YS Jagan Mohan Reddy Arrest: జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) విషయంలో అనేక రకాల ప్రచారం నడుస్తూ ఉంది. ఆయన అరెస్టు తప్పదన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. దానికి కారణం లేకపోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడుతోంది. ముఖ్యంగా మద్యం కుంభకోణం విషయంలో 3500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ స్కామ్ లో అరెస్టులు కూడా జరిగాయి. అయితే అంతిమంగా లబ్ధిదారుడు పెద్ద బాస్ అని దర్యాప్తులో తేలినట్లు కూటమి ప్రభుత్వం చెబుతోంది. కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును అరెస్టు చేసి తప్పు చేశారు. దానికి మూల్యం చెల్లించుకున్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఆ తప్పిదానికి పాల్పడరని ఒక అంచనాలు ఉన్నాయి.
Also Read: రాష్ట్ర రాజకీయాల్లో ముగిసిన నితీశ్ శకం.. బీజేపీ ఖాలాలోకి బిహార్!
* అంతా ప్రణాళిక ప్రకారం
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం కేసుల నమోదు, అరెస్టుల పర్వం నడుస్తోంది. ముఖ్యంగా నిందితులుగా పరిగణిస్తున్న నేతలకు చట్టపరంగా ఎన్నో మినహాయింపులు ఇస్తున్నారు. కోర్టులకు వెళ్లి ఉపశమనం పొందేలా ఛాన్స్ కల్పిస్తున్నారు. అలా చట్టపరంగా మినహాయింపులు రాని వారిని మాత్రమే అరెస్టు చేస్తున్నారు. అరెస్ట్ అయిన వారు స్వేచ్ఛగా న్యాయ సహాయం పొందేలా కూడా చేస్తున్నారు. తద్వారా ఇవి ప్రతికార రాజకీయాలు కావని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి విషయంలో సైతం ఇదే ఫార్ములాతో ఉన్నారట కూటమి పెద్దలు.
* కొత్తగా విద్యుత్ కేసు..
వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలంటే మద్యం కుంభకోణానికి మించి ఒక అంశం కూటమికి దొరికిందట. అదే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కుంభకోణం ఒకటి బయటకు వచ్చింది. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ను అధిక ధరలకు కొనుగోలు చేసి వేల కోట్ల రూపాయలు వెనుకేసుకున్నట్లు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బలమైన అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం వద్ద సమాచారం ఉందని తెలుస్తోంది. దీనిపై వారం రోజులపాటు సీరియస్గా దర్యాప్తు చేస్తే అసలు నిందితులు దొరకడం ఖాయం. అంతిమ లబ్ధిదారుడు ఎవరన్నది బహిరంగ రహస్యం. కానీ ఎందుకో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గుతోంది. ఈ అవినీతి కేసులను 2029 ఎన్నికల వరకు ఉంచి.. ఆ అవినీతి వ్యతిరేక ప్రచారంతోనే మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో కూటమి ప్రభుత్వం చూసి చూడనట్టుగా ముందుకు సాగుతోంది. రోజుకో అవినీతి కేసును బయటకు తీసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తే.. ఆ పార్టీ మారు మాట్లాడదు. కూటమి ప్రభుత్వం పై ఉండే చిన్నపాటి వ్యతిరేకత కూడా కొట్టుకుపోతుందన్న ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
* రాష్ట్రానికి పెరిగిన సహకారం..
అయితే గతానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందుతున్నాయి. అమరావతి తో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు అవుతున్నాయి. విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డితో ఉన్న పాత స్నేహంతో కేంద్రం.. ఆయన విషయంలో ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసిందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఆయన పాత కేసులు తెరపైకి రావడం లేదు. కూటమి ప్రభుత్వ పరంగా మోపిన కేసుల విషయంలో సైతం కేంద్రం నోరు తెరవడం లేదు. అంటే భారతీయ జనతా పార్టీ పెద్దలకు కూడా ఏపీ విషయంలో ఒక క్లారిటీ ఉందన్నమాట. మొత్తానికి అయితే జగన్ అరెస్ట్ విషయంలో చంద్రబాబు అంత త్వరగా సాహసం చేయరన్న మాట.