Homeఆంధ్రప్రదేశ్‌YS Bharathi  : ప్రత్యక్ష రాజకీయాల్లోకి వైఎస్ భారతి.. చెల్లెలి కోసం తప్పదంటున్న జగన్!

YS Bharathi  : ప్రత్యక్ష రాజకీయాల్లోకి వైఎస్ భారతి.. చెల్లెలి కోసం తప్పదంటున్న జగన్!

YS Bharathi : వైయస్ భారతి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టనున్నారా? నేరుగా రంగంలోకి దిగనున్నారా? పార్టీ వాయిస్ ను వినిపించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. గట్టిగానే వాయిస్ వినిపిస్తూ వచ్చారు. వైసిపి ఘోర పరాజయానికి ఆమె ఒక కారణం. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంత నష్టం చేయాలో.. అంతలా వైసిపికి చేశారు. ఓటమి తర్వాత కూడా వైసీపీని విడిచిపెట్టడం లేదు. సోదరుడు జగన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికీ వైసీపీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అధికారపక్షంగా కూటమి ఉన్నా.. విపక్షమైన వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అయితే వైసీపీలో ఆమెను ఎదుర్కోవడం ఎవరి తరం కావడం లేదు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చేవారు. తరువాత ఆయన సైలెంట్ అయ్యారు. ఇప్పుడు పేర్ని నాని ఎదుర్కొంటున్నారు. ఆమె దూకుడు ముందు నాని కౌంటర్ పనిచేయడం లేదు. దీంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. షర్మిలను అలానే విడిచి పెడితే మొదటికే మోసం వస్తుందని.. వైసీపీని బలోపేతం చేయడం కష్టమని భావిస్తున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా మహిళా నేత కావాలని భావిస్తున్నారు. బయటి వారైతే ఇబ్బందికరమని.. తన సతీమణి భారతీయ అయితే సరిపోతారని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కోడలిగా, జగన్ భార్యగా ప్రజాక్షేత్రంలో అడుగుపెడితే.. ప్రజలు ఆహ్వానిస్తారని భావిస్తున్నారు. షర్మిలను ఢీకొట్టగలరని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

* ముఖం చాటేస్తున్న మహిళా నేతలు
వైసీపీలో మహిళా నేతలకు కొదువ లేదు. మాజీ మంత్రి ఆర్కే రోజా, విడదల రజిని, తానేటి వనిత, పాముల పుష్ప శ్రీవాణి, వాసిరెడ్డి పద్మ.. ఇలా అందరూ ఉన్నారు. అయితే ఐదేళ్ల వైసిపి హయాంలో వీరు ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. కానీ దారుణ పరాజయం ఎదురయ్యేసరికి వీరంతా సైలెంట్ అయ్యారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కనీసం పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. ఇటువంటి సమయంలో షర్మిలను ఎదుర్కోవాలంటే బలమైన మహిళా నేత అవసరం.

* కేసులు వెంటాడుతున్నాయి
జగన్ ను పాత కేసులు వెంటాడుతున్నాయి. అక్రమాస్తుల కేసుతో పాటు బాబాయ్ వివేక హత్య కేసు కూడా తెరపైకి రానుంది. న్యాయస్థానాలు కూడా చాలా వేగంగా స్పందిస్తున్నాయి. రోజువారి విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇస్తున్నాయి. ఈ ఐదేళ్లలో చాలా రకాల పరిణామాలు ఉంటాయి. జగన్ చుట్టూ వివాదాలు నడుస్తాయి. ఒకవేళ జగన్ అరెస్టులు జరిగితే పార్టీని నడిపించే నేత అవసరం. అందుకే భారతిని సిద్ధం చేయాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

* ప్రత్యామ్నాయంగా చూపేందుకు
ప్రస్తుతం షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నారు. చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో జగన్ అడుగులు ఇండియా కూటమి వైపు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ కు స్నేహ హస్తం అందిస్తారని కూడా తెలుస్తోంది. ఇటువంటి సమయంలో షర్మిలకు ప్రత్యామ్నాయంగా భారతి ఉన్నారంటూ చూపేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ వైసీపీ కాంగ్రెస్ వైపు వెళ్ళకుంటే… షర్మిల వాయిస్ ను గట్టిగానే ఎదుర్కొనేందుకు భారతి సరిపోతారని ఒక అంచనాకు వచ్చారు. బయట వారి కంటే కుటుంబ సభ్యులతోనే షర్మిలకు చెప్పాలని జగన్ భావిస్తున్నారు. అయితే తల్లి విజయమ్మ జగన్ వైపు వచ్చే అవకాశం లేకపోవడంతో.. భారతిని తెరపైకి తెస్తున్నట్లు సమాచారం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version