IBM returns to Visakhapatnam: ఏపీకి ( Andhra Pradesh) పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు విశాఖకు వెల్లువలా వస్తున్నాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో గతంలో విశాఖ నుంచి వెళ్లిపోయిన సంస్థలు సైతం తిరుగు ముఖం పడుతున్నాయి. ముఖ్యంగా ఐటీ దిగ్గజ సంస్థ ఐబీఎం తిరిగి విశాఖలో అడుగు పెడుతుండడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, కూటమి ప్రభుత్వ ప్రోత్సాహక విధానాల పుణ్యమా అని విశాఖ నుంచి గతంలో వెళ్లిపోయిన సంస్థలు సైతం తిరిగి వస్తుండడం శుభపరిణామం. కూటమి ప్రభుత్వం ఆశిస్తున్నట్టు మాదిరిగా విశాఖ నగరం మళ్లీ గ్లోబల్ ఐటీ హబ్ గా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాకతో.. దాని అనుబంధ సంస్థలు ఒక్కొక్కటి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో విశాఖ వీడి వెళ్లిన ఐబీఎం రెట్టింపు ఉత్సాహంతో విశాఖకు తిరుగు ముఖం పట్టడం విశేషం.
గత ప్రభుత్వ హయాంలో తరలింపు..
దశాబ్దాల కిందట విశాఖలో ఐబీఎం( IBM) ఏర్పాటయింది. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖను వదిలి వెళ్ళింది సదరు సంస్థ. రుషికొండ హిల్ 3 పై కేటాయించిన స్థలంలో ఐబీఎం కార్యకలాపాలు నిర్వహించేది. అయితే వైసిపి ప్రభుత్వం కొన్ని నిబంధనలు తెరపైకి తేవడంతో అప్పట్లో ఐబీఎం విశాఖ నుంచి వెళ్లిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఐబీఎం వెనక్కి ఇచ్చిన సుమారు 21 ఎకరాల స్థలాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరో దిగ్గజ ఐటీ సంస్థ టిసిఎస్ కు కేటాయించింది. అయితే తాజాగా ఐబీఎం సంస్థ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాలో అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకుంది. తద్వారా కేవలం విశాఖలో కార్యాలయం ఏర్పాటుకే పరిమితం కాకుండా.. భారీ ఎగుమతుల లక్ష్యంతో రాబోతున్నట్లు స్పష్టమవుతోంది. రానున్న మూడేళ్లలో విశాఖ కేంద్రంగా సుమారు రూ.321 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఐబీఎం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: ఉగాదికి ఏపీలో రాజకీయ సంచలనం!
భారీగా ఉద్యోగాలు..
ఐబీఎం రాకతో విశాఖలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఐటీ నిపుణులకు భారీగా అవకాశాలు లభించునున్నాయి. సుమారు 1000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలగనుంది. ఇప్పటికే కార్యాలయ భవన ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణ ప్రక్రియ పూర్తయింది. అయితే గతంలో ఐబీఎం విశాఖ నగరాన్ని వీడింది. ఇప్పుడు తిరిగి రావడం ద్వారా సరికొత్త సంకేతాలు పంపించింది. నగరంపై పెట్టుబడిదారులకు నమ్మకం పెరిగిందని అనిపిస్తోంది. మరోవైపు ఐబిఎంతో పాటు ప్రపంచ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తోంది. అయితే ఇప్పటివరకు అద్దె భవనాల్లో డీసీఎస్ కొనసాగుతోంది. పెరిగిన ఐటీ సంస్థలతో సొంత క్యాంపస్ ఏర్పాటు చేసుకోవాలని చూస్తోంది. ప్రభుత్వం ఎండాడ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో టిసిఎస్ శాశ్వత భవనం దిశగా అడుగులు వేస్తోంది. మొత్తానికి అయితే విశాఖ నగరానికి వరుసగా శుభవార్తలు అందుతుండడం విశేషం.