YS Sunitha : వివేకా హత్యపై కుమార్తె సునీత గట్టిగానే పోరాటం చేస్తున్నారు. నాలుగేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతునే ఉన్నారు. ఈ క్రమంలో ఆమె బలమైన ప్రత్యర్థులతోనే తలపడుతున్నారు. అన్నింటికీ సిద్ధమయ్యే పోరాటంలోకి దిగారు. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొంటున్న సవాళ్లు అన్నీఇన్నీ కావు. ఏపీలో అధికారంలో ఉన్నది తన సోదరుడు జగన్. ఆరోపణలు ఎదుర్కొంటోంది కుటుంబ వ్యక్తులే. ఇటువంటి క్లిష్ట సమయంలో ఎన్నెన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాయి. అయితే ఆమె పోరాటాన్ని వెనుక ఉండి నడిపిస్తోంది చంద్రబాబు అని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పైగా ఆస్తి కోసమే ఆమె ఈ అఘాయిత్యానికి కారకులై ఉండొచ్చు కదా అన్న అనుమానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
భూ పత్రాలు వెలుగులోకి..
అయితే ఈ మధ్యనే సునీత తన తండ్రి ఆస్తులను తన పేరిట రాయించుకున్నారంటూ భూ బదలాయింపు రికార్డులు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు, సునీతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారే ఇటువంటి ప్రచారానికి దిగినట్టు తెలుస్తోంది. సర్వే నంబర్లు, భూ బదలాయింపు తేదీలతో సహా ఉన్న ధ్రువపత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే వీటిపై మిశ్రమ స్పందన వస్తోంది. వైసీపీ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తుండగా.. తటస్థ నెటిజన్లు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. తండ్రి ఆస్తుల కుమార్తెకు కాకుండా ఎవరికి సంక్రమిస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఆస్తులు కాదు విషయం.. వివేకాను ఎవరు హత్య చేశారు? అనేది తెలియాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆది నుంచి అంతే..
ఆది నుంచి వివేకా హత్య కేసులో నిందితులు, అనుమానితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇదే అంశాన్ని లేవనెత్తారు. వివేకా హత్య ఒక్క రాజకీయ కోణంలో ఎందుకు చూస్తున్నారని.. దీనికి ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయని.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు బయటపడతాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వివేకా రెండో భార్య షమీమ్ ను సైతం తెరపైకి తెచ్చారు. వివేకాకు ఆర్థికపరమైన ఇబ్బందులుండేవని.. ల్యాండ్ షటిల్మెంట్ లు చేసేవారని షమీమ్ వాంగ్మూలం ఇచ్చిన సందర్భాలున్నాయి. వాటన్నింటికీ బలం చేకూరుస్తూ ఇప్పుడు సునీత ఆస్తులను బదలాయించుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
షర్మిళ కామెంట్స్ తో..
అయితే ఈ విషయంలో సునీతకు వైఎస్ షర్మిళ అండగా నిలిచారు. చిన్నాన్న వివేకా సునీతకు ఏనాడో ఆస్తులు రాసిచ్చారని.. అటువంటప్పుడు ఆస్తుల కోసమే వివేకాను సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి ఎందుకు హత్యచేస్తారని ప్రశ్నించడం ద్వారా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. హత్య కేవలం రాజకీయ కోణంలో జరిగింది అని అర్ధం వచ్చేలా షర్మిళ కామెంట్స్ చేశారు. ప్రత్యర్థులు చేస్తున్న ఆర్థిక ఆరోపణలపై స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఈ పరిణామ క్రమంలో సునీత బలవంతంగా తండ్రి ఆస్తులను బదలాయించుకున్నారన్న ప్రచారాన్ని ఎక్కువ మంది లైట్ తీసుకుంటున్నారు. సునీత ప్రత్యర్థుల ప్రచార ప్రయోగాన్ని తిప్పికొడుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More