిత్సకు సంబంధించి నగదు సమకూరడంపై తండ్రి సురేష్ కుమార్( Suresh Kumar) ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. పునర్విక ట్రీట్మెంట్ కు అవసరమైన డబ్బులు సమకూరాలని చెప్పారు. ఇకపై ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని.. డబ్బు సేకరణను నిలిపివేయాలని.. ఎవరూ డబ్బులు దానం చేయవద్దని కోరారు. తన బిడ్డ ట్రీట్మెంట్ కోసం సాయం చేసిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. తన కూతురి ట్రీట్మెంట్ కంటే ఎక్కువగా డబ్బులు సేకరణ జరిగిందని.. అలా మిగిలిన డబ్బులు అనారోగ్యంతో బాధపడే చిన్నారులకు అందిస్తానని సురేష్ కుమార్ ప్రకటించారు. అయితే చిన్నారిని కాపాడడంలో సోషల్ మీడియా ప్రత్యేక పాత్ర పోషించడం మాత్రం అభినందనలు అందుకుంటుంది.