Peddireddy Family: గత కొంతకాలంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ పొలిటికల్ గా సైలెంట్ గా ఉంది. అయితే మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని నేరుగా కలవలేదు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడిచింది. కానీ తరువాత అటువంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పార్లమెంట్లో గట్టిగానే మాట్లాడారు కూటమి ప్రభుత్వంపై. కానీ ఇటీవల క్షేత్రస్థాయిలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ, వైసీపీలో యాక్టివ్గా కనిపించడం లేదు. తాడేపల్లి కార్యాలయంలో సైతం పెద్దగా జాడలేదు. ఈ పరిస్థితుల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ అసంతృప్తితో ఉందన్న ప్రచారం రోజురోజుకు పెరుగుతోంది. ఒకానొక దశలో ఆ ఫ్యామిలీ బిజెపిలో చేరుతుందన్న ప్రచారం కూడా నడిచింది. కానీ అందులో వాస్తవం లేకపోవచ్చు కానీ.. ఆ ఫ్యామిలీ అసంతృప్తితో ఉందన్న మాట మాత్రం వాస్తవం. జగన్ వెంట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లేకపోవడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దగా కనిపించకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
* పలకరించని జగన్..
మద్యం కుంభకోణంలో అరెస్టయ్యారు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి. చాలా రోజులపాటు ఆయన జైల్లోనే ఉండిపోయారు. అయితే విజయవాడతో పాటు వివిధ నగరాల్లో జైల్లో ఉండే వైసీపీ నేతలను జగన్మోహన్ రెడ్డి పరామర్శించేవారు. కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయంలో మాత్రం దూరంగా ఉండిపోయారు. మిథున్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం రాజమండ్రిలోనే గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో సంఘీభావం కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి రాకపోవడం ఆ ఫ్యామిలీలో అసంతృప్తికి కారణంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి కోసం తాము ఎంతగానో కృషి చేస్తే.. తాము కష్టంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి అండగా నిలవకపోవడంపై వారు ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వారు బెయిల్ పై బయటకు వచ్చాక నేరుగా జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. కానీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి మాత్రం అలా కలవలేదు. దీంతో అప్పట్లోనే తెగ ప్రచారం నడిచింది ఆ ఫ్యామిలీ అసంతృప్తితో ఉందని.
* చుట్టూ కేసులు..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ కూడా అనేక కేసులు తిరుగుతున్నాయి. వివాదాలు నడుస్తున్నాయి. పైగా కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి పై దూకుడు మీద ఉంది. దానికి కారణం లేకపోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు.. సీనియర్ మంత్రిగా ఉండేవారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాయలసీమ రాజకీయాలు ఆయన కనుసన్నల్లో నడిచేవి. కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు చంద్రబాబును సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టనీయకుండా పెద్దిరెడ్డి పెద్ద ప్రయత్నాలు చేశారు. హిందూపురంలో బాలకృష్ణను ఓడించేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. మరోవైపు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు చాలా రకాల విన్యాసాలు చేశారు. అప్పట్లో రాయలసీమ నుంచి పిఠాపురం నియోజకవర్గానికి మనుషులను తెప్పించారని కూడా పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇంతలా అప్పట్లో రాజకీయాలను ప్రభావితం చేశారు ఆ తండ్రి కొడుకులు. అందుకే ఇప్పుడు కూటమికి టార్గెట్ అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి మాత్రం అంతగా ఆదరణ దక్కకపోవడంతో వారు ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పరు కానీ.. వారు మాత్రం అసంతృప్తితో ఉన్నారన్నది మాత్రం వైసిపి వర్గాల్లో వినిపిస్తున్న మాట.

