Reddy Community Political Influence In AP: రెడ్డి సామాజిక వర్గం తీవ్ర అంతర్మధనంతో ఉంది. ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేదన్న బాధ వెంటాడుతోంది. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. తెలుగుదేశం( Telugu Desam) పార్టీ ప్రాధాన్యం ఇస్తోంది కానీ.. అగ్ర తాంబూలం లేదన్న ఆవేదన ఉంది. భారతీయ జనతా పార్టీ పై హిందుత్వవాద ముద్ర ఉంది. జనసేన పై కాపు సామాజిక వర్గ ప్రభావం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తే మాత్రం రెడ్డి సామాజిక వర్గం మద్దతు తీసుకొని ఇతర సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తున్నట్లు కనిపిస్తోంది. పోనీ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉండం అంటే అక్కడ పరిస్థితి బాగాలేదు. అందుకే రెడ్డి సామాజిక వర్గం సీరియస్గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సొంతంగానే ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.
Also Read: ఖమేనీ ఖతం.. ఇజ్రాయెల్, అమెరికా ఇకనైనా యుద్ధం ముగిస్తాయా?
* కాంగ్రెస్ తర్వాత వైసిపి..
కాంగ్రెస్ పార్టీ ( Congress Party) అంటేనే రెడ్డి సామాజిక వర్గం. అంతలా ఉండేది ఆ పార్టీలో సామాజిక వర్గ ప్రభావం. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. రాజశేఖర్ రెడ్డి నాయకత్వం కింద రెడ్డి సామాజిక వర్గమంతా పనిచేసింది. దీంతో 2004లో తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. 2009లో సైతం రెండోసారి అధికారం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. దానికి ముమ్మాటికి కారణం రెడ్డి సామాజిక వర్గం మద్దతు. రాజశేఖర్ రెడ్డి మరణంతో రెడ్డి సామాజిక వర్గమంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరింది. ఆ సామాజిక వర్గమంతా జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకున్నారు. కానీ ఆయన అనుకున్న స్థాయిలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. రెడ్డి సామాజిక వర్గం నియోజకవర్గాల్లో సైతం ఇతరులకు అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి. తన ఐదేళ్ల పాలనలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనాలు లేకుండా పోయాయి. దీంతో ఆ సామాజిక వర్గం మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సహాయ నిరాకరణ చేసింది.
* జగన్ వైఖరిలో మార్పు లేక..
అయితే ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) వైఖరిలో మార్పు రావడం లేదు. రెడ్డి సామాజిక వర్గం విషయంలో ప్రత్యేక ఆలోచనలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో తమకోసం ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి రెడ్డి సామాజిక వర్గం ప్రముఖులు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వేదికగా ఇందుకు సంబంధించి సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు రెడ్డి సామాజిక వర్గం ప్రముఖులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒక ప్రత్యేక అజెండాతో ముందుకు సాగుతూ.. ఎన్నికల సమయానికి కలిసివచ్చే రాజకీయ పార్టీలతో ముందడుగు వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి రాజకీయ పార్టీ ఏర్పాటుకు మరికొద్ది నెలలో ఒక తుది రూపు వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?