Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ వారాహి దీక్షలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా దీక్ష చేపడుతున్నారు. దీక్ష తుది దశకు చేరుకుంది.ఆదివారం కానీ.. సోమవారం కానీ దీక్షను విరమించే అవకాశాలు ఉన్నాయి.దీక్షలో ఉంటూనే తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో పర్యటించారు. పింఛన్ల పంపిణీతో పాటు అధికారిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తిరిగి మంగళగిరిలోనే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు పవన్.
వారాహి ఏకాదశ దిన దీక్షలో భాగంగా సూర్యారాధనను నిర్వహించారు. సమాజం, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదిత్య యంత్రాన్ని వేసి దానికి పూజలు చేశారు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సూర్య భగవానుడిని ఆరాధించారు.గత కొంతకాలంగా పవన్ వెన్ను సంబంధిత ఇబ్బందితో బాధపడుతున్నారు. దీంతో సూర్య నమస్కారాలు చేయడానికి వీలు లేకుండా పోయింది. అందుకే సూర్య నమస్కారాలకు బదులు మంత్ర సహిత ఆరాధనను నిర్వహించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హరనాథ శర్మ, వేణుగోపాల శర్మ పర్యవేక్షించారు.
సాధారణంగా పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే వారాహి దీక్ష చేపడుతున్నారు. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారాహి దీక్ష చేపట్టారు. అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ పూజాధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో పాలన సజావుగా నడవాలని వారాహి దీక్ష చేపడుతున్నారు. పురాతన యజ్ఞ యాగాధులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. లోకకళ్యాణార్థం సూర్య భగవానుడి ఆరాధనను చేపట్టారు.